‘టీడీపీ’లో పురంధేశ్వరి ‘లేఖ’ కలకలం: బీజేపీలోనూ కలవరం!
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ నేత పురంధేశ్వరి.. పార్టీ ఫిరాయింపులపై ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు రాసిన లేఖ హాట్ టాపిక్గా మారింది.
అమరావతి: ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ నేత పురంధేశ్వరి.. పార్టీ ఫిరాయింపులపై ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు రాసిన లేఖ హాట్ టాపిక్గా మారింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులివ్వడంపై ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న అధికార తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు మిత్రపక్షమైన బిజెపి నుంచి కూడా ఇలాంటి వ్యతిరేకతే ఎదురుకావడంతో టీడీపీ కలవరపడుతోంది.
టీడీపీలో కలవరం
వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిన 21మంది ఎమ్మెల్యేలలో నలుగురికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి పదవులివ్వడాన్ని తప్పుపడుతూ బిజెపి జాతీయ నాయకురాలు, కేంద్రమాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి.. పార్టీ అధ్యక్షుడు అమిత్షా, ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖ తెలుగుదేశంలో కలకలం సృష్టిస్తోంది.
చంద్రబాబు నిర్ణయం తప్పే..
పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలు నలుగురికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం మంత్రి పదవులివ్వడాన్ని ఆమె తన లేఖలో తప్పుపట్టారు. ఈ నిర్ణయం సరైంది కాదని, రెండు తెలుగురాష్ట్రాల్లో ఫిరాయింపుచట్టం అపహాస్యం పాలవుతోందని ఆమె పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధానికి కఠిన చట్టం తీసుకురావాలని, ఫిరాయించిన వారికి మంత్రి పదవులివ్వడం అప్రజాస్వామికమని తన లేఖలో పేర్కొన్నారు.
బీజేపీలోనూ కలవరమే..
కాగా, పురంధ్రీశ్వరి రాసిన లేఖ అటు రాష్ట్ర బిజెపిలోనూ కలవరం సృష్టిస్తోంది. తెలుగుదేశం పార్టీకి మానసిక మద్దతుదారులుగా వ్యవహరిస్తోన్న ఒక వర్గానికి పురంధ్రీశ్వరి లేఖ మింగుడు పడటం లేదు. ఆమె లేఖపై ఆ వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది.
హరిబాబు స్పందించకపోయినా..
‘పార్టీఫిరాయింపుల అంశంపై రాష్ట్ర నాయకత్వం ఇప్పటివరకూ స్పందించలేదు. కేబినెట్లో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా ఇప్పటివరకూ స్పందించలేదు. నిజానికి రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు ఈ అంశంపై స్పందించాల్సి ఉంది. అయితే, ఆయనకు తెలుగుదేశం నాయకత్వంతో ఉన్న మొహమాటాల వల్ల ఏమీ మాట్లాడటం లేదు. మేం మాట్లాడితే మాపై తెలుగుదేశం వ్యతిరేక ముద్ర వేస్తారు. అందువల్ల మేమూ మాట్లాడటం లేదు' అని ఓ బీజేపీ సీనియర్ నేత పేర్కొన్నారు.
వైసీపీలో చేరతారని ప్రచారం..
‘ఇప్పటికే కన్నా, పురంధ్రీశ్వరి, సోమువీర్రాజుపై ఈ ముద్ర వేశారు. కన్నా, పురంధ్రీశ్వరి వైసీపీకి వెళ్లిపోతారని ఓ వర్గం చాలాకాలం నుంచీ ప్రచారం చేస్తున్న విషయం మీకూ తెలుసు. ఆమె లేఖ రాసినా దానిని మా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఖండించే పరిస్థితి గానీ, నిరోధించే శక్తిగానీ లేదు. కాకపోతే ఆ అంశంపై మా రాష్ట్ర అధ్యక్షుడే మాట్లాడాల్సి ఉంది. ఏదేమైనా మేడమ్ మాట్లాడిన దాంట్లో అబద్ధమేముంది? మేం ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి రేపు ఫిరాయింపులపై మీ అభిప్రాయమేమిటని మీ మీడియావాళ్లు అడిగితే ఏం చెబుతాం? స్వాగతించలేం కదా' అని ఓ సీనియర్ బిజెపి నేత వ్యాఖ్యానించారు.
వైసీపీకి తోడైన బీజేపీ
కాగా, పురంధేశ్వరి లేఖతో తెలుగుదేశం కూడా రాజకీయంగా సంకటస్థితిలో పడింది. ఇప్పటివరకూ కేవలం వైసీపీ మాత్రమే ఫిరాయింపు అంశంపై జనంలోకి వెళుతోంది. తాజాగా గవర్నర్ను కలిసిన వైసీపీ, త్వరలో ఢిల్లీకి వెళ్లి అన్ని పార్టీల నాయకులను, జాతీయ మీడియాను కలిసి ఫిరాయింపు అంశం, వారికి మంత్రిపదవులు ఇవ్వడంపై జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మిత్రపక్షమైన బిజెపికి చెందిన పురంధ్రీశ్వరి అదే అంశంపై ప్రధానికి, పార్టీ అధ్యక్షుడికి లేఖ రాయడం టీడీపీకి ఇబ్బందికరంగానే మారింది. కాగా, ఈ పరిస్థితి ఎందుకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే.