కోర్ కేపిటల్: గొంతెమ్మ కోర్కెలకు నో చెప్పిన ఏపీ
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి కోర్ కేపిటల్ నిర్మాణంలో మాస్టర్ డెవలపర్గా ఉండేందుకు సింగపూర్ కంపెనీలు ఏపీ ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోర్కెలు కోరాయి. మూలధనంగా కేవలం రూ. 300 కోట్లు పెట్టుబడి పెట్టి, కోర్ కేపిటల్ ప్రాంతంలోని నాలుగు వేల ఎకరాలపైనా జనరల్ పవరాఫ్ అటార్నీ కావాలని ప్రతిపాదించాయి.
ఆ తర్వాత ఆ భూమిని వివిధ బ్యాంకుల్లో తనఖా పెట్టి, రుణం తీసుకుని కోర్ కేపిటల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాయని ప్రతిపాదించాయి. అంతేకాదు ఏపీ ప్రభుత్వంలో కలిసి రాజధాని కోర్ కేపిటల్ ప్రాంత అభివృద్ధికి ఒక సంస్ధను ఏర్పాటు చేసిన, సింగపూర్ సొంతంగా స్థాపించే మరో సంస్థ ఆధ్వర్యంలో పనులు చేపడతామని తేల్చి చెప్పింది.
ఇందులో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర ఉందని కూడా తేల్చింది. రాజధాని కోర్ కేపిటల్లో తాము అభివృద్ధి చేసే ప్రాంతంలో 25 కిలోమీటర్ల పరిధిలోపు ఐటీ సంస్థలు, ప్రైవేట్ సంస్థలకు భూమి ఇవ్వడం లాంటి చేయకూడదంటూ షరతు పెట్టింది. అంతేకాదు ఈ ప్రాంతంలో భూములిచ్చిన రైతులకు కేంద్ర రాజధాని ప్రాంతం బయట మాత్రమే అభివృద్ధి చేసిన భూమిని ఇవ్వాలని సూచించాయి.
కోర్ కేపిటల్ ప్రాంత అభివృద్ధికి 25-30 ఏళ్లు పడుతుందని ప్రస్తావించాయి. ఇలా ఇబ్బందికరమైన అంశాలుండటంతో సింగపూర్ కంపెనీల డిమాండ్లు ఏపీ ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించింది. తిరిగి కొత్త ప్రతిపాదనలను తయారు చేసి నమర్పించాలని సూచించింది. వారం, పది రోజుల్లో కొత్త ప్రతిపాదనలతో సింగపూర్ కంపెనీలు రానున్నాయి.
వచ్చే మూడేళ్ల కాలంలో రాజధాని కోర్ కేపిటల్ ప్రాంతంలో ప్రభుత్వ భవనాలు నిర్మాణాలతో పాటు ప్రైవేట్ రంగంలో భారీగా పెట్టుబడులు వచ్చేలా చూడాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వ్యవహారాల్లో పనులను త్వరతిగతిన పూర్తి చేసే సంస్థల కోసం అన్వేషిస్తోంది. ఇందుకు గాను మాస్టర్ డెవలపర్ అవసరం.
దీనికోసం ప్రైవేట్ సంస్థల నుంచి స్విస్ ఛాలెంజ్ విధానంలో ప్రతిపాదనల్ని ఆహ్వానించింది. మొదటి నుంచీ భావించినట్లుగానే సింగపూర్కి చెందిన అసెండాస్, సిన్బ్రిడ్జ్, సెంబ్కార్ప్ సంస్థలు ఒక బృందంగా ఏర్పడి ప్రధాన మాస్టర్ డెవలపర్ కోసం ప్రతిపాదనలు సమర్పించాయి. వీటిపై సీఆర్డీఏ సొంతంగా అధ్యయనం చేసింది.
దీంతో పాటు సీఆర్డీఏ నియమించిన ప్రైజ్ వాటర్హౌస్ కూపర్స్తో సహా మరో రెండు కన్సల్టెన్సీ సంస్థలతోనూ ప్రాథమికంగా ఈ ప్రతిపాదనలను పరిశీలన చేయించింది. వీటిపై ఒక నివేదిక రూపొందించి, ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా కీలకమైన ఉన్నతాధికారులకు ప్రజంటేషన్ ఇచ్చింది.
సింగపూర్ సంస్థలు బృందంగా ఏర్పడి ఇచ్చిన ప్రతిపాదనల్లో కోర్ కేపిటల్ అభివృద్ధికి రూ.300 కోట్ల పెట్టుబడితో మొత్తం భూమి అంతటికీ జీపీఏ కావాలని కోరటం, బ్యాంకులకు తనఖా పెట్టి, రుణం తీసుకుని, భూమిని అభివృద్ధి చేశాక, దానికి ధర నిర్ణయించి విక్రయించుకునే అధికారం కావాలనటంతో ప్రభుత్వం తిరస్కరించింది.
రాజధాని కోర్ కేపిటల్ ప్రాంతంలో 17 కోట్ల చదరపు అడుగుల భవన నిర్మాణాలు రావాలని, రూ.50 వేల కోట్ల పెట్టుబడులు రావాలని ప్రభుత్వం భావిస్తుంటే, దీనిపై సరైన ప్రతిపాదనలను సింగపూర్ కంపెనీలు సిద్ధం చేయలేదని సమాచారం. భూ సమీకరణలో భాగంగా భూములు ఇచ్చిన రైతులకు వారి గ్రామాల పక్కనే అభివృద్ధి చేసిన స్థలం ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది.
మౌలిక వసతులు అభివృద్ధి చేశాక కూడా కనీసం రెండు వేల ఎకరాల స్థలం మిగులుతుంది. ఇంత భూమిని సింగపూర్ కంపెనీలకు అప్పగించటం సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొన్నట్లు తెలుస్తోంది. పైగా అంతర్జాతీయ స్థాయిలో భూమిని అభివృద్ధి చేసినా ఎకరానికి రూ.కోటికి మించి రాదని, దీంతో భూమంతటినీ ఆయా సంస్థలకు అప్పగించలేమని ప్రభుత్వం పేర్కొంది.
ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరిస్తే, అన్నింటీలోనూ ప్రభుత్వానిది ప్రేక్షక పాత్రే అవుతుంది. ఇవన్నీ ఆచరణ సాధ్యమయ్యే అంశాలే కావని ప్రభుత్వం భావించడంతో ఇదే విషయాన్ని సీఆర్డీఏ సింగపూర్ కంపెనీలకు తెలియజేసింది. సింగపూర్ సంస్థలు చేసిన ప్రతిపాదనల్లో కొన్ని తమకు ఆమోదయోగ్యంగా లేవని సీఆర్డీఏ పేర్కొంది.
ఈ ప్రతిపాదనల్లో మార్పులు చేర్పులు చేయాలని సింగపూర్ కంపెనీలకు సూచించామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం అంగీకరించి, తుది నిర్ణయం తీసుకున్నాకే అధికారికంగా ప్రజలకు వెల్లడిస్తామని ఆపై స్విస్ ఛాలెంజ్ విధానంలో ఇంతకన్నా మెరుగైన ప్రతిపాదనల్ని ఆహ్వానిస్తామని పేర్కొంది.