జైల్లో 'సత్యం' రాజు: తొలి రోజు ఎలా గడిపారు?
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగ రాజు మళ్లీ చర్లపల్లి జైలుకు వెళ్లాడు. అయితే, గతంలో నిందితుడిగా ఆ జైలులో ఉంటే ఈసారి దోషిగా కాలు పెట్టారు. ఆయన శుక్రవారంనాడు మలి విడత జైలు జీవితంలో తొలి రోజు ఎలా గడిపారనేది ఆసక్తికరంగా మారింది.
సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో దోషులుగా చర్లపల్లి జైలుకు వెళ్లిన బీ రామలింగరాజుతో సహా పది మందిని శుక్రవారం అడ్నిన్ బ్యారెక్ నుంచి గోదావరి బ్యారెక్కు మార్చారు. అందరికీ తెల్లరంగులో ఉన్న ఖైదీల దుస్తులు, పడుకునే సమయంలో నేలపై పరుచుకునేందుకు, కప్పుకొనేందుకు రెండు బ్లాంకెట్లు, భోజనం చేసే ప్లేట్లు, బకెట్, బ్యారెక్ శుభ్రం చేసుకునేందుకు అవసరమయ్యే సామగ్రి ఇచ్చారు.
నియమం ప్రకారం జైలు సిబ్బంది శుక్రవారం ఉదయం అందరితోపాటు రామలింగరాజుతో సహా పది మందికి అల్పాహారంగా కిచిడీ ఇచ్చారు. అయితే, ఆయన కొద్దిగానే తిని పక్కన పెట్టారు. మధ్యాహ్నం సాధారణ భోజనం ఇచ్చారు.
శుక్రవారం ఉదయమే రామలింగ రాజు నిద్ర లేచారు. దాదాపు 45 నిమిషాల పాటు వాకింగ్ చేశారు. శుక్రవారం ఉదయంకాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత రామలింగరాజును, ఆయన జట్టును ఉదయం 8 గంటల సమయంలో గోదావరి బ్యారక్కు తరలించారు. వారికి ఖైదీలు ధరించే తెల్ల దుస్తులను అందజేశారు. పది గంటలకు కారాగారం ఉన్నతాధికారులు వెళ్లి సౌకర్యాల గురించి ప్రశ్నించారు. టీవీ సౌకర్యం గురించి అధికారులు వేసిన ప్రశ్నకు రామలింగ రాజు బృందం స్పందించలేదు.
ఉదయం పది గంటలకో భోజనంగా అన్నం, సాంబారు, శేనగపప్పు, మజ్జిగ చారు అందజేశారు. సాయంత్రం 4 గంటలకు మరోమారు భోజనం అందించారు. జైలులో అదుబాటులో ఉన్న లిఫ్టన్ యంత్రం నుంచి రామలింగ రాజు కాఫీ తెప్పించుకున్నారు.
గురువారం జైలుకు వస్తూ పుస్తకాల సంచిని తెచ్చుకున్న రామలింగ రాజు మొదటి రోజంతా పుస్తకాల పఠనంతోనే కాలం వెళ్లబుచ్చారు.