ఒలింపిక్స్: సముద్రంలోకి దూకి కాపాడింది, నేడు ఓడినా చప్పట్లు
రియో డి జెనీరో: రియో ఒలింపిక్స్ 2016లో మహిళల 100 మీటర్ల బటర్ ఫ్లై హీట్స్ ముగిశాయి. పోటీలో పాల్గొన్న యువతులు బయటకు రాగానే.. చాలామంది చూపు 41వ స్థానంలో నిలిచిన అమ్మాయి పైన పడింది. ఆమె ఈత కొలను నుంచి బయటకు వస్తుంటే స్టేడియం హోరెత్తింది. అందరూ చప్పట్లు కొట్టారు.
మీడియా కూడా ఆమె చుట్టూ చేరింది. రియోలో ఆమె కనీసం సెమీ ఫైనల్ కూడా చేరలేదు. పైగా 41వ స్థానంలో నిలిచింది. కానీ అందరి దృష్టి ఆమె పైనే ఉంది. అందుకు ఓ కారణం ఉంది. ఆ అమ్మాయి సిరియాకు చెందిన యుస్రా మర్దిని.
ఓసారి పడవ మునిగిపోతుంటే సముద్రంలోకి దూకి 18 మంది ప్రాణాలను ఆమె కాపాడింది. అందుకే ఆమె ఈత కొలను నుంచి బయటకు రాగానే స్టేడియం హోరెత్తింది. కాగా, శరణార్థ అథ్లెట్గా ఒలింపిక్స్ బరిలో నిలిచిన ఆమె సెమీస్ అవకాశాన్ని కోల్పోయింది.
సెమీస్ చేరడం కష్టమని తనకు తెలుసునని, ఒలింపిక్స్లో పోటీపడాలన్న కల నెరవేర్చుకున్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందని ఆమె చెప్పింది. తాను 41వ స్థానమే సాధించి ఉండవచ్చునని, తనకు అదే గోల్డ్ మెడల్ అంది. టోక్యో ఒలింపిక్స్లో పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. యుస్రా మర్దిని 100మీ ఫ్రీస్టయిల్లోనూ పోటీ పడనుంది.