పొన్నాలకు ఎసరు: జీవన్ రెడ్డి లేదా సురేష్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పదవికి ఎసరు వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణలో పార్టీని ఎన్నికల సమయంలో సరిగా నడిపించలేకపోయారనే విమర్శను ఆయన ఎదుర్కుంటున్నారు. ఓటమికి పొన్నాల లక్ష్మయ్యనే నాయకులంతా బాధ్యుడ్ని చేస్తున్నారు. ఆయనపై బహిరంగ విమర్శలకు కూడా దిగుతున్నారు. ఈ స్థితిలో పొన్నాల లక్ష్మయ్యను కాంగ్రెసు అధిష్టానం తప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
పొన్నాల లక్ష్మయ్యను పదవి నుంచి తప్పిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకే ఆ పదవి ఇస్తారన్న వాదనలున్నాయి. పార్టీ దారుణ ఓటమి పాలైన నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్చాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో పిసిసి అధ్యక్షులను మార్చాలనే యోచనలో కూడా ఉన్నట్లు చెబుతున్నారు.
తెలంగాణలో పార్టీ ఓటమి చవిచూసిన నేపథ్యంలో ఇంకా పదవులు పట్టుకుని వేలాడడం మంచిది కాదంటూ టిపిసిసి ఉపాధ్యక్ష పదవికి ఇటీవల కేఆర్ ఆమోస్ రాజీనామా చేశారు. ఎన్నికల్లో ఓటమికి పొన్నాల నైతిక బాధ్యత వహించి పదవినుంచి తప్పుకోవాలంటూ నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బహిరంగంగానే డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో రెండు మూడు రోజుల్లో మరికొంత మంది పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పదవులకు రాజీనామా చేసే అవకాశముందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం కూడా అధ్యక్షుడిని మార్చే ఆలోచనలో పడవచ్చని అంటున్నారు. తెలంగాణలోని అన్ని పార్టీల నుంచి దాదాపు 40 మంది వరకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు విజయం సాధించారు. పిసిసి అధ్యక్ష పదవిని కూడా రెడ్డి సామాజిక వ్యక్తికే ఇవ్వాలనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్లో 13 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే.
తెరాస నుంచి గెలిచిన మరో 20కి పైగా ఎమ్మెల్యేలు, టీడీపీ, బీజేపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు, బీఎస్పీ నుంచి ఇంద్రకరణ్రెడ్డి, ఇండిపెండెంట్ దొంతి మాధవరెడ్డి - వీరంతా రెడ్డి సామాజిక వర్గం వారే. రెడ్డి సామాజిక వర్గాన్ని కాపాడుకోవాలని అనుకున్నా, ముఖ్యమంత్రి కెసిఆర్ను ధీటుగా ఎదుర్కోవాలన్నా ఆ సామాజిక వర్గానికే టిపిసిసి పదవిని ఇవ్వక తప్పదని పార్టీ నేతలు చెబుతున్నారు. పైగా కేసీఆర్ కూడా నాయని నర్సింహరెడ్డికే హోంశాఖ ఇచ్చారని, ఇతర రెడ్డి మంత్రులకు కీలక శాఖలు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.
ఇప్పటికే కాంగ్రెసు శాసనసభ పక్షం (సిఎల్పీ) నేత పదవిని పదవిని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జానారెడ్డికి ఇచ్చారు. రెండు పదవులు రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెడుతారా అనేది ప్రశ్న. పార్టీని కాపాడుకోవాలంటే అది తప్పదనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికే పదవిని ఇవ్వాలని అధిష్ఠానం అనుకుంటే ప్రధానంగా జగిత్యాల ఎమ్మెల్యే, సీనియర్ నేత టి.జీవన్రెడ్డి, మాజీ స్పీకర్ కె.సురేష్రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.