భారతరత్న: మోడీకి 'మిత్రుల' సెగ, కేసీఆర్ జత...
న్యూఢిల్లీ: అటల్ బిహారీ వాజపేయి, మదన్ మోహన్ మాలవ్యాలకు భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో... తమ నేతలకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావుకు, స్వర్గీయ శివసేన చీఫ్ బాల్ థాకరే, స్వర్గీయ టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావులకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లు మరోసారి తెర పైకి వచ్చాయి.
బాల్ థాకరే, ఎన్టీఆర్, పీవీలకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లు ఎప్పటి నుండో వినిపిస్తున్నాయి. వాజపేయి, మాలవ్యాలకు భారతరత్న ఇవ్వడాన్ని స్వాగతిస్తూనే.. ఆయా పార్టీలు లేదా నేతలు వీరికి కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, తెలుగుదేశం, శివసేన ఎన్డీయే మిత్రపక్షాలు. ఈ పార్టీలు వారి వారి నేతల కోసం భారతరత్న డిమాండ్ చేస్తున్నాయి. అలాగే తెలంగాణలో అధికారంలో తెలంగాణ రాష్ట్ర సమితి బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీతో పాటు పలువురు తెలుగు నేతలు పీవీకి భారతరత్న ఇవ్వాలని అంటున్నారు.
వాజపేయి, మాలవ్యా
ప్రముఖ స్వతంత్ర సమరయోధులు మదన్ మోహన్ మాలవ్యా, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయిలకు కేంద్రం బుధవారం భారతరత్నలను ప్రకటించింది.
ఎన్టీఆర్
స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని టీడీపీ చాలా రోజులుగా డిమాండ్ చేస్తోంది. దీనిపై కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు బుధవారం మాట్లాడుతూ... ఎన్టీఆర్కు భారతరత్న అనేది తెలుగువారందరి డిమాండ్ అని, కేంద్రం సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తుందని చెప్పారు.
పీవీ నర్సింహా రావు
మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావుకు భారతరత్న ప్రకటించక పోవడం వెలితి అని తెలంగాణ రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. వాజపేయి, మాలవ్యాలు అర్హులేనని, పీవీకి ఇవ్వకపోవడం వెలితి అని కేసీఆర్ చెప్పారు.
బాల్ థాకరే
శివసేన వ్యవస్థాపకులు బాల్ థాకరేకు భారతరత్న ఇవ్వాలని ఆ పార్టీ మరోసారి డిమాండ్ తెరపైకి తెచ్చింది. బాలాసాహెహ్ గొప్ప వ్యక్తి అని, వాజపేయికి భారతరత్న ఇచ్చినందుకు సంతోషమని, అలాగే బాల్ థాకరే కూడా అందుకు అర్హులని శివసేన చెబుతోంది.