90లో 75 మంది కోటీశ్వరులే! చీరలు పంపిన స్మృతి
న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. 75 స్థానాల్లో విజేతలుగా నిలిచిన వారు కోటీశ్వరులను స్వచ్ఛంద సంస్థ 'ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం' రూపొందించిన నివేదిక వెల్లడించింది. బీజేపీకి చెందిన 47 మంది ఎమ్మెల్యేల్లో 40 మందికి రూ.1 కోటికి పైగానే ఆస్తులున్నాయి.
అదే సమయంలో ఆ పార్టీకి చెందిన ఎక్కువ మంది నేతలపై పెండింగ్ కేసులు ఉన్నాయట. 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 14 మంది కోటీశ్వరులు ఉన్నారు.
ఐఎన్ఎల్డీకి 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా 13 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు హెచ్జేసీ శాసన సభ్యులు, ఐదుగురు స్వతంత్రులు, బీఎస్పీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే కూడా కోటీశ్వరుల జాబితాలో ఉన్నారు. రూ.106 కోట్లతో ఫరీదాబాద్ నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే విపుల్ గోయల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీకి 16 మంది మహిళలు
మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉండగా.. 16 స్థానాలలో మహిళా అభ్యర్థులు విజయం సాధించారు. అత్యధికంగా 10 మంది మహిళలు బీజేపీ తరఫున గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఐదుగురు గెలిచారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మహిళా అభ్యర్థి గెలిచారు.
బీజేపీకి తిరుగులేని విజయాన్ని అందించిన హర్యానాలో సీఎం పీఠాన్ని అధిష్ఠించేది ఎవరు? 1966లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సుదీర్ఘకాలం చక్రం తిప్పిన జాట్ వర్గం వైపు బీజేపీ మొగ్గు చూపుతుందా? లేక గత 15 ఏళ్లుగా కీలకపదవులకు దూరంగా ఉన్న జాట్యేతరుడికి పట్టం కడుతుందా? హర్యానా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తున్న వారు జాట్యేతరుడికే పగ్గాలు అప్పగించే అవకాశం ఎక్కువని విశ్లేషిస్తున్నారు.
అయితే, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, పార్టీ ఉపాధ్యక్షుడు దినేష్ శర్మను అధిష్ఠానం పరిశీలకులుగా నియమించింది. వీరు మంగళవారం ఎమ్మెల్యేలతో భేటీ అయ్యి, వారి అభిప్రాయాలను తెలుసుకుని అమిత్ షాకు నివేదించనున్నారు. వెనువెంటనే సీఎం అభ్యర్థిని నిర్ణయించి, బుధవారం ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని అధిష్ఠానం భావిస్తోంది.
అయితే, తొలుత రాష్ట్ర నాయకులకు ప్రాధాన్యమిచ్చి, తర్వాత సుష్మాను తెరపైకి తీసుకొస్తారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. జాట్యేతరుడికే అధిష్ఠానం తొలి ప్రాధాన్యమివ్వనున్నట్లు వారు వినిపిస్తున్నారు. పదిహేనుళ్లుగా జాట్లే సీఎంలుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాట్యేతరుడికి సీఎం పీఠాన్ని కట్టబెడితే జాట్యేతరులను సంతృప్తిపర్చవచ్చని బీజేపీ భావిస్తోంది.
సీఎం రేసులో.. మనోహర్లాల్ ఖత్తార్ (మాజీ ఆరెస్సెస్ సభ్యుడు), కెప్టెన్ అభిమన్యు (పార్టీ అధి కార ప్రతినిధి), రాంవిలాస్ శర్మ (బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు), ఓం ప్రకాశ్ ధన్కర్ (పార్టీ కిసాన్సెల్ అధ్యక్షుడు), అనీల్ విజ్ (పార్టీ సీనియర్ ఎమ్మె ల్యే) కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, కృష్ణపాల్, రావ్ ఇందర్జీ పేర్లు వినిపిస్తున్నాయి.
చీరలు పంపిన స్మృతి ఇరానీ
కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ దీపావళి సందర్భంగా అమేథీ ప్రజలకు చీరలను పంపిణీ చేశారు. తన సొంత డబ్బుతో కొనుగోలు చేసిన 12,000 చీరలను ఆమె అమేథీలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మహిళలకు అందించారు. తద్వారా ఎన్నికల్లో ఓడినా అమేథీని మరిచిపోయేది లేదన్నారు. చీరల ప్యాక్ పైన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇరానీ ఫొటో కూడా వుంది.
స్మృతి ఇరానీ సూరత్ నుండి మొత్తం 15,000 చీరలు తెప్పించారని తెలుస్తోంది. ఇప్పటి దాకా 12,000 చీరలు పంచారు. మిగిలిన మూడువేలు కూడా పంచనున్నారని తెలుస్తోంది. తాము పన్నెండువేల చీరలు పంచాలనుకున్నామని స్మృతి ఇరానీ సన్నిహితులు విజయ గుప్త చెప్పారు.