శశికళకు షాక్: పొలిటికల్ రంగంలోకి జయలలిత కోడలు
శశికళకు షాక్: పొలిటికల్ రంగంలోకి జయలలిత కోడలు
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న శశికళకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కోడలు దీపా జయకుమార్ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. శశికళ అన్నాడీఎంకే చీఫ్గా ఉంటానంటే ప్రజుల ఏమాత్రం సహించరని దీపా జయకుమార్ వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
జయలలిత సోదరుడు జయకుమార్ కూతురు దీపా జయకుమార్. అన్నాడీఎంకే పార్టీ శశికళ చేతుల్లోకి వెళ్లడం ఆమె ఏమాత్రం జీర్ణించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఆమె శశికళ పైన ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు.
శశికళను సహించరు, ఏ ఒక్కరో పార్టీని చేతుల్లోకి తీసుకెలేరు
శశికళ అన్నాడీఎంకే అధినేత్రి అవుతానంటే ప్రజలు సహించరని దీపా జయకుమార్ వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే ప్రజల పార్టీ అన్నారు. ఈ పార్టీ ప్రజాస్వామ్యమైనది అన్నారు. కాబట్టి ఏ ఒక్కరో ఈ పార్టీని తమ చేతుల్లోకి తీసుకోలేరని శశికళను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
శశికళ నిజమైన లీడర్ కానివారే అవుతారు
అన్నాడీఎంకే ప్రజాస్వామ్య పార్టీ అని, కాబట్ట ఆమెను ఎన్నుకోవాల్సి ఉందని చెప్పారు. శశికళ కావొచ్చు లేదా మరొకరు కావొచ్చు.. పార్టీని తమ చేతుల్లోకి తీసుకోవాలనుకుంటే, ఎన్నిక కాకుండానే పార్టీకి చీఫ్ కావాలనుకుంటే వారు నిజమైన లీడర్ కాదన్నారు. ఆమె ఎన్నికల్లో గెలుపొంది, పార్టీ బాధ్యతలు చేపట్టాలన్నారు.
రాజకీయాల్లోకి రావడంపై..
రాజకీయాల్లోకి రావడంలో తప్పు లేదని దీపా జయకుమార్ అన్నారు. దీపా రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారంపై ప్రశ్నించగా, పైవిధంగా స్పందించారు. అవకాశం ఉంటే, ప్రజలకు సేవ చేయాలనుకుంటే తాను రాజకీయాల్లోకి వస్తే తప్పేమిటని అన్నారు.
జయకుమార్ కూడా..
శశికళ లేదా మరొకరిని తన వారసులుగా జయలలిత ఎప్పుడు ప్రకటించలేదని, చెప్పలేదని అన్నారు. శశికళను, ఆమె కుటుంబ సభ్యులను ఎప్పుడు కూడా జయలలిత రాజకీయాలకు దూరంగా ఉంచారని తెలిపారు.
తెలియకుండా శశికళ చాలా చేశారు, జయకు కోపం తప్పించారు
తన అత్త (జయలలిత)కు తెలియకుండా శశికళ, ఆమె కుటుంబ సభ్యులు చాలా చేశారని చెప్పారు. శశికళ, ఆమె కుటుంబ సభ్యులు చేసిన వాటిపై యలలిత చాలా ఆగ్రహంతో ఉండేవారని తెలిపారు. తన అత్త చనిపోయిన రోజు రాత్రి పోయెస్ గార్డెన్లోకి వెళ్లాలనుకుంటే, తనను అడ్డుకున్నారన్నారు.
8 గంటలు నిరీక్షించా
తన అత్త జయలలిత మృతదేహాన్ని చూసేందుకు తాను ఎనిమిది గంటల పాటు బయటే నిలబడ్డానని, తన అత్తను చూడనివ్వాలని వారిని వేడుకున్నానని, కానీ తనను రానివ్వలేదని చెప్పారు. నేను మా అత్తను ఒకసారి చూసి వెళ్తానని చెప్పానని, అయినా అనుమతించలేదన్నారు. ఆ తర్వాత రాజాజీ హాలుకు వెళ్లానని, అక్కడ కూడా అడ్డుకున్నారన్నారు. కానీ తాను వారితో పోట్లాడి లోపలకు వెళ్లానని చెప్పారు. కాగా, దీపా జయకుమార్ 2002లో జయను కలిశారు. ఆ త్రవాత 2007 నుంచి పెద్దగా సంబంధాలు లేవు. అయితే తనను ఎందుకు అడ్డుకున్నారో తెలియదని దీపా జయకుమార్ చెబుతున్నారు.