రోహిత్ దళితుడు కాదు: తల్లిదండ్రులిద్దరూ వడ్డెరలే
హైదరాబాద్: హెచ్సీయూలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల దళితుడు కాదని, ఆతడి తల్లి తండ్రులిద్దరూ వడ్డెర కులస్తులేనని (ఏపీలో బీసీలు) కేంద్రానికి అధికార వర్గాలు తమ నివేదించినట్లు తెలిసింది. ఈ మేరకు రోహిత తండ్రి మణికుమార్, తల్లి రాధిక 2014 జూలై రెండో తేదీన ఇచ్చిన అఫిడవిట్లను జత చేసినట్లు సమాచారం.
రోహిత్ వేముల దళితుడు అన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అతని కులానికి సంబంధించిన స్పష్టత ఇవ్వాల్సిందిగా కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే తాము దళితులమని నిరూపించేందుకు తమ వద్ద సర్టిఫికెట్లు ఉన్నాయని రోహిత సోదరుడు రాజా చెబుతున్న సంగతి తెలిసిందే.
అంతేకాదు కేంద్ర మంత్రి దత్తాత్రేయ తదితరులపై ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసు నమోదు చేసిన నేపథ్యంలో అతని కులంపై విచారణ జరుపుతున్నట్లు పోలీసు వర్గాలు వివరించాయి. రోహిత్ తమ్ముడు రాజ చైతన్యకుమార్ జనన ధ్రువీకరణ పత్రం కోసం తండ్రి వేముల మణికుమార్, తల్లి రాధిక వేర్వేరుగా 2014 జూలై రెండో తేదీన గురజాల మండల రెవెన్యూ ఇనస్పెక్టర్కు చేసుకున్న దరఖాస్తులో తమది వడ్డెర కులమని ఇద్దరూ స్పష్టం చేసినట్లు నివేదికలో పేర్కొన్నాయి.
అంతేకాదు రోహిత్ సోదరుడికి జనన ధ్రువీకరణ కోసం వారి తల్లి రాధిక కూడా మండల రెవెన్యూ ఇనస్పెక్టర్కు దరఖాస్తు చేసుకున్నారని, అందులో ఎక్కడా ఆమె తమ కులం ఎస్సీ (మాల) అని పేర్కొనలేదని వివరించాయి. 1985లో తమకు పెళ్లయిందని, 1990 జూన తొమ్మిదో తేదీన తమకు రాజ చైతన్యకుమార్ జన్మించాడు.
రాజ చైతన్యకుమార్ జనన రిజిస్ట్రేషన్ ఆలస్య రుసుమును 2014 జూన 16న చెల్లించడమే కాకుండా 2014 జూలై రెండో తేదీన సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. అఫిడవిట్లలో ఇద్దరూ స్పష్టంగా తాము వడ్డెరలమని పేర్కొన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
మరోవైపు హెచ్సీయూలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల ఎస్సీ (మాల) సర్టిఫికెట్ కోసం 2015లోనే దరఖాస్తు చేసుకున్నారని, సరైన దర్యాప్తు చేయకుండానే స్థానిక యంత్రాంగం ఆ సర్టిఫికెట్ను మంజూరు చేసినట్లు తమ పరిశీలనలో తేలిందని, ఈ అంశంపై స్థానిక అధికారులతో విచారణ జరపాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
సరైన విచారణ జరపకుండా రోహిత్ వేములకు కుల ధ్రువీకరణ పత్రాన్ని ఎలా ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? తదితర విషయాలన్నీ త్వరలోనే విచారణలో బయటకు వస్తాయని చెబుతున్నారు. హిందూ మాల అని చెప్పుకొని వాళ్లు ధ్రువీకరణ పత్రం ఎలా సంపాదించారన్న అంశంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపాయి.
మరోవైపు రోహిత్ కులానికి సంబంధించి సైబరాబాద్ పోలీసులు కూడా దర్యాప్తు జరిపారు. తల్లిదండ్రులు ఇద్దరూ బీసీలేనని, దళితులు కాదని విచారణలో వెల్లడైందని వివరించారు.