వారసత్వ ఉద్యోగాల సాధనే లక్ష్యం: సమ్మెలోకి సింగరేణి కార్మికులు
వారసత్వ ఉద్యోగ అవకాశాల పునరుద్ధరణ, దీర్ఘ కాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఉదయం నుంచి కార్మికులు సింగరేణి.
హైదరాబాద్: వారసత్వ ఉద్యోగ అవకాశాల పునరుద్ధరణ, దీర్ఘ కాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఉదయం నుంచి కార్మికులు సింగరేణి వ్యాప్తంగా సమ్మె ప్రారంభించారు. ఈ సమ్మె వల్ల భద్రాద్రి - కొత్తగూడెం, అసిఫాబాద్ - కొమ్రంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ - భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో విస్తరించిన సింగరేణి బొగ్గు గనులపై ప్రభావం పడనున్నది.
ఇప్పటికే పలు ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది. సమ్మెను జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, హెచ్ఎంఎస్ తలపెట్టగా విప్లవ కార్మిక సంఘాలు, కులసంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. కార్మికులతో బలవంతంగా పని చేయించేందుకు ప్రయత్నిస్తున్న యాజమాన్యం బొగ్గు గనుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మరోవైపు 19వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మూడురోజుల పాటు అన్ని బొగ్గు గనుల్లో కార్మికులు సమ్మెకు దిగనున్నారు. వారసత్వ ఉద్యోగాలు, వేతన సవరణ, దీర్ఘకాలిక సమస్య లపై గళమెత్తనున్నారు.
మూడేళ్లయినా అమలుకు నోచుకోని హామీ
సింగరేణిలో సీఎం కేసీఆర్ ఆర్బాటంగా ప్రకటించిన వారసత్వ ఉద్యోగాల పథకం అమలు కోరుతూ జాతీయ కార్మిక సంఘాలు పలు మార్లు కార్మికశాఖ రీజనల్ కమిషనర్, సింగరేణి యాజమాన్యంతో చేపట్టిన చర్చలు విఫలమయ్యాయి. ఉద్యోగాలు వస్తాయని ఆశించిన కార్మిక కుటుంబాలు తీవ్ర నిరాశకు గురయ్యాయి. భూపాలపల్లిలో సింగరేణి కార్మికుని బిడ్డ ఉద్యోగం రాదనే బెంగతో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. వారసత్వ ఉద్యోగాల విషయంలో టీబీజీకేఎస్, ప్రభుత్వం, యాజమాన్యం కార్మికుల జీవితాలతో దోబుచులాడుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు.
డిమాండ్లపై చీలిపోయిన కార్మికులు
మరోవైపు పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలోనూ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. వారసత్వ ఉద్యోగాలతో పాటు 9 డిమాండ్లు నెరవేర్చాలంటూ కార్మికులు సమ్మెకు దిగారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ కార్మికులు విధులకు హాజరుకాలేదు. సింగరేణి వ్యాప్తంగా 57,302మంది కార్మికులు ఉండగా ఇందులో కొందరు అనుకూలంగా, మరికొందరు సమ్మెకు వ్యతిరేకంగా ఉన్నారు. మొత్తం సింగరేణిలో 30 భూగర్భ గనులు, 16 ఉపరితల గనులు ఉన్నాయి.
బలవంతంగా విధుల నిర్వహణకు ఒత్తిళ్లు
పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లో 4 ఓపెన్ కాస్టులు, 13 భూగర్బ బొగ్గుగనుల్లో కార్మికులు విధులకు హాజరుకాలేదు. రాత్రి షిప్టు డ్యూటికి హాజరైన కార్మికులతో యాజమాన్యం బలవంతంగా పని చేయించేందుకు యత్నిస్తోంది. అధికారుల ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ గోదావరిఖని వన్ ఇన్ క్లైన్ బొగ్గు వద్ద హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేస్తున్నారు.
కార్మికులను తప్పుదోవ పట్టిస్తుందన్న టీబీజేకేఎస్
సింగరేణిలో గుర్తింపు సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఈ సమ్మెను వ్యతిరేకిస్తోంది. కానీ సమ్మెకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) దూరంగా ఉన్నప్పటికీ కార్మికులు విధులకు హాజరుకాలేదు. యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా సమ్మెకు పిలుపునివ్వడం వెనుక కుట్రకోణం దాగి ఉందని గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ ఆరోపించింది. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ సమ్మెకు పిలుపునివ్వడం పలు అనుమానాలకు తావిస్తున్నదని, సమ్మె వల్ల సమస్య పరిష్కారం కాదని జాతీయ కార్మిక సంఘాలు ఉద్యోగ వారసత్వపు హక్కుపై సమ్మెకు పిలుపునివ్వడం, కార్మికులను తప్పుదోవ పట్టించే విధంగా యాజమాన్యం, ప్రభుత్వంపై ఆరోపణలు చేయడాన్ని టీబీజీకేఎస్ తీవ్రంగా ఖండించింది.
చర్చలు సాగుతున్నాయని యాజమాన్యం దాటవేత ధోరణి
సమ్మెలో పాల్గొనవద్దని కార్మిక సంఘాలకు సింగరేణి యాజమాన్యం పిలుపునిచ్చింది. చర్చలు విఫలం కాలేదని వ్యాఖ్యానించింది. కార్మిక సంఘాల కొత్త ప్రతిపాదనలపై వారం గడువు కోరామని, చర్చల సమయంలో సమ్మె చేయడం చట్టవిరుద్దమని తెలిపింది. సమ్మెకు పిలుపునివ్వటం వెనుక కుట్రకోణం దాగి ఉందని టీబీజీకేఎస్, కార్మికులు ఆరోపిస్తున్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో కార్మిక సంఘాలకు, యాజమాన్యానికి మధ్య జరిగిన చర్చలు విఫలం కాలేదని, ఈ నెల 23వ తేదీకి వాయిదా పడ్డాయని తెలిపింది. కార్మికులెవరూ సమ్మెలో పాల్గొనవద్దని సింగరేణి డైరెక్టర్ జే పవిత్రన్కుమార్ పిలుపునిచ్చారు.