కెసిఆర్ చెంత కంటతడి పెట్టిన రసమయి
హైదరాబాద్: "తెలంగాణ వచ్చినంక కళాకారుల గొంతు ఆగింది.. పనులు లేవు.. పాటలు లేదు.. అడ్డా కూలిపనికి పోతున్న స్థితి. ఈ సమయంలో కేసీఆర్ మీకు నేనున్నా అంటూ ఈ బక్కచిక్కిన జీవితాలకు ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారు. ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీరేది కాదు" అంటూ తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మెన్ రసమయి బాలకిషన్ సభా వేదికపై కంటతడి పెట్టారు. కళాకారుల తరుపున సీఎం కేసీఆర్కు పాదాభివందనం చేశారు. ఆదివారం కళాకారుల సమ్మేళన సభలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
"ఒక మారుమూల గ్రామంలో జీతగాని బిడ్డనైన తనను ఇంతవాడిని చేసిన గురువు.. ఉద్యమ నేత..కేసీఆర్ మాత్రమే. నాకు జన్మనిచ్చింది నా తండ్రి అయితే, పునర్జన్మనిచ్చింది మాత్రం కేసీఆర్" అని బాలకిషన్ అన్నారు.
ఉద్యమం నాటి చేదు అనుభవాలను గుర్తు చేసుకుని కన్నీరు కార్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయన భుజం తట్టి ఓదార్చారు. 550 మంది తెలంగాణ కళాకారులను ప్రభుత్వంలో భాగస్వాములను చేసి కేసీఆర్ తమ కుటుంబాలను ఆదుకున్నారని బాల్కిషన్ అన్నారు. విప్లవం అంటే ఎక్కడో లేదు.. కేసీఆర్ వద్దనే ఉందని అన్నారు. ఇవాళ కళాకారులు గంటల తరబడి పాటలు పాడుతున్నారంటే ఆ శక్తి అంతా కేసీఆర్ ఇచ్చిందేనని అన్నారు.. మిషన్ కాకతీయ, హరితహారం వంటి కార్యక్రమాలను ప్రజలముందుకు తీసుకెళుతామని ప్రతిజ్ఞ చేశారు.
కెసిఆర్ సహపంక్తి భోజనం
తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల సమ్మేళన సభలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కళాకారులతో సహపంక్తి భోజనం చేశారు. ఉద్యమ సమయంలో కళాకారులతో గడిపిన జ్ఞాపకాలను ఈ సందర్భంగా నెమరు వేసుకున్నారు. వివిధ రకాల తెలంగాణ వంటకాల రుచి చూపించిన సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ను ప్రశంసించారు.
తొలుత కళాకారులు ఆర్ట్గ్యాలరీలో సీఎం రాకకోసం నిరీక్షించి ఆయన వచ్చాకే భోజనాలకు ఉపక్రమించారు. ఇంట్లో మన భోజనం చేసినట్లుగా ఉందని అన్న కేసీఆర్ ఉద్యమసమయంలో పాటలు పాడిన కళాకారులను పేరుపేరునా పిలిచి బాగున్నావా.. అంటూ పలకరించారు. తమను పేర్లతో సహా గుర్తుపెట్టుకుని పలకరించడం విశేషం.