జగన్కు షాక్: ముద్రగడ వెంటపడ్తున్న పవన్కళ్యాణ్
అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ సెప్టెంబర్ 9వ తేదీన కాకినాడలోని జేఎన్టీయూ ప్రాంగణంలో నిర్వహించనున్నారు. పదకొండు ఎకరాల విస్తీర్ణంలో ఈ సభ జరగనుంది. పవన్ కళ్యాణ్ బహిరంగ సభ పైన రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
ఓ వైపు కాకినాడలో సభను ఎందుకు పెడుతున్నానో పవన్ చెప్పారు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం బీజేపీ ఎక్కడైతే ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని హామీ ఇచ్చిందో అక్కడే తాను నిలదీస్తానని చెప్పారు. అదే సమయంలో హోదా పైన నిలదీయని టిడిపిని నిలదీస్తానని చెబుతున్నారు.
మరోవైపు, కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు, ఆయన వెనుక ఉన్నట్లుగా భావిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెక్ చెప్పేందుకు కూడా పవన్ను రంగంలోకి దించారని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, పవన్ను సొంతగా వచ్చినా, ఎవరైనా రంగంలోకి దింపారని భావించినా.. క్రెడిట్ మాత్రం పవన్కే వెళ్తుందని అంటున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ టిడిపి-బిజెపి కూటమికి మద్దతు పలికారు. ఇప్పుడు అదే కూటమిని ఆయన హోదా పైన నిలదీసేందుకు సంసిద్ధులయ్యారు. తద్వారా ఇన్నాళ్లు తనపై విమర్శలు గుప్పిస్తున్న వారికి బిజెపిని నిలదీయడం ద్వారా సమాధానం ఇస్తున్నారు.
మరోవైపు, కాపుల కోసం ప్రభుత్వం వేసిన కమిషన్ గడువు పూర్తవుతోంది. ఇలాంటి సమయంలో కమిషన్ నివేదిక ఇవ్వకున్నా, ప్రభుత్వం దాని చర్యలు తీసుకోకున్నా ఏం చేయాలనే విషయమై ముద్రగడ పద్మనాభం కాపు నేతలు చిరంజీవి, దాసరి నారాయణ రావు వంటి సీనియర్లతో వరుసగా భేటీ అయ్యారు.
ముద్రగడను క్యాష్ చేసుకునేందుకు ఆయన వెనుక జగన్ ఉన్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఏం చేయాలనే విషయమై చర్చించేందుకు సెప్టెంబర్ 11వ తేదీన స్టేట్ లెవల్ సమావేశం రాజమహేంద్రవరంలో జరగనుంది.
కొద్ది రోజుల క్రితం ముద్రగడ మళ్లీ తెరపైకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ తిరుపతిలో సభ పెట్టారని అంటున్నారు. ఇప్పుడు ముద్రగడ తన ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు.. పైగా స్టేట్ లెవల్ మీటింగ్ నిర్వహించేందుకు సన్నద్దమవుతున్నారు.
ఇలాంటి సమయంలో పవన్ సభ.. ముద్రగడ సమావేశాలను కార్నర్ చేస్తుందని అంటున్నారు. ఇప్పటికే పవన్ తిరుపతి సభ నేపథ్యంలో కేంద్రంలో ప్రత్యేక హోదా బదులు భారీ ప్యాకేజీ పైన కదలిక వచ్చింది.
జనసేన ట్రెజరర్ మారిశెట్టి రాఘవయ్య మాట్లాడుతూ.. కాకినాడ బహిరంగ సభకు తమ పార్టీ పిలుపు నిచ్చిందని, ఇప్పటికే మంచి స్పందన వస్తోందని, ఈ ఉద్యమాన్ని (ప్రత్యేక హోదా) ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
మరోవైపు, పోలీసులు, అధికారులు పవన్ సభ పైన దృష్టి సారించారు. శనివారం నాడు డీజీపీ కాకినాడ వచ్చారు. పవన్ సభ నేపథ్యంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని పోలీసులకు సూచించారని తెలుస్తోంది.
కాకినాడలో పవన్ సభ తర్వాత, రెండు రోజులకే ముద్రగడ నేతృత్వంలో కాపు నేతల సమావేశం జరగనుంది. దీనిపైనా పోలీసులు దృష్టి సారించారు. ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎనిమిది నెలల క్రితం ముద్రగడ తుని ఘటన విధ్వంసానికి దారి తీసిన విషయం తెలిసిందే.