వీడ్కోలు: ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న సచిన్
ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు భారత ఆటగాళ్లు విజయంతో వీడ్కోలు పలికారు. భారత్ విజయం సాధించిన తర్వాత ఉద్వేగంతో సచిన్ టెండూల్కర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టు మ్యాచులో తిరిగి భారత్ బ్యాటింగ్ చేసే అవకాశం లేకపోవడంతో శనివారం మూడో రోజు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సచిన్ టెండూల్కర్కు బౌలింగు చేసే అవకాశం ఇచ్చాడు.
ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన రెండో టెస్టు మ్యాచుతో సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ టెస్టు కెరీర్ ముగిసింది. ఆయన టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నట్లే. నిన్ను ఎల్లవేళలా గుర్తు పెట్టుకుంటామంటూ స్టేడియంలోని డిస్ప్లే బోర్డులో సందేశం ఇస్తూ సచిన్ టెండూల్కర్కు వీడ్కోలు పలికారు.
సచిన్ టెండూల్కర్ 200 టెస్టు మ్యాచులు ఆడాడు. చివరి టెస్టు మ్యాచులో సచిన్ టెండూల్కర్ 74 పరుగులు చేశాడు. అయితే, వాంఖడే స్టేడియంలో సెంచరీ చేయాలన్న ఆయన కోరిక నెరవేరలేదు. ఈ మైదానంలో సచిన్ టెండూల్కర్ చివరిసారి 15 ఏళ్ల క్రితం సెంచరీ చేశాడు.
భారత క్రికెటర్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చినప్పుడు సచిన్ టెండూల్కర్ కంటతడి పెట్టుకున్నాడు. 24 ఏళ్ల పాటు అద్భుతమైన ఆటను ప్రదర్శించిన సచిన్ వీడ్కోలు పలికాడు. కన్నీటిని అపుకోవడానికి ప్రయత్నిస్తూ విజయం తర్వాత స్టంప్ను తీసుకుని తన జట్టు సభ్యులతో కలిశాడు. వాంఖడే స్టేడియం సచిన్ పేరుతో మారుమ్రోగింది.
మొహ్మద్ షమీ చివరి వికెట్ తీసిన వెంటనే వాంఖడే స్టేడియంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా లేచి నిలబడి సచిన్ టెండూల్కర్కు వీడ్కోలు పలికారు. శనివారం ఉదయం 11 గంటల 47 నిమిషాలకు సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ క్రీడ నుంచి లాంఛనంగా తప్పుకున్నట్లయింది.