ఏ అవార్డుఐనా లాబీయింగ్ చేస్తేనే: రాందేవ్ సంచలనం
ఢిల్లీ: పద్మ పురస్కారాలు అయినా నోబెల్ అవార్డు అయినా లాబీయింగ్ చేసేవారిని, రాజకీయంగా ఒత్తిళ్లి తెచ్చే వారినే వరిస్తాయని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఆయన తిరస్కరించిన విషయం తెలిసిందే.
రాజకీయ పలుకుబడి ఉన్న వారికే పద్మ, నోబెల్ అవార్డులు దక్కుతాయన్నారు. ఇటువంటి అవార్డుల ఎంపికలో పెద్ద ఎత్తున లాబియింగ్ జరుగుతుందన్నారు. మంచి వ్యక్తులకే పద్మ, నోబెల్ అవార్డులు లభిస్తాయని ప్రపంచంలోని అందరికీ తెలుసునని, కానీ రాజకీయ పలుకుబడి, భారీగా లాబీయింగ్ జరిపిన వారే ఇందులో విజయం సాధిస్తారన్నారు.
యోగా విస్తరణ దిశగా, అసోచాం ఏర్పాటు చేసిన కార్యక్రమానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పది కోట్ల కుటుంబాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మద్యం కోసం డబ్బులు వసూలు చేసే వారికన్నా యోగా నేర్పేందుకు రుసుము తీసుకునే వారే మేలన్నారు.
యోగాను పొరపాటున రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) ప్రమోట్ చేసి ఉంటే అది కూడా వివాదాస్పదమై చేసే వారని విపక్షాలపై విమర్శలు గుప్పించారు. మందుల ద్వరా వ్యాధుల నుంచి విముక్తు పొందలేమన్నారు.
వ్యాధుల నుండి బయటపడేందుకు తమ ఆస్తులను ధారపోస్తున్నారన్నారు. ఆరోగ్యకరమైన జీవితం, గడిపేందుకు యోగా ఒక్కటే మార్గమన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం రోజున పదికోట్ల కుటుంబాలు పాల్గొంటాయని చెప్పారు. దేశం మొత్తంలోని ఊబకాయుల బరువును కోటి కిలోల వరకు తగ్గించడానికి సంస్థ తరఫున కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.