అండర్వేర్లో టిష్యూ పేపర్ పెట్టుకొని ఆడిన సచిన్!
న్యూఢిల్లీ: ఓసారి క్రికెట్ ఆడుతున్న సమయంలో తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న తాను అండర్వేర్లో టిష్యూ పేపర్లు పెట్టుకొని మరీ ఆడానని భారత మాజీ క్రికెటర్, భారతరత్న సచిన్ టెండుల్కర్ చెప్పాడు. సచిన్ తన ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో రికార్డులు సృష్టించాడు. గాయాల్ని, బాధల్ని దిగమింగుకుని ఆడేవాడు.
తన అండర్వేర్లో టిష్యూ పేపర్లు పెట్టుకొని ఆడానన్న విషయాన్ని సచిన్ తన ఆటో బయోగ్రఫీ ప్లేయింగ్ ఇట్ మై వేలో వెల్లడించాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 2003 వరల్డ్కప్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. సూపర్ సిక్స్ దశలో మార్చి 10న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ సందర్భంగా అండర్వేర్లో టిష్యూ పేపర్లు పెట్టుకుని బరిలోకి దిగిన విషయాన్ని మాస్టర్ బహిర్గతం చేశాడు.
ఈ విషయాన్ని వెల్లడించాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉందని, ఎందుకంటే ఇది వ్యక్తిగత రహస్యమని, అంతకుముందు పాకిస్థాన్తో మ్యాచ్ సందర్భంగా డీహైడ్రేషన్కు గురయ్యానని, దాన్నుంచి పూర్తిగా కోలుకోలేదని, విపరీతమైన కడుపునొప్పితో బాధపడ్డానని, ఎనర్జీ డ్రింక్లో ఉప్పు కలుపుకుని తాగానని, ప్రయోజనం కనిపించలేదని చెప్పాడు.
కానీ, నేను బ్యాటింగ్కు వెళ్లాలని, అందుకే లోదుస్తుల్లో టిష్యూ పేపర్లు పెట్టుకుని బరిలోకి దిగానని, ఆ తర్వాత డ్రింక్స్ బ్రేక్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్ వెళ్లేంత వరకూ అసౌకర్యంగానే అనిపించిందని సచిన్ పేర్కొన్నాడు. అయితే అంత ఇబ్బంది పడ్డప్పటికీ ఓపిగ్గా బ్యాటింగ్ చేసిన మాస్టర్ 120 బంతుల్లో 97 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్లో భారత్ 183 పరుగుల తేడాతో నెగ్గింది.