మూర్తికి పాయ్, బాల అండ: సిక్కా పనితీరు బాగా లేకే..
సంక్షోభంలో ఉన్న ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి సంస్థ సీనియర్ల నుంచి మద్దతు లభించింది. ఆయనకు మాజీ సీఎఫ్ఓలు మోహన్ దాస్ పాయ్, బాలక్రుష్ణన్ అండగా నిలిచారు.
న్యూఢిల్లీ: సంక్షోభంలో ఉన్న ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి సంస్థ సీనియర్ల నుంచి మద్దతు లభించింది. ఆయనకు మాజీ సీఎఫ్ఓలు మోహన్ దాస్ పాయ్, బాలక్రుష్ణన్ అండగా నిలిచారు. ముందు సంస్థ బోర్డును పూర్తిగా పునర్వ్యవస్థీకరించాల్సిందేనని బాలక్రుష్ణన్ వంటి వారు స్పష్టం చేశారు.
ఇన్ఫోసిస్లో విశాల్ సిక్కా తన చెత్త పనితీరును కప్పిపుచ్చుకునేందుకు సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తిపై తాజా సంక్షోభ కారకుడి ముద్ర వేస్తున్నారని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్దాస్ పాయ్ విమర్శించారు. అసలు బోర్డు పనితీరు సరిగ్గా లేదన్నారు.
ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్ బోర్డు వైఖరి కూడా సరిగ్గా లేదని మోహన్ దాస్ పాయ్ తేల్చి చెప్పారు. కొత్త సీఈఓను వెతికే ముందు బోర్డు చైర్మన్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సహా మొత్తం వైదొలగాలని బాలక్రుష్ణన్ డిమాండ్ చేశారు. సంక్షోభం నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ అంచనాలు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితుల్లో ఇతర సంస్థలకు సీనియర్లను వలస వెళ్లకుండా నివారించాలని అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు సూచిస్తున్నాయి.
తప్పుకోవడానికి ఇలా మూర్తిపై ఆరోపణలన్న పాయ్
‘అవును. ఇది నిజం. ఆయన (సిక్కా) ఫిబ్రవరి నుంచే కంపెనీని వీడాలని అనుకుంటున్నారు. ఆయన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మూర్తిని లక్ష్యంగా చేసుకున్నారు' అని పీటీఐకిచ్చిన ఇ - మెయిల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సిక్కా రాజీనామాతో ఇన్ఫోసిస్ పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి సీఈఓ నియామకం. మోసపూరిత, వ్యక్తిగత దూషణలను తట్టుకోలేకే రాజీనామా చేస్తున్నట్లు మూర్తి పేరును వెల్లడించకుండా.. సిక్కా పేర్కొన్న సంగతి తెలిసిందే.
కాగా, సిక్కాను ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్గా నియమించడాన్ని కూడా పాయ్ తప్పుపట్టారు. ‘కంపెనీలో ఇపుడు ఛైర్మన్, సహ ఛైర్మన్, ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్కు తోడు తాత్కాలిక సీఈఓ ఉన్నారు. ఇది గందరగోళానికి గురి చేసేదిగా ఉంది' అని ఆయన అన్నారు. నారాయణ మూర్తిని తిరిగి కంపెనీలోకి అడుగుపెట్టకుండా చేసే అధికారం బోర్డుకు ఉందా అని ప్రశ్నించగా.. ‘ప్రపంచంలోని ఏ బోర్డు కూడా ఒక ప్రమోటర్పై అలాంటి ప్రకటన చేయలేదు. ఒక వేళ అలా చేస్తే అది అసంబద్ధ, తప్పుడు చర్య అవుతుంద'ని పాయ్ సమాధానమిచ్చారు. ‘బోర్డులు డైరెక్టర్లను నియమిస్తాయి. అయితే అందుకు వాటాదార్ల అనుమతి పొందాలి కాబట్టి బోర్డులకు పూర్తి అధికారమంటూ ఉండదు' అని మరో ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు.
తర్వాతే సీఈఓ అన్వేషణ జరుపాలన్న బాలకృష్ణన్
కొత్త సీఈఓను వెతికే ముందు ఛైర్మన్ ఆర్. శేషశాయి, సహ-ఛైర్మన్ రవి వెంటేశన్లు తప్పుకోవాలని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ వి. బాలకృష్ణన్ పేర్కొన్నారు. ‘ఆడిట్(రూపా కుద్వా), రెమ్యునరేషన్(జెఫ్రె ఎస్. లేమాన్) కమిటీల అధిపతులు కంపెనీలోని కార్పొరేట్ పాలన విషయంలో అవకతవకలు జరగకుండా బాధ్యత తీసుకోవాల'ని ఆయన అన్నారు. బోర్డును చక్కదిద్దకుండా.. కొత్త సీఈఓను తీసుకురావడం ‘ఆత్మహత్యా సదృశ్యమ'ని చెప్పారు. అంతక్రితం కూడా ఇన్ఫీ బోర్డును పునర్నిర్మించాలని బాలకృష్ణన్ పలుమార్లు పేర్కొన్న సందర్భాలున్నాయి. కాగా, భారత వాటాదార్లు ప్రజా వేదికలపై మాట్లాడరని.. అయితే సరైన వ్యక్తులతో తమ ఆందోళనలు వెలిబుచ్చుతారన్నారు. ఇక బైబ్యాక్ పరిమాణాన్ని బోర్డు పెంచి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.
అయినా పుంజుకుంటాం: ప్రవీణ్ రావు
సిక్కా నిష్క్రమణతో కంపెనీలో గందరగోళ పరిస్థితులు తలెత్తిన మాట వాస్తవమేనని తాత్కాలిక సీఈఓ ప్రవీణ్ రావు పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నుంచి త్వరలోనే పుంజుకుంటుందన్న విశ్వాసం తనకున్నట్లు ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన అన్నారు. ఇన్ఫీకి సవాళ్లు ఎదురుకావడం కొత్తేమీ కాదన్నారు. ‘కంపెనీ ఇప్పటిదాకా చాలా నేర్చుకుంది. చాలా చేసింది. చాలా దూరం ప్రయాణించింది. భవిష్యత్ కూడా బలంగా కనిపిస్తోంది. అంతక్రితం లాగే ముందుకు వెళ్లాలని భావిస్తున్నామ'ని రావు అన్నారు. సాధ్యమైనంత వరకు ఉద్యోగులకు లేఖలు రాస్తూనే ఉంటానని తన తొలి లేఖలో ఆయన పేర్కొనడం విశేషం.
2017-18పై విశ్లేషకుల భయాలు
సిక్కా రాజీనామా నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలను కంపెనీ తగ్గించవచ్చేమోనని విశ్లేషకులు భయపెడుతున్నారు. అందుకే ఈ షేరును సిఫారసు చేయడంలో జాగ్రత్త వహిస్తున్నారు. నాయకత్వం విషయంలో అనిశ్చితులు ఈ ఏడాది ఆదాయ పనితీరుపై ఒత్తిడి పెంచవచ్చని వారు భావిస్తున్నారు. ‘రాబోయే 6నెలల్లో కొత్త సీఈఓను కంపెనీ నియమించేంత వరకు మరికొంత మంది సీనియర్ స్థాయి వ్యక్తులు వైదొలగవచ్చని అంచనా వేస్తున్నాం. దీంతో 2017-18 అంచనాలు తగ్గే అవకాశం ఉంద'ని బ్రోకరేజీ సంస్థ సీఎల్ఎస్ఏ ఏషియా పసిఫిక్ మార్కెట్స్ పేర్కొంది.
వలసలు అరికట్టాలని అంతర్జాతీయ విశ్లేషకుల అంచనా
ఇన్ఫోసిస్పై రేటింగ్ను ‘ఓవర్ వెయిట్' నుంచి ‘తటస్థం'కు మారుస్తున్నట్లు జేపీ మోర్గాన్ సెక్యూరిటీస్ ఇండియా తెలిపింది. ప్రస్తుత ఇన్ఫోసిస్ క్లయింట్లను అసెంచర్, టీసీఎస్, కాగ్నిజెంúలు ఎగరేసుకువెళ్లే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అంటోంది. ‘ఉద్యోగుల్లో ఉత్సాహం నింపే, సాంకేతికతపై నిర్ణయాత్మక శక్తి ఉన్న, క్లయింట్ల నిర్ణయాలను ప్రభావితం చేసే కొత్త సీఈఓను వెతికిపట్టుకోవడం అంత సులువు కాద'ని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ అంటోంది. ఈ భయాల నేపథ్యంలో యాక్సిస్ క్యాపిటల్, ప్రభుదాస్ లీలాధర్, ఎడెల్వీజ్ సెక్యూరిటీస్, మేబ్యాంక్ కిమ్ ఎంగ్, ఐడీఎఫ్సీ క్యాపిటల్ మార్కెట్స్ ఇన్ఫీ షేరు రేటింగ్ను తగ్గించాయి. ఇవన్నీ షేరు లక్ష్యాన్ని 6-18% వరకు తగ్గించాయి.
అయితే స్వల్పకాలంలో బైబ్యాక్ కారణంగా నష్టాలు తగ్గే అవకాశం ఉంది. కాగా, సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి వ్యక్తులతో పాటు.. ఉద్యోగులు కూడా వలస వెళ్లడం అధికమయ్యే అవకాశం ఉందని.. ఇన్ఫీ తాత్కాలిక సీఈఓ ప్రవీణ్ రావు, ఆయన బృందానికి ఇది ప్రధాన సవాలుగా మారవచ్చని విశ్లేషకులు అంటున్నారు. యాజమాన్యంలో మార్పుల కారణంగా క్లయింట్లు జాగ్రత్తగా వ్యవహరించొచ్చు.. అలాగే పోటీదార్లు వీరిని ఆకర్షించే ప్రయత్నం చేయొచ్చని మెక్వారీ రీసెర్చ్ పేర్కొంది. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలపై క్లయింట్లకు ఏవైనా ఆందోళనలుంటే.. స్పష్టతనివ్వడానికి సైతం కంపెనీ సిద్ధంగా ఉందన్న సంకేతాలనిచ్చింది. సీనియర్ స్థాయి వలసలు కొనసాగితే దీర్ఘకాల వృద్ధిపై ప్రభావం పడుతుందని నొమురా పేర్కొంది. 2017-18, 2018-19లపై ప్రభావం పడొచ్చని జేపీ మోర్గాన్ అభిప్రాయపడింది.