‘సింగరేణి’లో సింహం సింగిల్గానే: కేసీఆర్ వ్యూహంతో దూసుకెళ్లిన కవిత
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తనదైన వ్యూహాలతో వెనకుండి నడిపించగా.. ప్రచారం ముందుకు దూసుకెళ్లారు ఆయన తనయ, ఎంపీ కవిత. ఫలితంగా సింగరేణిలో టీఆర్ఎస్ అనుబంధ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) ఘన విజయం. కాగా, సింగరేణిలో తమదే విజయమని కేసీఆర్ ముందు నుంచే ఎంతో ధీమా చెప్పడం గమనార్మం. అన్నీ తానై కేసీఆర్ చెప్పింది నిజం చేశారు కవిత.
మునుపెన్నడూ లేని గెలుపు..
టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మునుపెన్నడూ లేనంత మెజారిటీతో ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహం, సంఘం గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సారథ్యంలో గెలుపు బావుటా ఎగురవేసింది. సింగరేణిపై మొదట్నుంచి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిన విషయం తెలిసిందే. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విస్తరించిన ఈ సంస్థల్లో కార్మికులంతా దాదాపు తెలంగాణ వారే.
అపట్నుంచే కీలకంగా..
తెలంగాణ రాష్ట్ర సాధనకు కార్మికులు, వారి కుటుంబాల మద్దతు అవసరమనే భావనతో ఉద్యమ సమయంలో కేసీఆర్ సింగరేణిని సందర్శించారు. కార్మికులతో కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చిన కార్మికులు.. అప్పట్నుంచే టీఆర్ఎస్ పార్టీపై అభిమానం పెంచుకున్నారు. దీంతో సింగరేణిలో టీఆర్ఎస్కు అనుబంధంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు.
క్రమంగా బలం పెంచుకుంటూ..
2007లో జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన టీబీజీకేఎస్ 18,476 ఓట్లను సాధించింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో క్రమేపీ పట్టు పెంచుకుంది టీబీజీకేఎస్. 2012లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసింది. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. మరో సంఘమైన ఏఐటీయూసీ బలంగా ఉంది. అయినా కార్మికుల మద్దతుతో 23,311 ఓట్లను సాధించి టీబీజీకేఎస్ గుర్తింపు కార్మిక సంఘంగా అవతరించింది. ఈ విజయం తెలంగాణ ఉద్యమానికి, టీఆర్ఎస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది..
సింగరేణిపై సీఎం దృష్టి...
తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా సింగరేణి కార్మికులు టీఆర్ఎస్ వెంటే ఉన్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బొగ్గు గనులున్న ప్రాంతాల్లోని 12 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచింది. ఎంపీ స్థానాల్లోనూ విజయం సాధించింది. తమకు ఆది నుంచి అండగా నిలిచిన సింగరేణిని అభివృద్ధి చేయడంతో పాటు దాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా కార్మికులకు వృత్తిపన్ను రద్దు చేశారు. ఆదాయపన్ను రద్దు కోసం శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయించారు. కొత్త ఉద్యోగ నియామకాలు, లాభాల్లో వాటాలు పెంపుదల తదితర నిర్ణయాలు తీసుకున్నారు.
చివరి అస్త్రంగా వారసత్వ ఉద్యోగాలు..
వారసత్వ ఉద్యోగాలు గతంలో రద్దు కాగా వాటిని పునరుద్ధరించారు. అయితే, దీన్ని న్యాయస్థానం రద్దు చేసింది. ఎన్నికలకు ముందు ఈ పరిణామం టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. మరో 17 నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సింగరేణి ఎన్నికలు ప్రజాభిప్రాయానికి ప్రతిబింబంగా ఉంటాయన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో విజయానికి వ్యూహం రచించారు. కార్మికులకు వూరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు. వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నియామకాల ద్వారా ఇస్తామన్నారు. 19 వేల మంది అలియాస్ కార్మికులను ఒకే పేరుతో నమోదు చేస్తామని చెప్పారు. ప్రభుత్వపరంగా ఒకవైపు కార్మికులకు భరోసా ఇస్తూనే మరోవైపు ప్రచారంపై దృష్టి సారించారు. ఉపముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఆగస్టు నుంచి విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కవిత సారథ్య బాధ్యతలు చేపట్టి స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక నేతలను సమన్వయపరిచారు. కేసీఆర్, కవితలు ముఖ్యమైన నాయకులతో స్వయంగా మాట్లాడి ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.
విపక్షాలకు చేదు అనుభవం
ఇది ఇలావుంటే.. జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలు, టీఎన్టీయూసీలు కూటమిగా బరిలో దిగాయి. ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.
సింగరేణి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని, టీఆర్ఎస్ ఆధిపత్యానికి గండి కొట్టాలని విపక్ష పార్టీల అనుబంధ సంఘాలు చేతులు కలిపాయి. ఏఐటీయూసీ నేతృత్వంలో ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ తదితర సంఘాలన్నీ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశాయి. సింగరేణికి టీఆర్ఎస్ హామీలు ఇవ్వడం మినహా చేసిందేమీ లేదని, వారసత్వ ఉద్యోగాల కల్పనలోనూ విఫలమైందనే ప్రచారంతో ఈ సంఘాలు కార్మికులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశాయి. సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ అగ్రనేతలు ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. అయినా, భూపాలపల్లి, మందమర్రిలో మినహా ఎక్కడ విపక్షాల కూటమి పోటీనివ్వలేదు. హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ తదితర ఎనిమిది సంఘాలు పోటీలో ఉన్నా వాటి ప్రభావం మాత్రం శూన్యమనే చెప్పాలి. కేసీఆర్ వ్యూహంతో విస్తృత ప్రచారంతో దూసుకెళ్లిన కవిత.. సింహం సింగిల్గానే వస్తుందంటూ సింగరేణిలో మునుపెన్నడూలేని విధంగా టీబీజీకేఎస్కు భారీ విజయాన్నందించారు. సింగరేణి ఎన్నికల్లో అన్నీతానైన కవిత.. టీబీజీకేఎస్ గెలుపును నిర్దేశించారని చెప్పవచ్చు.