సోమేష్ కుమార్ తెలంగాణ కలలు కల్లలే
హైదరాబాద్: 1989 బ్యాచ్ ఐఎఎస్ అధికారి సోమేష్ కుమార్ చాలా మందికి తెలిసే ఉంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరికీ తెలిసి వచ్చారు. జిహెచ్ఎంసి మున్సిపల్ కమిషనర్గా పలు సందర్భాల్లో ఆయన ప్రముఖంగా తెర మీదికి వచ్చారు. ఇంటింటి సర్వే సందర్భంగా, అక్రమ కట్టడాల కూల్చివేత సందర్భంగా ఆయన ప్రధానమైన పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రధానమైన అధికారిగా ముందుకు వచ్చారు. అయితే, ఒక్కసారిగా ఆయన కలలు కల్లలయ్యాయి. ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని వీడక తప్పడం లేదు.
తెలంగాణనలోనే పనిచేయాలనే ఆయన కల ఫలించేలా లేదు. అఖిల భారత సర్వీసు అధికారుల విభజనలో భాగంగా ఆయనను ప్రత్యూష్ సిన్హా కమిటీ ఆంధ్రప్రదేశ్కు కేటాయించింది. అయితే తనను తెలంగాణకు కేటాయించాలని ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఒకే పే బ్యాండ్లో ఉన్న వారితో స్వాపింగ్కు ప్రత్యూష్ సిన్హా కమిటీ అవకాశం కల్పించినప్పటికీ దురదృష్టంకొద్దీ తన బ్యాచ్లో ఉన్నవారెవరితోనూ సోమేశ్కు స్వాపింగ్ కుదరలేదు. దీంతో ఆయన విన్నపాన్ని ప్రత్యూష్ కమిటీ పక్కనపెట్టింది.
అంతకుముందే తనను తెలంగాణలో కొనసాగించాలంటూ ఆయన ‘క్యాట్'ను ఆశ్రయించారు. ప్రత్యూష్ కమిటీ విధి విధానాలు సరిగా లేవని, తాను ఇచ్చిన ఆప్షన్కు భిన్నంగా ఏపీకి కేటాయించారని ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్గా తాను తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో ఏపీకి కేటాయిస్తే తనను ఇబ్బందులకు గురిచేసే ప్రమాదముందంటూ పీఎంవోకు లేఖ రాసినట్లు తెలిసింది. అయినప్పటికీ ఆయన కోరిక నెరవేరలేదు.
సోమేశ్ కుమార్ 2013 అక్టోబర్లో జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన గ్రేటర్ హైదరాబాద్ పాలనపై తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. సమగ్ర కుటుంబ సర్వే పత్రం రూపకల్పనలో సోమేశ్ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్కు వెళ్లిన తర్వాత ఆయన అంతర్రాష్ట్ర డిప్యుటేషన్ కోసం ప్రయత్నించి తెలంగాణ రావడానికి ప్రయత్నిస్తారనే మాట వినిపిస్తోంది.