మామ్ సక్సెస్ టీంలో సిద్దిపేట శాస్త్రవేత్త
హైదరాబాద్: అంగారక గ్రహం పైకి మార్స్ ఆర్బిటర్ మిషన్ (మార్స్)ను విజయవంతంగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తల బృందంలో మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన శాస్త్రవేత్త ఒకరు ఉన్నారు. ఆయన పేరు వీరబత్తిని సురేందర్. సిద్దిపేటలోని మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన సురేందర్ ఇస్రో శాస్త్రవేత్త స్థాయికి ఎదిగారు.
13 ఏళ్లుగా క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పని చేస్తున్నారు. చంద్రయాన-1, జీఎస్ఎల్వీ-డీ5 వంటి కీలక ప్రాజెక్టుల్లోను పాలు పంచుకున్నారు.
మామ్ విజయంలోను ఈయన పాత్ర ఉంది. ఉప గ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టే ముందు అందులోని వ్యవస్థలు సరిగా పని చేస్తున్నాయో లేదో పరిశీలించే అయిదుగురు శాస్త్రవేత్తల బృందంలో సురేందర్ ఉన్నారు. ఇది చాలా కీలకమైన విభాగం. మామ విజయంలో సిద్దిపేటవాసి భాగస్వామి కావడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ ఘనవిజయం సాధించింది. కుజుడి కక్ష్యలోకి మామ్ ప్రవేశించిన తర్వాత అది పంపిన సంకేతాల ఆధారంగా తెలిసింది. ఆ సంకేతాలను తొలిగా అందుకున్నది.. కాన్బెర్రా (ఆస్ట్రేలియా)లోని డీప్స్పేస్ కమ్యూనికేషన్ కాంపెక్స్ (సీడీఎస్సీసీ). ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాన స్టేషన్ సీడీఎస్సీసీనే. తనకు అందిన సమాచారాన్ని అది బెంగళూరులోని ఇసా్ట్రక్ మిషన్ కంట్రోల్ సెంటర్కు ప్రసారం చేస్తుంది.