పరిమితులెరిగిన అక్కినేని: రాజకీయాలకు దూరమే
హైదరాబాద్: తాను పోషించాల్సిన పాత్రలోనే కాదు, రాజకీయాల విషయంలో కూడా పరిమితులెరిగిన వ్యక్తి అక్కినేని నాగేశ్వర రావు. ఆయన రాజకీయాల జోలికి ఎన్నడూ వెళ్లలేదు. పైగా, తాను రాణించగలననే పాత్రలను మాత్రమే ఎంచుకున్నారు. అందుకే, ఎంత మంది అవునన్నా శ్రీకృష్ణుడి పాత్రను పోషించడానికి ఆయన ఇష్టపడలేదు. ఆదే సమయంలో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాజకీయాలు తన ఒంటికి సరిపడవని ఆయన భావించేవారు.
తాను సోదరుడిలా భావించే ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి ప్రవేశించి తెలుగుదేశం పార్టీ పెట్టి ఘన విజయం సాధించినా అక్కినేని రాజకీయాలవైపు చూడలేదు. ఆయనతో పాటు నటించిన పలువురు రాజకీయాల్లోకి ప్రవేశించారు. కృష్ణ, జమున, జయప్రద పార్లమెంటు సభ్యులైనా, జయసుధ శాసనసభ్యురాలిగా ఎన్నికైనా ఆయన రాజకీయాల వైపు వెళ్లే ఆలోచన చేయలేదు. ఆయనతో నటించిన హీరోయిన్లు శారద, వాణిశ్రీ కూడా రాజకీయాల్లో కాలు పెట్టారు.
అక్కినేని నాగేశ్వర రావు వివాదాలకు కూడా దూరంగానే ఉన్నారు. ఒక సందర్భంలో మాత్రం ఎన్టీ రామారావును తప్పు పట్టినట్లు గుర్తు. కాంగ్రెసు వైపు ఆయన కాస్తా మొగ్గు చూపినట్లు కనిపించినప్పటికీ ప్రచారం మాత్రం చేయలేదు. అయితే, చలనచిత్రాభివృద్ధి సంస్థ సలహాదారుడిగా మాత్రం పనిచేశారు. అది నామినేటెడ్ పదవి.
ఎక్కువ సయమం ఆయన కుటుంబానికి ఇవ్వడానికే ఇష్టపడ్డారు అనారోగ్యంతో బాధపడుతున్న భార్య అన్నపూర్ణమ్మను ఆయన ఎల్లవేళలా కనిపెట్టుకుంటూ గడిపారు. ఆమె 2011లో మరణించారు. వారి సంతానం వెంకట్, నాగార్జున, సత్యవతి, నాగ సుశీల, సరోజ.
అక్కినేని కుమారుడు నాగార్జున సినిమాల్లో ప్రథమశ్రేణి కథానాయకుడిగా ఎదిగారు. ఆయన మనమలు, మనవరాళ్లు కొంత మంది సినిమాల్లో ప్రవేశించారు. ఆయన మనవరాలు సుప్రియ పవన్ కళ్యాణ్కతో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో 1996లో నటించి సినిమాలకు స్వస్తి చెప్పి అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలను చూసుకోవడంలో నిమగ్నమయ్యారు. అక్కినేని మనవళ్లు సుమంత్, సుశాంత్, నాగ చైతన్య సినీ రంగంలో తమ స్థానాన్ని వెతుక్కుంటున్నారు. నాగార్జున, అమలల కుమారుడు అఖిల్ సినిమాల్లో ప్రవేశించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.