దిమ్మతిరిగే శశికళ ప్లాన్: 29న్నే ముహూర్తం?
పార్టీ పగ్గాలను మాత్రమే కాకుండా సిఎం పీఠాన్ని కూడా దక్కించుకునేందుకు శశికళ దిమ్మతిరిగే వ్యూహరచన చేసినట్లు, అందుకు 29న మూహర్తం పెట్టినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
చెన్నై: తమిళ రాజకీయాలను మలుపు తిప్పుతూ జయలలిత వారసులెవరనే ప్రశ్నకు తెర దించేందుకు చిన్నమ్మ శశికళ దిమ్మ తిరిగే వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు. అన్నాడియంకె ప్రధాన కార్యదర్శి పదవిని మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా సొంతం చేసుకునేందుకు ఆమె పక్కా ప్రణాళిక రచించినట్లు అమలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
శశికళ వ్యూహానికి సంబంధించిన సమాచారం తమ వద్ద పూర్తిగా ఉందంటూ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి తెలుగు టీవీ చానెల్ ప్రసారం చేసిన వార్తాకథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అన్నాడియంకెలో జరుగుతున్న అంతర్గత పోరుకు శశికళ ముగింపు పలుకుతారని అంటున్నారు.
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి వార్తాకథనం ప్రకారం- పన్నీరు సెల్వాన్ని పక్కన పెట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకుశశికళ పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ముఖ్యమంత్రి సీటుు దక్కించుకునేందుకు పక్కా ప్లాన్తో శశికళ ఉన్నారు.
29వ తేదీన్నే శశికళ ప్రమాణం
తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం నుంచి పన్నీర్ సెల్వాన్ని దించేసి ఈ నెల 29వ తేదీననే ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణ స్వీకారం చేస్తారని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి వార్తాకథనం ఢంకా బజాయించి చెబుతోంది. అదే జరిగితే తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనానికి తెర తీసినట్లే అవుతుంది. ఇది తమిళనాడులో రాజకీయ సునామి అవుతుందని ఆ చానెల్ వ్యాఖ్యానించింది.
ఆమెకే శ్రీలంక అధ్యక్షుడి లేఖ
పన్నీరు సెల్వాన్ని పక్కన పెట్టి శ్రీలంక అధ్యక్షుడు కూడా శశికళకే లేఖ రాశారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీకి, రాష్ట్రపతి ప్రమబ్ ముఖర్జీకి, కాంగ్రెసు నేత రాహుల్ గాంధీకి శశికళ లేఖలు రాశారు. ఆమె అపాయింట్మెంట్ కోసం ప్రముఖులు ఎదురు చూస్తున్నారు. అదలా ఉండగా, విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లు ఆమెతో సమావేశమయ్యారు. దీన్ని బట్టి అధికారం అంతా శశికళ చేతుల్లోనే ఉందనే ప్రచారం సాగుతోంది.
ఒకరిద్దరు తప్ప అంతా శశికళ వైపే...
పన్నీర్ సెల్వం మంత్రివర్గంలోని ఒకరిద్దరు మంత్రులు తప్ప అంతా శశికళ వైపే మొగ్గు చూపుతున్నట్ల తెలుస్తోంది. అన్నాడియంకె శాసనసభ్యులు కూడా ఆమె వైపే ఉన్నట్లు చెబుతున్నారు. జయలలిత ఆస్పత్రిలో ఉండగానే తాను అధికారం చేజిక్కించుకోవడానికి శశికళ పక్కా ప్లాన్ రచించినట్లు చెబుతున్నారు. ఖాళీ కాగితాలపై శశికళ ఎమ్మెల్యేల సంతకాలు తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. జయ ఆస్పత్రిలో ఉన్న 74 రోజుల్లో ఆమె పార్టీపై పూర్తిగా పట్టు సాధించినట్లు చెబుతున్నారు. స్థానిక సంస్థలకు అభ్యర్థులను కూడా ఆమెనే ఎంపిక చేశారు.
అదే వేదిక నుంచి...
ఈ నెల 29వ తేదీన అన్నాడియంకె కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో శశికళకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి మాత్రమే అప్పగిస్తారని ఇప్పటి వరకు ప్రచారం సాగుతూ వచ్చింది. కానీ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అవసరమైన ఏర్పాట్లను కూడా ఈ సమావేశంలోనే పూర్తి చేస్తారని అంటున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ శశికళ వర్గం అందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఓ వైపు పన్నీర్ సెల్వానికి పార్టీని, ప్రభుత్వాన్ని నడిపే శక్తి లేదని చాప కింద నీరులా ప్రచారం సాగిస్తూ, మరో వైపు శశికళకు పదవి దక్కేలా ఆమె వర్గం పనిచేసినట్లు చెబుతున్నారు.