ఆదికి షాక్: వద్దన్నా, జనం జగన్ వెంటే?, అడుగడుగునా బ్రహ్మరథం..
Recommended Video
కడప: పార్టీని బలోపేతం చేయడంతో పాటు పార్టీ ఫిరాయించిన నేతలను వచ్చే ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించేలా జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను ప్లాన్ చేసుకున్నట్టు కనిపిస్తోంది.
గురువారం నాడు జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర సందర్భంగా మంత్రి ఆది నారాయణరెడ్డి మీద వైసీపీ నాయకుడు డాక్టర్ సుధీర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన విమర్శలకు జనం నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడం గమనార్హం.
ఆది టార్గెట్:
మంత్రి ఆదినారాయణ రెడ్డి వైసీపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఆపై టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన వియ్యంకుడు కేశవరెడ్డి విద్యా సంస్థల వ్యవహారం కూడా వివాదాస్పదమవడంతో.. ఆ విషయంలో ప్రభుత్వ అండదండలు అవసరమవడంతోనే ఆయన టీడీపీతో కుమ్మక్కయ్యారని ప్రతిపక్షం విమర్శిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను దెబ్బకొట్టడానికి ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గురువారం ప్రజా సంకల్పయాత్రలో ఆది నారాయణ రెడ్డికి సెగ తగిలేలా పలువురు ఘాటు విమర్శలతో విరుచుకపడ్డారు.
పాదయాత్రకు వెళ్లవద్దని
జగన్ పాదయాత్రకు వెళ్లకుండా ఉండాలని మంత్రి ఆది నారాయణ రెడ్డి హుకుం జారీ చేసినట్టుగా తెలుస్తోంది. పాదయాత్రకు దూరంగా ఉండాలని నియోజకవర్గంలోని ప్రజల మీద ఒత్తిడి తెచ్చినట్టు చెబుతున్నారు. అయితే జనం మాత్రం మంత్రి ఆది హెచ్చరికలను ఖాతరు చేయలేదని, పాదయాత్రకు హాజరైన జనాన్ని చూస్తే తెలిసిపోతోంది. ఒకవిధంగా మంత్రి ఆదికి ఇది కొంత ఆందోళన కలిగించే అంశం కూడా. జగన్ కోసం తరలిని జనాన్ని చూసి.. వచ్చే ఎన్నికల్లో జనం తనవైపు ఉంటారో లేదోనన్న టెన్షన్ ఆదిలో ఇప్పటినుంచే మొదలైనట్టు తెలుస్తోంది.
ఎర్రగుంట్లలో భారీ స్పందన:
జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్లలో అడుగుపెట్టినప్పటి నుంచి జగన్ కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జనసందోహంతో ఆయన యాత్ర కిక్కిరిసిపోయి కనిపించింది. పాదయాత్ర ఎర్రగుంట్లలోకి ప్రవేశించినప్పటి నుంచి పట్టణంలోని శివారు ప్రాంతంలో బస చేసే ప్రదేశానికి చేరుకునేవరకు జగన్ వెంట జనం భారీగా తరలి వచ్చారు. చాలా చోట్ల మహిళలు మంగళ హారతులు, పూలతో స్వాగతం తెలిపారు.
సభ ఆలస్యమైనా:
నిజానికి ఎర్రగుంట్లలో మధ్యాహ్నాం 3గం.కు బహిరంగ సభ జరగాల్సి ఉంది. కానీ రెండున్నర గంటలు ఆలస్యమైంది. అయినప్పటికీ.. జనం సభ పట్ల తీవ్ర ఆసక్తి కనబర్చినట్టు తెలుస్తోంది. జగన్ ఎర్రగుంట్ల చౌరస్తాలో అడుగుపెట్టినప్పటి నుంచి జనం వేలాదిగా తరలి వచ్చారు. పాదయాత్రకు సంఘీభావంగా ఆయన వెంట నడిచారు. ఒకానొక సమయంలో జనం తాకిడి ఎక్కువవడంతో జగన్ ముందుకు కదలడమే కష్టంగా మారిపోయింది.