శోభాకు బాబు ప్రోత్సాహం: జగన్, చిరు పార్టీల్లో 'కీ'
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి రాయలసీమ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఆమె పార్టీలు మారినప్పటికీ స్థానికంగా మంచి పేరు తెచ్చుకున్నారు. నిత్యం ప్రజలలో ఉండే నాయకురాలిగా పేరు పొందారు. ప్రతి అంశం పైన సూటిగా స్పందించే వారు. శోభా నాగిరెడ్డి 1996లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఈమె తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి మాజీ మంత్రి. సోదరుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా పని చేశారు.
శోభ భర్త భూమా నాగిరెడ్డి ఎంపీగా పని చేశారు. 1997లో భూమా నాగిరెడ్డి లోకసభకు వెళ్లడంతో అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె ఆళ్లగడ్డ నుండి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటి వరకు శోభా నాగిరెడ్డి నాలుగుసార్లు శాసన సభకు గెలిచారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు. శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. శోభా నాగిరెడ్డిది రాజకీయ కుటుంబం. తండ్రి, సోదరుడు, భర్త అందరు రాజకీయాల్లో ఉన్నారు. 1968 నవంబర్ 16న ఆమె జన్మించారు.
ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డితో మాట్లాడేందుకు భయపడే అనుచరులు శోభాతో మాత్రం అభిమానంతో మాట్లాడేవారు. ప్రతి కార్యకర్తలను పేరుపేరును పలకరించేవారు. 1997లో జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి నుండి ఆమె 27,000 మెజార్టీతో గెలిచారు. 1999లోను టిడిపి తరఫున పోటీ చేశారు. 2004లో నంద్యాల లోకసభకు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బాబుతో భూమా నాగిరెడ్డికి విభేదాలు రావడంతో బయటకు వచ్చి పిఆర్పీలో చేరారు. 2009లో పిఆర్పీ నుండి, 2012లో జగన్ పార్టీ తరఫున ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆమె చురుకుదనం చూసి చంద్రబాబు ఆమెను ఆర్టీసి చైర్ పర్సన్గా నియమించారు. తొలి, ఏకైక తొలి చైర్ పర్సన్ శోభా నాగిరెడ్డి.
శోభా నాగిరెడ్డి
ఆళ్లగడ్డ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆమెను నంద్యాల, కర్నూలు ఆసుపత్రుల్లో చేర్పించారు. అనంతరం ఆమెను హైదరాబాదుకు తరలించారు. ఆమె మృతి చెందినట్లు కేర్ ఆసుపత్రి వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు.
శోభా నాగిరెడ్డి
ఆమె గురువారం ఉదయం గం.11.05 నిమిషాలకు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రమాదం సమయంలో ఆమె మెదడుకు గాయాలవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. శ్వాసకు ఇబ్బంది అయింది. అదే సమయంలో పల్స్ రేటు క్రమంగా తగ్గింది. పక్క టెముకలు విరగడంతో తీవ్రంగా గాయపడ్డారు.
శోభా నాగిరెడ్డి
శోభా నాగిరెడ్డి 1996లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. టిడిపి, ప్రజారాజ్యం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలలో కీలక నేతగా ఎదిగారు. అధికార ప్రతినిధిగా పని చేశారు. ఆమె నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఏ పార్టీలో ఉన్నా తన వాణిని బలంగా వినిపించారు.
చంద్రబాబు నాయుడు
శోభా నాగిరెడ్డిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తొలుత ప్రోత్సహించారు. ఆమె చురుకుదనాన్ని చూసి ఆర్టీసి చైర్ పర్సన్గా నియమించారు.
చిరంజీవి
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడంతో ఆమె ఆరేళ్ల క్రితం ఆ పార్టీలో చేరారు. 2009లో జరిగిన ఎన్నికల్లో పిఆర్పీ 18 స్థానాలలో గెలిచింది. అందులో శోభా నాగిరెడ్డి కూడా ఉన్నారు.
వైయస్ జగన్
చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేయడాన్ని ఆమె వ్యతిరేకించారు. చిరు నిర్ణయింతో విభేదించిన శోభా నాగిరెడ్డి.. వైయస్ జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. వైయస్ జగన్ కూడా ఆమెను ప్రోత్సహించారు. పార్టీ అధికార ప్రతినిధిగా పని చేశారు. ఈ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ నుండి బరిలోకి దిగారు. జగన్ జైలులో ఉన్నప్పుడు శోభా నాగిరెడ్డి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు.