ఎస్బీఐ విలీనంతో ఏం జరుగుతుంది?: వినియోగదారులకు మేలెంత?
స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చరిత్రలో ఏప్రిల్ 1, 2017 చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎందుకంటే.. ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం శనివారం నుంచి ప్రారంభమైంది.
న్యూఢిల్లీ/హైదరాబాద్: స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చరిత్రలో ఏప్రిల్ 1, 2017 చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎందుకంటే.. ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం శనివారం నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అనుబంధ బ్యాంకు శాఖలన్నీ ఇక ఎస్బీఐ శాఖలుగా మారనున్నాయి. పూర్తిగా వ్యవస్థలన్నిటినీ ఏకీకృతం చేయడానికి రెండు నెలల సమయం పడుతుందని ఎస్బీఐ పేర్కొంది.
ఈ విలీనం వల్ల రుణ స్వీకర్తలకు ప్రయోజనాలు దక్కనున్నాయన్నది మార్కెట్ విశ్లేషకుల చెబుతున్నారు. అనుబంధ బ్యాంకులతో పోలిస్తే ఎస్బీఐ వద్ద కార్పొరేట్లకు తక్కువ రేట్లపై రుణాలు లభ్యం అవుతాయి. ఇతర ఖాతాదార్లూ డిపాజిట్లు, రుణాల విషయంలో ప్రయోజనమే పొందనున్నారని అంచనా వేస్తున్నారు. అనుబంధ బ్యాంకులతో పోలిస్తే ఎస్బీఐకి అంతర్జాతీయంగా నిధులను తక్కువ రేటుకే సమీకరించుకునే సత్తా ఉండటం ఇందుకు ఉపకరిస్తుంది.
కొన్ని శాఖలు మూయక తప్పదు?
అనుబంధ బ్యాంకుల విలీనం వల్ల చాలా వరకు శాఖలను మూసివేస్తారన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఒకే దగ్గర ఎస్బీఐకే చెందిన శాఖలు ఉండటం కంటే.. అసలు శాఖలు లేని చోట సేవలు ప్రారంభించడంపై బ్యాంకు దృష్టి సారించనుందని ఉన్నత స్థాయి అధికారి ఒకరు అంటున్నారు. వినియోగదార్లుకు మరింత దగ్గరగా వెళ్లాలన్నదే ఉద్దేశమని.. అందువల్ల పక్క పక్కన రెండు ఎస్బీఐ శాఖలుంటే.. ఒకదానిని తీసివేసి మరో దగ్గర ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ లైసెన్సుల ద్వారా వీలైనంత మేరకు అందరు ఖాతాదార్లకు చేరువ కావడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
వీఆర్ఎస్ ఇందుకేనా?
కొత్త వాతావరణంలో కొంత మంది ఇమడలేకపోతారన్న ఆలోచనతోనే వీఆర్ఎస్ను ఎస్బీఐ తీసుకొచ్చిందని తెలుస్తోంది. అనుబంధ బ్యాంకుల్లో మొత్తం 70వేల మంది సిబ్బంది ఉండగా.. అందులో 12,000 మందికి వీఆర్ఎస్ అర్హత ఉంది. ఏప్రిల్ 5 తర్వాత కానీ ఎంత మంది వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారన్న విషయంపై స్పష్టత రాదు. అంతక్రితం ఆర్బీఐని కోరినట్లుగానే విలీన ప్రక్రియను మూడు నెలల్లోపు పూర్తి చేయడానికే మొగ్గుచూపుతున్నట్లు ఎస్బీఐ ఎండీ రజనీశ్ కుమార్ చెప్పారు.
నగదు బదిలీ ఉచితంగానే..?
మొత్తం మీద 1500-1600 వరకూ ఎస్బీఐ, అనుబంధ బ్యాంకుల శాఖలను మూసివేసే అవకాశాలున్నాయని రజనీశ్ కుమార్ అంచనా వేశారు. ఇప్పటికే అనుబంధ బ్యాంకుల నుంచి రుణాల జారీ నిలిపివేశారు. ఏప్రిల్ 15 నుంచి రుణాల జారీలో స్పష్టత రావొచ్చు. చెక్కుల క్లియరెన్స్, నగదు డిపాజిట్ మెషీన్, తదితర సదుపాయాల కోసం ప్రస్తుత శాఖనే ఉపయోగించుకోవాలి. అన్ని ఫారెక్స్ వ్యాపారం/లావాదేవీలను ప్రస్తుత శాఖల ద్వారానే లావాదేవీలు జరుపుకోవచ్చు. ఎస్బీఐకి, ఇతర అనుబంధ బ్యాంకు శాఖల మధ్య నగదు బదిలీ ఉచితంగానే చేసుకోవచ్చు.
ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు..
అనుబంధ బ్యాంకుల ఖాతాదారులు నేటి నుంచి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలకు ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల ద్వారా చేసుకోవచ్చు. పాత యూజర్ నేమ్, పాస్వర్డ్తోనే ఇదీ పనిచేస్తుంది. ఎస్బీ ఎనీవేర్ అసోసియేట్ బ్యాంక్స్ యాప్ను మాత్రం తదుపరి నోటీసు వరకూ వినియోగించుకోవచ్చు.
ఎస్బీఐ ఛార్జీలే.. ఐఎఫ్ఎస్సీ కోడ్ మారే అవకాశం
కాగా, నెఫ్ట్, ఆర్టీజీస్ సేవల్లో ఎస్బీఐ ఛార్జీలు వర్తిస్తాయి. అంతక్రితం కొన్ని అనుబంధ బ్యాంకుల్లో ఆయా ఛార్జీలు తక్కువగా ఉన్నా.. ఇక నుంచి ఎస్బీఐ ఛార్జీలే కట్టాల్సి వస్తుంది. అనుబంధ బ్యాంకుల ఐఎఫ్ఎస్సీ కోడ్ ప్రస్తుతానికి మారకపోయినప్పటికీ.. జులై నుంచి మారే అవకాశం ఉంది. అంతేకగా, బ్యాంకులకు చెందిన అందరు ఖాతాదార్లకు తాజా చెక్కు, పాస్ పుస్తకాలు జారీ కానున్నాయి. కాగా, ఫిక్స్డ్ డిపాజిట్లు మెచూరిటీ గడువు వరకూ అలాగే ఉంటాయి. ఆ తర్వాత ఎస్బీఐకి చెందిన డిపాజిట్ పథకాల్లో ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఖాతాదార్లకు ఏవైనా సందేహాలుంటే..టోల్ ఫ్రీ నంబర్లు 1800 180 6005, 1800 425 1825, 1800 425 2244, 1800180 2010, 1800 425 5566 సంప్రదించవచ్చు.