భారతీయ హిందువు, ముస్లింల పాదాల్ని కడిగిన పోప్
రోమ్: అంతర్జాతీయంగా వివిధ మతాల నుంచి వచ్చిన వారికి ఆశ్రయం కల్పించే ప్రక్రియలో భాగంగా ఓ హిందువుతోపాటు 11 మంది యువ శరణార్థులు, వలస కేంద్రంలో పనిచేసే ఒక ఇటాలియన్ పాదాలను పోప్ ఫ్రాన్సిస్ గురువారం శుభ్రం చేశారు.
నీళ్లు పోసి.. వారి పాదాలు కడిగి, తువ్వాలుతో తుడిచి ముద్దు పెట్టారు పోప్ ఫ్రాన్స్. దీన్ని సోదర స్పర్శగా పోప్ అభివర్ణించారు. ఈ ఈస్టర్ సంప్రదాయానికి గాను ఎంపిక చేసిన 11 మందిలో ఒక భారతీయ హిందువుతో పాటు నలుగురు నైజీరియన్ క్యాథలిక్కులు, ముగ్గురు ఎరిత్రియా మహిళలు, మాలీ, పాకిస్థాన్, సిరియాలకు చెందిన ముగ్గురు ముస్లింలు ఉన్నారు.
ఈస్టర్ సండేకు సిద్ధమవుతున్న క్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అన్ని మతాల వారు శాంతి మార్గాన్ని అనుసరించాలని ఈ సందర్భంగా పోప్ ఆకాంక్షించారు. బ్రెస్సెల్స్ లాంటి దాడులు జరగకూడదని ఆశించారు.
మనం ఏ మతానికి, సంప్రదాయానికి చెందిన వారమైనా మనమందరం సోదర భావంతో మెలగాలని పోప్ కోరారు. ప్రపంచ శాంతి కోసం మనమంతా పని చేయాలని నిర్ధేశించారు.