తెలంగాణ ప్రాజెక్టులపై ‘సాక్షి’ విషం: జగన్ మీడియా చూపు ఇదీ...
భూగర్భ జలాల ఆధారంగా తవ్విన బోరుబావుల ద్వారా వరి పండించే వారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ రాష్ట్ర సాధన నినాదాల్లో నిధులు, నియామకాలతోపాటు నీళ్లు కూడా. ‘సాక్షి’ దిన పత్రికలో తెలంగాణ ప్రాజెక్టులపై విషం చిమ్
అమరావతి/ పోలవరం/ కొవ్వూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలాపున ఉన్న కృష్ణా, గోదావరి జలాలను తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా.. దిగువన ఉన్న కోస్తాంధ్ర ప్రాంతంలో మూడు పంటలు పండేలా కోస్తా, రాయలసీమ ప్రాంతాల పొడవునా ప్రాజెక్టులు నిర్మించారు. ఎట్టకేలకు 2002లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి.. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమిస్తూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో 2004 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గోదావరి ఉప నది ప్రాణహితపై 'చేవెళ్ల - ప్రాణహిత' ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు.
తర్వాత 2014లో తెలంగాణ ఆవిర్భవించింది. దశాబ్దాల తరబడి సాగునీటికి నోచుకోక, మెట్ట పంటలు మాత్రమే.. చెరువులకు వచ్చే నీటి ఆధారంగా.. భూగర్భ జలాల ఆధారంగా తవ్విన బోరుబావుల ద్వారా వరి పండించే వారు తెలంగాణ ప్రజలు. క్రమేపీ భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. తెలంగాణ రాష్ట్ర సాధన నినాదాల్లో నిధులు, నియామకాలతోపాటు నీళ్లు కూడా.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గత ఉమ్మడి ఏపీ ప్రభుత్వాలు చేపట్టిన పథకాలు.. ప్రాణహిత - చేవెళ్ల, వరంగల్ జిల్లాలో దేవాదుల, ఖమ్మం జిల్లాలో దుమ్ముగూడెం ప్రాజెక్టు పేర్లు మార్చి.. దాని కొనసాగింపుగా పలు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఆ రాష్ట్రంలోని విపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత సారథ్యంలోని మీడియాకు కూడా కంటగింపుగానే మారిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే 'సాక్షి' దిన పత్రికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులపై విషం చిమ్మేందుకు ప్రయత్నించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
Recommended Video
గోదావరి డెల్టాకు ఇలా ఇక్కట్లు
‘తెలంగాణ సర్కార్ గోదావరి, దాని ఉప నదులపై ఏకంగా తొమ్మిది ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేపడుతోంది. దీంతో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే దిగువకు నీళ్లు వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి' అనే లీడ్తో ప్రచురించిన వార్తాకథనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తాంధ్ర ప్రజలకు తప్పవన్న సంకేతాలివ్వడానికి ప్రయత్నిస్తున్నదని భావనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే గోదావరి డెల్టా ఆయకట్టు పరిధిలో ఉన్న రైతులు రెండో పంటకు సాగునీరు అందక ఇబ్బందులను చవిచూస్తున్నారని, ఏటా రబీ సీజన్లో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని ‘సాక్షి' వార్తాకథనం సారాంశం. 2009 తర్వాత రెండేళ్లు మినహా రెండో పంటకి ఏటా వంతుల వారీ విధానంలో సాగునీరు అందిస్తున్నారు. ఆరేళ్ల నుంచి రెండో పంటకు సీలేరు జలాలపైనే ఆధారపడి నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తొమ్మిది పథకాలు పూర్తయితే భవిష్యత్లో మరింత విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సిన ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారని సాక్షి వార్తాకథనం ఆవేదన వ్యక్తం చేసింది.
ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టులపై నోరు మెదపని ఉమ్మడి ప్రభుత్వాలు
ఏటా సరాసరి 2,500 టీఎంసీలకు పైగా గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. గోదావరి నీటిని ఒడిసిపట్టి నిల్వ చేసుకునే మార్గం లేకపోవడంతో వేలాది టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. వాస్తవమేమిటంటే గోదావరి ఉప నదుల్లో చివరిదైన సీలేరు నది నుంచి వచ్చే జలాలతోనే ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన ప్రాంతాలకు సాగునీరు సరఫరా చేయడానికి వెసులుబాటు ఉన్నదన్న మాట అక్షరాల సత్యం. ఇటు గోదావరి నదిపై మహారాష్ట్ర, అటు క్రుష్ణా నదిపై కర్ణాటక భారీ స్థాయిలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులతో నిజామాబాద్ జిల్లా సరిహద్దుల్లో శ్రీరాం సాగర్, కర్నూల్ - మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దుల్లోని శ్రీశైలం, నల్లగొండ - గుంటూరు జిల్లాల మధ్య నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు నీరు రావడం లేదు. నాడు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టులను నిర్మిస్తుంటే చోద్యం చూసిన ఉమ్మడి ఏపీ పాలకులదే పాపం తప్ప మరొకటి కాదన్నది నిష్ఠూర సత్యం అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించే వైఎస్ఆర్ 2006లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఏపీలో చంద్రబాబు చేతికి పాలనా పగ్గాలు
2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది నాటి యూపీఏ ప్రభుత్వం. కానీ తర్వాత కేంద్రంలో నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ అధికారంలోకి రావడం, ఏపీలో దాని మిత్ర పక్షం తెలుగుదేశం అధికార పగ్గాలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. కానీ జాతీయ ప్రాజెక్టు నిర్మించాల్సిన కేంద్రం.. ఆ బాధ్యతలను ఏపీ సర్కార్కు వదిలేసి పక్కకు తప్పుకున్నది. కానీ ఏపీ సర్కార్ ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో 7.20 లక్షల ఎకరాలకు నీరందించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నీరుగారుస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 194.60 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం గల పోలవరం ప్రాజెక్టు పూర్తయితే సాగునీటి సమస్యకు తెరపడే అవకాశం ఉంది.
అంతే కాకుండా 960 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తూ కేవలం తాత్కలిక లబ్ధిని చేకూర్చే పట్టిసీమ, పురుషోత్తపట్నం పథకాల పేరుతో రూ.3,200 కోట్లు పైగా ప్రజాధనం వృథా చేస్తోంది. కేవలం కమీషన్లు దండుకోవడానికే ఈ రెండు పథకాల నిర్మాణం చేపట్టిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకుముందు కర్ణాటక ప్రభుత్వం ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచినా అప్పటి చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. ఫలితంగా నేడు కృష్ణా డెల్టా రైతులు సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మొదటి పంటకు సైతం నీరందక ఇబ్బందులను చవిచూస్తున్నారు.
గోదావరి ఉప నదులపై తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం పట్ల ఆవేదన
గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ధవలేశ్వరం బ్యారేజీ మినహా ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టులు లేవు. వాటి కింద ఆయకట్టు కూడా లేదు. నది పరీవాహకంలో నీటి లభ్యత పడిపోవడంతో ఏటా రబీ సీజన్లో ఉభయ గోదావరి జిల్లా రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని సాక్షి వార్తా కథనం పేర్కొన్నది. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం గోదావరి ఉపనదులైన వార్ధా, పెన్గంగ, ప్రాణహిత కలిసే ప్రదేశాల్లో రూ.6,286 కోట్ల వ్యయంతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, రూ.685 కోట్లతో ప్రాణహిత ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేపట్టిందని, దిగువన భద్రాచలం సమీపంలో భక్తరామదాసు, సీతారామ పథకం రూ.1,151.59 కోట్లతో, లోయర్ పెన్గంగ రూ.124.90 కోట్లతో, లెండి రూ.19.02 కోట్లతో, దేవాదుల రూ.695 కోట్లతో, కుంతనాపల్లికి రూ.200 కోట్లతో, బీమా ఎత్తిపోతల పథకాన్ని రూ.125 కోట్లతో చేపట్టింది. గత ఏడాది బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది. ఎగువన ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే వరదల అనంతరం అక్టోబర్, నవంబర్లో గోదావరికి వచ్చే సహజ జలాలకు అడ్డుకట్ట పడినట్లే అవుతుందని సాక్షి దినపత్రిక వార్తాకథనం.
ప్రాజెక్టులే లేకున్నా.. ఇన్ ఫ్లో తగ్గుతుందని ఆందోళన
గోదావరికి ఎగువ నుంచి అక్టోబర్ నెలలో రోజుకి సగటున 40 వేల క్యూసెక్కులు, నవంబర్లో 20 వేల క్యూసెక్కుల చొప్పున మాత్రమే ఇన్ఫ్లో వస్తుంది. తెలంగాణలో ఈ ప్రాజెక్టులు పూర్తయితే అక్టోబర్, నవంబర్ నెలల్లో ఇన్ఫ్లో పడిపోవడం ఖాయం. ఆ సమయంలో గోదావరి జిల్లాల్లో ఖరీఫ్ పంట కీలక దశలో ఉంటుంది. ఏటా రబీకి 80 టీఎంసీల నీరు అవసరం. దీనిలో ఎగువ నుంచి సహజ జలాల రూపంలో 40 టీఎంసీలు వస్తుంది. సీలేరు జలాలతో పాటు నీటి పొదుపు చర్యల ద్వారా ఏటా గోదావరి జిల్లాల్లో రబీ సాగు గట్టెక్కుతుంది. ఎగువన ప్రాజెక్టులు పూర్తయితే గోదావరి డెల్టా ఆయకట్టులో 10.13 లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఉభయ గోదావరితో పాటు కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కృష్ణా ఆయకట్టు గట్టెక్కాలంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే శాశ్వత పరిష్కారం. కానీ ఏపీ సర్కార్.. సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లాలోని సోమశిలకు పురుషోత్తమపట్నం తదితర లిఫ్ట్ పథకాల ద్వారా, తరలించాలని వ్యూహ రచన చేశారు. అక్కడి నుంచి గాలేరు - నగరి, అక్కడ నుంచి హంద్రీ - నీవా అటుపై రాయలసీమకు సాగునీరు తరలిస్తామని హామీలు గుప్పించారు. ప్రస్తుతం ఎన్నికై మూడేళ్ల గడువు దాటిపోయింది. మరో ఏడాది తర్వాత జరిగే ఎన్నికల్లో గెలుపొందడం కోసమే 28 ప్రాజెక్టులు నిర్మాణం చేపడుతున్నామని తాజాగా మీడియాతో చంద్రబాబు చెప్పారు.
ఐదు రెట్లు పెరిగిన అంచనా వ్యయం
పోలవరం రిజర్వాయర్ ద్వారా 194.60 టీఎంసీల గోదావరి జలాలను నిల్వ చేసుకోవటంతో పాటు 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మరో 79 టీఎంసీల నీటిని లైవ్ స్టోరేజ్గా వినియోగించుకునే అవకాశం ఉంది. 80 టీఎంసీల నీటిని కృష్ణా జిల్లాకు తరలిస్తే, కృష్ణా నదిలోని 30 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్ వద్ద నుంచి రాయలసీమ అవసరాలకు వినియోగించవచ్చు. 540 గ్రామాలకు తాగునీరుతోపాటు, విశాఖ పరిశ్రమలకు, తాగునీటి అవసరాలకు నీరు అందుతుంది. 2018 నాటికి నీటిని విడుదల చేయాలంటే కాపర్ డామ్ నిర్మాణాన్ని పూర్తిచేయాలి. ఇంతవరకు కాపర్డామ్కు సంబంధించి డిజైన్లు ఖరారు కాలేదు. 2005-06లో పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.10,151.45 కోట్లుగా నిర్ధారించారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఈ ప్రాజెక్టును 2014 ఏప్రిల్ 1న జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన ఈప్రాజెక్టు నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. కేంద్రం ఇచ్చే నిధుల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యుటిలైజేషన్ బిల్లులు సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన బిల్లులకు, ఖర్చు చేసిన నిధులకు పొంతన లేదనే అనుమానాలు ఉన్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.48 వేల కోట్లు పెరిగినట్టు ప్రకటించారు.