అగ్గిబరాటా స్మృతి: కాంగ్రెస్లో ఎవరైనా సరితూగగలరా?
ఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ బుధవారం, గురువారం లోకసభలో అపర దుర్గలా మారిపోయారు. ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా విపక్షాల దుమ్ము దులిపారు. హైదరాబాదులోని హెచ్సియు, ఢిల్లీలోని జెఎన్యు ఘటనలపై రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
గురువారం స్మృతి ఇరానీ కొంత తగ్గి మాట్లాడినప్పటికీ... బుధవారం మాత్రం అపరదుర్గలా విపక్షాలపై దూకుడు ప్రదర్శించారు. స్మృతి తీరుకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ముగ్ధులయ్యారు. ఇతర రాజకీయ పార్టీ నేతలు కూడా ఆమె ప్రసంగాన్ని అభినందించారు.
జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్లో స్పందిస్తూ... స్మృతి ఇరానీ చేసిన ప్రసంగానికి రాహుల్ గాంధీ కౌంటర్ ఇవ్వాలనుకుంటే ఆయనకు ఉన్న ఒకే ఒక మార్గం.. ఆమెతోనే ప్రసంగాన్ని రాయించుకోవాలని ఎద్దేవా చేశారు.
స్మృతి ఇరానీ ఓ సునామీ అని, ప్రతిపక్ష నేతల్లో చాలామంది ఆమెకు ప్రశ్నలు సంధించారని, కానీ ఆమె సమాధానాలు వినేందుకు ఒక్కరూ అక్కడ లేరని, వారికి నిజం వినే ధైర్యం లేదని నటుడు పరేష్ రావల్ అభిప్రాయపడ్డారు.
స్మృతి అనే అగ్గిబరాటాకు సరితూగేవారు కాంగ్రెస్లో ఉన్నారా అని రాజ్దీప్ సర్దేశాయ్ పేర్కొన్నారు. స్మృతిఇరానీ మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. తద్వారా స్మృతి వాగ్ధాటిని తట్టుకోలేకనే వారు సభను విడిచారని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
హెచ్సియు, జెఎన్యు ఘటనలను విపక్షాలు రాజకీయం చేశాయని బిజెపి ఆరోపిస్తోంది. విశ్వవిద్యాలయాల్లో మతతత్వాన్ని బిజెపి ప్రోత్సహిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే, తీరా స్మృతికి ప్రశ్నలు సంధించిన విపక్షాలు.. సభలో లేకుండా పోవడం చర్చనీయాంశమైంది.
హెచ్సియు, జెఎన్యులలో తీవ్రవాదులకు మద్దతుగా ఉన్న విద్యార్థులకు రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ అండగా నిలబడటాన్ని స్మృతి ఇరానీ దుయ్యబట్టారు. చనిపోయిన పిల్లాడు రోహిత్తో రాజకీయం చేస్తున్నారని సభలో ఊగిపోయారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు.
రోహిత్ మృతి నేపథ్యంలో రాహుల్ గాంధీ పది రోజుల వ్యవధిలో రెండుసార్లు హైదరాబాద్ హెచ్సియుకు వెళ్లారని, అదే రాహుల్... తెలంగాణ కోసం 600 మంది చనిపోతే ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. ఇది రాజకీయం కాదా అని ప్రశ్నించారు. అదే సమయంలో తమిళనాడులో ముగ్గురు విద్యార్థినిలు చనిపోతే రాహుల్ ఎందుకు పోలేదని అప్పట్లో చర్చ కూడా జరిగింది.
కాశ్మీర్ మనది కాదంటూ పిల్లలకు పాఠాలు చెప్పడం, దేశాన్ని భ్రష్టు పట్టిస్తామని నినాదాలు చేయడం, మహిషుడి అమరత్వం అంటూ మాట్లాడటం, ఇదేనా మీరు చెబుతున్న భావ ప్రకటనా స్వేచ్ఛ అని స్మృతి ఇరానీ విపక్షాలను నిలదీశారు. తీవ్రవాదులకు మద్దతు పలకడమా అని ప్రశ్నించారు.
వేముల రోహిత్ ఆత్మహత్య గురించి తెలిసి తాను బాధపడ్డానని, అతనిని ఓ విద్యార్థిగానే నేను చెప్పానని, విపక్షాలే దళిత అంటూ రాజకీయం చేసే ప్రయత్నం చేశాయని ఊగిపోయారు. ఈ సందర్భంగా జెఎన్యు, హెచ్సియులలో ఏం జరిగిందో ఆమె చెప్పారు.
మరోవైపు, స్మృతి ఇరానీ స్పీచ్ని విపక్షాలు తప్పుపట్టినవి కూడా ఉన్నాయి. రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో ఆయన వద్దకు పోలీసులను రానివ్వలేదని స్మృతి చెప్పడం తప్పు అని కొందరు చెబుతున్నారు. పోలీసులను రానిచ్చారని అంటున్నారు. స్మృతి ఇరానీ చెప్పిన దాంట్లో కొన్ని తప్పులున్నాయని అంటున్నారు.