ఎజాజుద్దీన్, వికారుద్దీన్ల మధ్య ఎన్నో పోలికలు
హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం నల్గొండ జిల్లా జానకీపురం ఎన్కౌంటర్లో మృతి చెందిన ఎజాజ్, మంగళవారం నాడు ఆలేరు - జనగామ మధ్య ఎన్కౌంటర్లో మృతి చెందిన వికారుద్దీన్ లక్ష్యం ఒకటే. జీహాద్ పేరుతో విధ్వంసం సృష్టించడం, పోలీసుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేయటం, అవసరమైన డబ్బుల కోసం దోపిడీలకు పాల్పడటం, అవసరమైతే వారిని హతమార్చడం.
జీహాద్ పేరుతో వీరు గత కొన్నేళ్లుగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇలాంటి కరడుగట్టిన ఉగ్రవాదులు మూడు రోజుల వ్యవధిలో, అదీ కొద్ది దూరంలోనే హతం కావడం గమనార్హం. ఎజాజ్ సిమి సంస్థ పేరుతో కార్యకలాపాలు నిర్వహించగా, వికారుద్దీన్ తెహరీక్ గల్బా ఎ ఇస్లాం పేరుతో సొంత సంస్థను ఏర్పాటు చేసి దేశంపై యుద్ధం ప్రకటించాడు.
ఈ రెండు ముఠాల శైలి ఒకేరకంగా ఉంది. మధ్యప్రదేశ్కు చెందిన ఎజాజుద్దీన్ చిన్నతనంలోనే సిమి పట్ల ఆకర్షితుడయ్యాడు. అబూ ఫైజల్ ముఠాతో కలిసి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత అరెస్టైన అతను మరో నలుగురితో కలిసి 2013 అక్టోబరు నెలలో ఖాండ్వా జైలు నుండి తప్పించుకున్నాడు.
అనంతరం ముఠాకు ఎజాజుద్దీన్ నాయకత్వం వహించాడు. దూకుడుగా వ్యవహరించేవాడు. మధ్యప్రదేశ్లో ఇద్దరు ఏటీఎస్ పోలీసులను చంపాడు. సూర్యాపేట కాల్పుల్లోను పోలీసుల్ని చంపారు. రాబరీలు, ఏటీఎంలు, బ్యాంకులు ధ్వంసం చేసి డబ్బులు సంపాదించుకునేవాడు.
ఇక వికారుద్దీన్ కూడా చిన్నతనంలోనే ఉగ్రవాదానికి ఆకర్షితుడయ్యాడు. 2002 నుండి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. పలువురితో కలిసి సొంతగా టీజేఐ సంస్థను స్థాపించాడు. ఉగ్రవాదానికి అవసరమైన డబ్బును ఈసేవా సెంటర్లు, రాబరీతో సమకూర్చుకునేవాడు.
గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్ వెళ్లి ఓ ప్రయివేటు బ్యాంకులో దోపిడీకి యత్నించింది. అప్పుడు వినయ్ అనే కానిస్టేబుల్ను చంపేశారు. 2010లో రమేష్ అనే కానిస్టేబుల్ను, అంతకుముందు ఓ హోంగార్డును హత్య చేశాడు. పోలీసులకు సవాల్గా మారిన వీళ్లు మూడు రోజుల వ్యవధిలో, ఒకే జిల్లాలో హతమవడం గమనార్హం.