సంచలనాలు వ్యూహమే! సీమాంధ్రపై కేసీఆర్ రివర్స్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మారిపోతున్నారు! సార్వత్రిక ఎన్నికలకు ముందు... పద్నాలుగేళ్లుగా తన పదునైన వ్యాఖ్యలతో హీటెక్కించిన కేసీఆర్... ఇప్పుడు తెలంగాణలోని సీమాంధ్రులతో మచ్చికను కోరుకుంటున్నారు. అందుకు ఆయన గత కొద్ది రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన వ్యూహాత్మకంగా పలు పావులు కదుపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి.. హైదరాబాదులోని సీమాంధ్రులకు భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేయడం, రెండోది బీజేపీ వైపు వెళ్లడం లేదనే సంకేతాలు.
త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్ ఎన్నికల ఆలస్యం పైన హైకోర్టు ప్రభుత్వాన్ని వివరణ అడిగింది. వారం రోజుల్లో ఎన్నికల తేదీతో సహా వివరాలు అందిస్తామని ప్రభుత్వం హైకోర్టులో రెండు రోజుల క్రితం చెప్పింది. ఎన్నికలు త్వరలో ఎప్పుడైనా జరగవచ్చు.
ఈ నేపథ్యంలో హైదరాబాదును తమ హస్తగతం చేసుకునేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాదులో బీజేపీ - టీడీపీ కూటమి ఎక్కువ స్థానాలను గెలుచుకుంది. అనంతరం పలువురు ఎమ్మెల్యేలు తెరాసలోకి వెళ్లడం వేరే విషయం.
గ్రేటర్ ఎన్నికలకు ముందు హైదరాబాదుకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, పలువురు నేతలు తెరాసలో చేరడం కేసీఆర్కు ఉత్సాహం నింపేదే. అయితే, మేయర్ పీఠం దక్కించుకునేందుకు కేసీఆర్ మరింత పకడ్బందీ వ్యూహంతో వెళ్తున్నారని అంటున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఆయన సీమాంధ్రులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్, కృష్ణారెడ్డిలు తెరాసలో చేరిన సందర్భంలో, ఆ తర్వాత, ఇప్పుడు కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రాంతీయ విబేధాల్లేవని, హైదరాబాదులో స్థిరపడ్డ సీమాంధ్రులకు ముల్లు గుచ్చుకుంటే నోటితో తీస్తానని భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేసీఆర్ సీమాంధ్రుల పైన ఘాటైన పదజాలాలు వాడారనే విమర్శలు ఉన్నాయి. కేసీఆర్ పదజాలం పైన నాడు సీమాంధ్ర నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు మాత్రం కేసీఆర్ రివర్స్ గేర్ వేశారని అంటున్నారు. హైదరాబాదులో స్థిరపడ్డ సీమాంధ్రులకు అండగా ఉంటామని చెప్పడం గమనార్హం.
ఆయన వ్యాఖ్యలు పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని అంటున్నారు. మరికొందరు గ్రేటర్ ఎన్నికల వ్యూహంలో భాగమని చెబుతున్నారు. మరోవైపు గత కొద్ది రోజులుగా... ఎన్డీయేలో తెరాస చేరుతుందనే ప్రచారం జరుగుతోంది. ఎంపీలు, కవిత, కేకేలకు కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కవచ్చుననే వాదనలు వినిపించాయి.
దీని పైన మొన్నటి వరకు తెరాస స్పందించలేదు. రెండు రోజుల క్రితం మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాత్రం దీనిని కొట్టి పారేశారు. అయితే, ఇది కూడా గ్రేటర్ ఎన్నికల వ్యూహంలో భాగమే అంటున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో మైనార్టీ ఓట్లు చాలా కీలకం. ఈ నేపథ్యంలో మంత్రి ఖండించారని చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత తెరాస ఎన్డీయేలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.