రిజర్వేషన్లపై మోడీ వ్యాఖ్య: బాబుకే కాదు కెసీఆర్కూ పంచ్
Recommended Video
హైదరాబాద్: రిజర్వేషన్లపై ప్రధాని మోడీ గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో స్పష్టం చేసినప్పటికీ అది తెలుగు రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందనేది స్పష్టమైంది. రిజర్వేషన్లు యాభై శాతానికి మించి ఉండకూడదనే సుప్రీంకోర్టును రాజకీయ పార్టీలు అతిక్రమించలేవని మోడీ అన్నారు.
మోడీ ప్రకటన అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడినే కాకుండా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కూడా చిక్కుల్లో పడేసిందనే చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల యాభై శాతానికి మించి రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభల్లో బిల్లులను ఆమోదించాయి.
కోటాపై కెసిఆర్ ప్రభుత్వం ఇలా...
ముస్లింల రిజర్వేషన్లను నాలుగు శాతం నుంచి 12 శాతానికి పెంచుతూ, ఎస్టీ రిజర్వేషన్లను ఆరు శాతం నుంచి పది శాతానికి పెంచుతూ బిల్లులను కెసిఆర్ ప్రభుత్వం శాసనసభలో ఆమోదింపజేసుకుంది. దీంతో తెలంగాణ రిజర్వేషన్ల శాతం 62 శాతానికి పెరిగింది. కానీ, అవి అమలులోకి రావాలంటే కేంద్రమే చర్యలు తీసుకోవాలి. మోడీ ప్రకటనతో అవి అమలయ్యే సూచనలు కనిపించడం లేదు.
చంద్రబాబు ప్రభుత్వం ఇలా చేసింది...
చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో బిల్లును ఆమోదింపజేసుకుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతం 55 శాతానికి పెరుగుతాయి. అందువల్ల మోడీ ప్రకటన నేపథ్యంలో ఇవి కూడా అమలయ్యే సూచనలు కనిపించడం లేదు.
ఇరు ప్రభుత్వాలు సైతం....
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అదనపు రిజర్వేషన్లను కల్పిస్తూ బిల్లులను శాసనసభల్లో ఆమోదింపజేసుకుని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరాయి. 9వ షెడ్యూల్లో చేరిస్తే కోర్టులు అభ్యంతరాలు తెలిపే అవకాశం లేదనేది ఇరు ప్రభుత్వాల ఆలోచన కూడా. కానీ, ఇప్పటికే తమిళనాడు రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉంది.
కెసిఆర్ మాట ఉత్తదేనా...
ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్ల పెంపపై తాను ప్రధాని మోడీతో మాట్లాడానని, ప్రధాని సానుకూలంగా ప్రతిస్పందించారని కెసిఆర్ ఇటీవల చెప్పారు. కానీ, తాజా మోడీ ప్రకటనను పరిగణనలోకి తీసుకుంటే ఆయన సానుకూలంగా లేరనే విషయం స్పష్టమవుతోంది.