రజనీకాంత్: అదును చూసి అడుగు, కమలనాథులు ఖుషీ
Recommended Video
చెన్నై: రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించి తమిళ సూపర్ స్టార్ ఎట్టకేలకు సస్పెన్స్కు తెర తీశారు. సొంత పార్టీ పెడుతానని, 234 స్థానాల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. దాంతో తన లక్ష్యం ఏమిటో చెప్పకనే చెప్పారు.
రజనీకాంత్ అదును చూసి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారని అనుకోక తప్పదు. తమిళనాడు రాజకీయాలు ప్రస్తుత తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. ఓపిఎస్- ఈపిఎస్ ప్రభుత్వ ఎన్నాళ్లు మనుగడ సాగిస్తుందో తెలియని పరిస్థితి కూడా ఉంది.
ఆర్కే నగర్ ఫలితం ఇలా...
జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ ఉప ఎన్నికలో టిటీవీ దినకరన్ విజయం సాధించి శాసనసభలోకి అడుగు పెట్టడంతో తమిళ రాజకీయాలు మలుపు తిరిగే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి దినకరన్ చేయాల్సిందంతా చేస్తారనేది అందరూ ఎరిగిందే. ప్రభుత్వంలో తన స్లీపర్ సెల్స్ ఉన్నాయని, వారి సాయంతో ప్రభుత్వాన్ని పడగొడుతానని ఆయన చెప్పారు. అందువల్ల సంక్షోభం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించడం ద్వారా పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవాలనే ఉద్దేశం రజనీకాంత్కు ఉండవచ్చు.
డిఎంకేకు ఆ సత్తా లేదా...
తమిళనాడులో స్టాలిన్ నాయకత్వంలో డిఎంకే పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. ఆర్కే నగర్లో డిఎంకె ఘోర పరాజయం చూస్తే అలాగే అనుకోవాల్సి వస్తుంది. నాయకత్వాన్ని తండ్రి కరుణానిధి నుంచి స్టాలిన్ తీసుకున్న తర్వాత పార్టీలో అంతర్గత తగాదాలు చోటు చేసుకున్నాయి. పార్టీ ఏకతాటిపైకి వచ్చి పుంజుకునే పరిస్థితి లేదని అంటున్నారు.
జయలలిత మరణం తర్వాత ఇలా...
జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో తీవ్ర సంక్షోభం తలెత్తుంది. ఆ సంక్షోభం కొనసాగుతోంది. ప్రభుత్వం స్థిరంగా ఉంటుందనే నమ్మకం లేకుండా పోయింది. ఓపిఎస్-ఈపిఎస్ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ చేతులో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. అది తమిళ ప్రజలకు మింగుడు పడని విషయం. తమిళ ఆత్మగౌరవాన్ని వారు నిలబెడుతారనే ఆశలు లేకుండా పోయాయి. ఒక నమ్మకమైన సత్తా గల నాయకుడు కూడా కనిపించడం లేదు. ఈ సమయంలో రజనీకాంత్ తాను ఉన్నానంటూ సంకేతాలు ఇచ్చారని అంటున్నారు.
బిజెపి ప్రయత్నాలు ఇలా...
తమిళనాడు రాజకీయాలను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి బిజెపి చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత అది దాన్ని వేగవంతం చేసింది. జయలలిత బిజెపికి కొరుకుడు పడలేదు. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో అస్థిరతను పెంచి పోషించి, తన చేప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే పళనిస్వామికి, పన్నీరు సెల్వం మధ్య సంధి కుదిర్చింది. అయితే, అది బలంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఇది రజనీకాంత్ తనకు కలిసి వస్తుందని భావించి ఉండవచ్చు.
ఇది బిజెపికి ప్రయోజనమా...
ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో బిజెపి ప్రయోగం చేసి విఫలమైంది. బిజెపి అభ్యర్థి కొట్టుకుపోయారు. తమిళనాడులో నేరుగా పాగా వేసే స్థితి బిజెపికి లేదని అర్థమైంది. ఈ తరుణంలో రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు.. అది తమకు కలిసి వస్తుందని బిజెపి అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ ప్రభంజనం సృష్టిస్తారా, లేదా అనేది అనుమానమే. ఒక వేళ రజనీకాంత్ ప్రభంజనం సృష్టించలేకపోతే అది బిజెపికి ఉపయోగపడవచ్చునని అంటున్నారు.