మానవాకృతిని పోలిన మేకపోతు!?: ఒడిశాలో గొర్రెలపై భయానక దాడులు.. ఏం జరుగుతోంది!
మానవ శరీరాకృతిని పోలిన ఓ మేకపోతే గొర్రెలపై ఈ దాడులకు పాల్పడుతుందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనికి సంబంధించి మానవరూపంలో ఉన్న మేకపోతు ఆకారం ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
భువనేశ్వర్: మునుపెన్నడూ చూడని ఆకారం.. తల తప్ప మిగతా శరీరమంతా మానవ ఆకృతి.. ఏంటా జీవి?.. కటక్ జిల్లా నియాలి ప్రాంతంలో గత కొద్దిరోజులుగా ఇదే ప్రశ్న అక్కడి జనాలను వెంటాడుతోంది. ఏదో వింత ఆకారంలో ఉన్న జీవి ప్రతీరోజు పదుల కొద్ది గొర్రెలను చీల్చి చెండాడుతోంది.
దాని పాదముద్రలు సైతం ఇదో కొత్త జీవి అన్న ఆనవాళ్లను స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆ ఆకారం మానవ ఆకృతి అన్న వాదనను అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఇదంతా సోషల్ మీడియా ప్రచారమే అని చెబుతున్నారు. సీసీటీవి ఫుటేజీలతో నిగ్గు తేలుస్తామంటున్నారు. కాగా, ఇది మానవ చర్య మాత్రం కాదన్న దానికి గొర్రెలు చంపబడుతున్న తీరు ఊతమిస్తోంది.
పశు శాలలో కట్టి ఉంచిన గొర్రెలను అత్యంత భయానక రీతిలో చీల్చి చెండాడి చంపేస్తున్నట్లు వాస్తవ దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఇవేవి తెలియని సామాన్య జనం.. అదృశ్య శక్తులో.. క్షుద్ర ప్రయోగాలో ఈ దుస్థితిని కల్పించాయనే మూఢ నమ్మకంలో ఉన్నారు.
మానవరూపంలో మేకపోతు:
మానవ శరీరాకృతిని పోలిన ఓ మేకపోతే గొర్రెలపై ఈ దాడులకు పాల్పడుతుందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనికి సంబంధించి మానవరూపంలో ఉన్న మేకపోతు ఆకారం ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ విచిత్ర జీవే గొర్రెలను బలి తీసుకుంటోందని పుకార్లు షికారు చేస్తున్నాయి.
నిజం కాదన్న మంత్రి:
గొర్రెలపై దాడికి పాల్పడుతున్నది మానవరూపంలో ఉన్న మేకపోతే అన్నఊహాగానాలను రాష్ట్ర పశు సంవర్దక విభాగం మంత్రి డాక్టర్ దామోదర్ రౌత్ కొట్టిపారేశారు. ఇదంతా దుమ్ములగొండి దాడి అయి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దాడి చోటు చేసుకున్న చోట.. పశుశాల పరిసరాల్లో కొన్ని అంతుచిక్కని పాదముద్రలను గుర్తించారు. దాడులు మాత్రం జంతువులు చేసినవిగానే కనిపిస్తున్నాయి.
గుర్తు తెలియని జంతువు దాడిలో కొన్ని గొర్రెలు మరణిస్తుండగా.. మరికొన్ని స్వల్ప గాయాలతో కనిపిస్తున్నాయి. అయితే అది ఏ జంతువు జరిపిన దాడి అయి ఉంటుందన్న దానికి స్పష్టత లేకుండా పోయింది.
సీసీ కెమెరాలతో నిజాలు:
నియాలి ప్రాంతంలో గొర్రెలపై జరుగుతున్న దాడుల చుట్టూ గూడుకట్టుకున్న అసత్య ప్రచారాలను, అపోహలను తొలగిపోయేలా చేస్తామని అటవీ సంరక్షక విభాగం ప్రధాన అధికారి పీసీసీఎఫ్ శ్రీవాస్తవ తెలిపారు. ఇదే నేపథ్యంలో.. నిజాలను నిగ్గు తేల్చేందుకు గాను దాడులు జరుగుతున్న 5చోట్ల సీసీటీవి కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
భయాందోళన రేకెత్తిస్తోన్న జంతువును బయటకు రప్పించేందుకు బాణసంచా పేల్చి దుమారం రేపుతామన్నారు. ఆ తాకిడికి సదరు గుర్తు తెలియని జంతువు బయటకు వస్తుందోమోనని అభిప్రాయపడుతున్నారు. పరిస్థితులపై నిఘా వేసేందుకు అటవీ సంరక్షణ విభాగం 3ప్రత్యేక స్క్వాడ్ లను నియమించింది. గొర్రెల శాలల్లో రాత్రి పూట లైట్లు వెలిగించేందుకు పశుశాల యజమానులకు ఆదేశాలు జారీ చేశారు.మృత గొర్రెల నమూనాలపై పరిశోధన సంస్థలు పరీక్షలు జరుపుతున్నాయి.
గ్రామస్తుల గాలింపు:
గుర్తు తెలియని జంతువు దాడిలో ఇప్పటిదాకా 150గొర్రెలు మృత్యువాత పడటంతో.. తమ మీద ఎక్కడ విరుచుకుపడుతుందోనని అక్కడి జనం భయాందోళనలో ఉన్నారు. జంతువును గుర్తించేందుకు రాత్రిపూట గస్తీ కాస్తున్నారు. బొనొసాహి గ్రామం ప్రాంతంలో రాత్రంతా చీకటిలో నిఘా వేశారు. దీంతో నియాలి ప్రాంతంలో ఉత్కంఠ పరిస్థితులు కొనసాగుతున్నాయి.