జగన్, పవన్కు వాళ్ల బాధ కనిపించదా?: గరగపర్రు వెలివేతపై మౌనమెందుకు?..
ప్రశ్నాస్త్రాలు కూడా కుల రాజకీయాలనే పులుముకుంటాయన్న పచ్చి నిజం.. గరగపర్రుతో మరోసారి రుజువైంది. రాజకీయాలు, మీడియా, అంతా కలిసి వ్యూహత్మక మౌనంతో గరగపర్రు గొంతు నొక్కడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాయి.
గరగపర్రు: ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ఏ చిన్న అవకాశం వచ్చినా రంగంలోకి దిగిపోయే వైసీపీ అధినేత జగన్.. వెలి బతుకుల ఆర్తనాదాలపై మాత్రం కావాలనే మౌనం వహిస్తున్నట్లు కనిపిస్తోంది. దళితులు తమ ఓటు బ్యాంకు అని చెప్పుకునే జగన్.. ఊరంతా ఏకమై బక్కజీవుల గుండెల మీద తంతుంటే మాత్రం నోరు పెగల్చడం లేదు.
ఇక ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న జనసేన పవన్ కళ్యాణ్ ఎవరిని ప్రశ్నించడంలో నిమగ్నమయ్యారో.. ఎవరి తరుపు ప్రశ్నలను విస్మరిస్తున్నారో ఆయనకే తెలియాలి. ప్రశ్నాస్త్రాలు కూడా కుల రాజకీయాలనే పులుముకుంటాయన్న పచ్చి నిజం.. గరగపర్రుతో మరోసారి రుజువైంది. రాజకీయాలు, మీడియా, అంతా కలిసి వ్యూహత్మక మౌనంతో గరగపర్రు గొంతు నొక్కడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాయి.
అలుపెరగని పోరాట వీరులు కొందరు ఈ కుట్రలు చేధించేందుకు గరగపర్రు గడ్డ మీద ఇంకా పోరాడుతూనే ఉన్నారు. వారి పోరాటాలు, వారి బతుకుల చుట్టూ నాటబడిన కంచెలు.. ఉద్దేశపూర్వకంగా విస్మృతికి గురవతున్న చోట.. సో కాల్డ్ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిందే!.
అసలేం జరిగింది?:
గ్రామంలో ప్రదాన రహదారి పక్కన్న ఒక చెరువు ఉంది. ఆ చెరువు గట్టుపై అనేకమంది ప్రముఖుల విగ్రహలు, గుళ్ళు గోపురాలు ఉన్నాయి. అ గ్రామంలోని క్రిస్టియన్ యూత్(మాల యువత) ఈ సంవత్సరం అంబేడ్కర్ జయంతికి అ చెరువు గట్టుపై ఆయన విగ్రహం ఎర్పాటు చేయాలని నిర్ణయించారు. విషయం తెలిసిన గ్రామంలోని అదిపత్య కులానికి చెందిన కొందరు క్షత్రీయులు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
ఎవరెంత వ్యతిరేకించినప్పటికీ.. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాల్సిందేనని నిర్ణయించుకున్న మాల యువత.. ఈ సంవత్సరం ఎప్రిల్ 23న విగ్రహాన్ని నిలబెట్టారు. ఇది జీర్ణించుకోలేని కొంతమంది వ్యక్తులు.. అ అర్దరాత్రి అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించి ఒక పాడుబడిన ఇంట్లోని చెత్తకుప్పలో పడవేశారు.
మరునాడు కనిపించని విగ్రహం:
ఏప్రిల్ 24తేది ఉదయం చెరువు గట్టు వైపు వెళ్ళిన దళితులకు చెరువు గట్టుపై అంబేడ్కర్ విగ్రహం కనిపించలేదు. దీనిపై నిరసనగా దళితులంతా అందోళన కార్యక్రమాన్ని (రాస్తరోకో)నిర్వహించగా, ఆర్డీవో, డీఎస్పీ వచ్చి విచారణ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహాన్ని పడేసిన ఇంటిని గుర్తించి.. విగ్రహ ప్రతిష్టాపనకు ఒప్పుకున్నారు. అయితే ఇక్కడో చిన్న మెలిక పెట్టారు.
చెరువుగట్టుపై విగ్రహలు ఎర్పాటు చెయ్యడానికి కోర్టు రూల్స్ ఒప్పుకోవడంలేదు మరొక స్తలంలో విగ్రహం ఎర్పాటు చేస్తామని చెప్పి, చెరువుకు పక్కనే ఉన్న పంచాయితి కార్యలయం వద్ద ఏర్పాటు చేశారు.
బలమరామరాజు కుట్ర!?:
ఎట్టకేలకు అంబేడ్కర్ విగ్రహాన్ని పున:ప్రతిష్టించడంతో గ్రామానికి చెందిన భూస్వామి బలరామరాజు తీవ్ర ఆగ్రహావేశానికి లోనయ్యాడు. తమను ధిక్కరించి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు వారి అంతు చూడాలని ఊగిపోయినట్లు చెబుతున్నారు. ఇదే క్రమంలో గత నెల 29 తేది రాత్రి అ గ్రామంలో ఉన్న మిగిలిన 14కులాల వారిని పిలిచి ఓ సమావేశం ఏర్పాటు చేశాడు.
ఇక నుంచి మాల కులస్తులను గ్రామంలోని మిగతా కులాల వారెవరూ పనికి పిలువకూడదు.. వారితో ఎవరు మాట్లాడకూడదు.. మాట్లాడిన వారికి వెయ్యి రుపాయలు.. పనికి పిలిచిన వారికి పది వేల రుపాయలు జరిమానా విధిస్తానని హెచ్చరించాడు, మే 5వ తేది నుండి ఈ వెలి అమలవుతుందని ఆదేశించాడు.
వేరే గ్రామాలకు ఫోన్లు చేసి మరీ!:
వెలివేతను గరగపర్రు ఒక్క గ్రామానికే అమలు చేయలేదు. మాల కులస్తులకు ఎక్కడా పని దొరక్కుండా పక్క ఊరికి కూడా విషయాన్ని పాకించారు. ఫోన్లు చేసి మరీ.. వారిని పనిలోకి తీసుకోవద్దంటూ పక్క గ్రామస్తులను హెచ్చరించారు. ఈ ఆదేశాలను ధిక్కరించినందుకు గాను ఓ ఆర్ఎంపీని కూడా ఊరి నుంచి బహిష్కరించారన్న ఆరోపణలున్నాయి.
మాలలతో ఎవరు మాట్లాడుతున్నారన్న విషయం తెలుసుకోవడానికి.. గరగపర్రు గ్రామంలోని పలు ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఎర్పాటు చేయించడం గమనార్హం. స్థానిక ఎమ్మార్వో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళే అయినప్పటికి విచారణ మాత్రం నామమాత్రంగానే జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కేవలం మీకు కులాయి నీళ్ళు వస్తున్నాయా?, కేబుల్ టివి ప్రసరాలు వస్తునాయా?.. వంటి ప్రశ్నలతో విచారణను తూతూ మంత్రంలా జరిపించేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవన్ని వస్తున్నాయి కాబటి ఇక్కడ వివక్షలేదు అని ఉన్నతాధికారులకు రిపోర్టు ఇవ్వడం గమనార్హం.
స్థానిక ఎమ్మెల్యే క్షత్రీయుడు కావడంతో:
స్థానిక ఎమ్మెల్యే క్షత్రీయుడు కావడంతో ఊరిలోని ఆధిపత్య వర్గాలకు పరోక్షంగా ఆయన బాసటగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతవరకూ ఆయన అ గ్రామానికి ఒక్కసారి కూడ రాకపోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది.గత 50రోజులుగా ఆ గ్రామంలో ప్రైవేట్ రాజ్యం నడుస్తున్నప్పటికి జిల్లా స్థాయి అదికారులెవరు అ గ్రామాని సందర్శించకపోవడం గమనార్హం.
ఇక మరో వివక్ష ఎమిటంటే.. ఇక్కడ ఎస్సీ కాలని ఏర్పడి 40 సంవత్సరాలు గడిచినప్పటికీ.. ఇప్పటికీ ఇక్కడ రోడ్లు లేవు, అన్ని మట్టి బాటలే. డ్రైనేజి వ్యవస్థ అసలు లేనే లేదు. కుళాయిలువద్ద సిమెంటు దిమ్మలు లేవు, వీధి దిపాలు లేవు.
అల్లాడుతున్న 800కుటుంబాలు:
ఆధిపత్య కులాల వెలివేతతో గరగపర్రు ఎస్సీ కాలనీలోని 800కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి. ఎవరూ పని ఇవ్వక, తిండికి డబ్బుల్లేక.. పస్తులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. గర్భిణీ స్త్రీలు, వృద్ధుల బాధలు వర్ణనాతీతం.
కేవలం అంబేడ్కర్ విగ్రహం పెట్టుకున్నారన్న కారణంగా.. ఇన్ని కుటుంబాలను రోడ్డున పడేలా చేయడం.. ఆధునిక యుగంలోను కులవివక్షతలు ఎంతలా నాటుకుపోయాయో ఇలాంటి ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
వ్యూహాత్మక మౌనం:
రాజకీయ నాయకులు, మీడియా అంతా కలిసి ఈ వ్యవహారంపై వ్యూహాత్మక మౌనం వహిస్తూ వస్తున్నాయి. విషయం అణగారిన కులాలకు చెందినది కావడంతో.. ఏ తెలుగు మీడియా కూడా గరగపర్రు మాలల ఆవేదనను పట్టించుకున్న పాపాన పోలేదు. గత కొన్నిరోజులుగా పలువురు దళిత నాయకులు, ప్రజా సంఘాలు అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.
ఇదే క్రమంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు కె.రాములు గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో సాంఘిక బహిష్కరణ అమలవ్వడంపై సోమవారం బహిరంగ విచారణ జరిపారు. వెలికి వ్యతిరేకంగా ఒక వర్గం చేస్తున్న ఆందోళన పట్ల ప్రభుత్వ అధికారులు స్పందించిన తీరుని ఆయన తప్పుపట్టారు.
దీనిపై స్పందించిన కలెక్టర్.. ఆందోళనకారులతో చర్చలు జరిపి.. వారి డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించాలని ఎస్పీ రవిప్రకాశ్ని ఆదేశించారు. తమను వెలికి గురిచేసిన నలుగురు గ్రామస్థులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి, అరెస్టు చేయాలని అక్కడి దళితులు డిమాండ్ చేస్తున్నారు. కౌలు భూములును కూడా తిరిగి బాధితులకు అప్పగించాలని కలెక్టర్ ఆదేశించారు.
గరగపర్రులో వైసీపీ నేతలు:
గరగపర్రు దళితుల వెలివేతపై నేరుగా స్పందించని జగన్.. ఆ పార్టీ నేతలు దర్మాన ప్రసాదరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, మేరుగ నాగార్జున తదితరులను అక్కడికి పంపించారు. ఈ సందర్భంగా గరగపర్రు బాధితులతో బృందం సభ్యులు భేటీ అయ్యారు. అగ్ర కులాలు తమ పట్ల కుట్ర చేసిన విషయాన్ని దళితులు వారికి వివరించారు.