వెంటాడుతున్న అపరిపక్వత: జగన్ను పికె కూడా గట్టెక్కించలేరా?
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అపరిపక్వత ఇంకా వెంటాడుతున్నట్లే కనిపిస్తోంది. దానివల్లనే నంద్యాలలో పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అపజయాన్ని చవి చూడాల్సి వచ్చింది.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అపరిపక్వత ఇంకా వెంటాడుతున్నట్లే కనిపిస్తోంది. దానివల్లనే నంద్యాలలో పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అపజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. నంద్యాలలో శిల్పా అభ్యర్థి అయినప్పటికీ తానే అభ్యర్థిని అన్నట్లుగా ఆయన ప్రచారం సాగించారు.
శిల్పా ఓటమికి జగన్ మాత్రమే బాధ్యుడు తప్ప మరొకరు కాదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు ఆయనను తీవ్రంగా దెబ్బ తీసినట్లు భావించాల్సి వస్తోంది. అలాగే, రోజా దూకుడు కూడా నష్టమే చేసిందని చెప్పాలి.
దూకుడు తప్ప మరోటి పనికి రాదని వైయస్ జగన్ భావిస్తూ ఉండాలి. అందుకే, అనాలోచితంగా వ్యాఖ్యలు చేసే రోజా, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, భూమన కరుణాకరెడ్డి, అంబటి రాంబాబు వంటివారు మాత్రమే జగన్కు అత్యంత ప్రీతిపాత్రులైన నాయకులుగా కనిపిస్తూ ఉండవచ్చు. వారెవరికీ పెద్దగా రాజకీయానుభవం లేదు.
Recommended Video
చంద్రబాబుపై ఇలా వ్యాఖ్యలు....
తన వ్యాఖ్యల ద్వారా నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్ వేడి పుట్టిద్దామని అనుకుని ఉండవచ్చు. కానీ అది ఎదురు తిరిగినట్లే భావించాల్సి ఉంటుంది. నడిరోడ్డు మీద ఉరి తీయాలని ఒక్కసారి, బట్టలూడదీసి కొట్టాలని మరోసారి ఆయన నంద్యాల ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై తెలుగుదేశం నాయకులు, మంత్రులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. వారికి సమాధానం ఇచ్చే పరిస్థితిలో వైయస్సార్ కాంగ్రెసు నాయకులు లేకుండా పోయారు. చివరకు, ఆవేశంలో అన్నవే తప్ప అసలు ఉద్దేశం అది కాదని జగన్ ఎన్నికల కమిషన్కు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
భూమా నాగిరెడ్డి సానుభూతి....
భూమా నాగిరెడ్డి పార్టీ మారడం వల్ల తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న భూమా కుటుంబ సభ్యులపై పోటీ పెడితే నెగ్గుకుని వస్తామని జగన్ భావించి ఉంటారు. తల్లినీ, తండ్రినీ కొల్పోయిన అఖిల ప్రియపై ప్రజల్లో సానుభూతి దాని మీద పైచేయి సాధించిందని భావించాల్సి ఉంటుంది. నంద్యాలలో పోటీ చేస్తున్నది తానే అన్నట్లుగా భూమా అఖిలప్రియ ప్రచారం సాగిస్తూ వచ్చారు. జగన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా వాటికి ధీటైన జవాబు ఇచ్చారే తప్ప ఎక్కడా రెచ్చిపోలేదు. అందువల్ల జగన్ పాచిక పారలేదు.
దానికితోడు....
జగన్కు అత్యంత సన్నిహితులైనవారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడుతూ వచ్చారు. వారిలో సీనియర్ నాయకులు, రాజకీయంలో తలలు పండినవాళ్లు ఉన్నారు. పైగా, భూమా నాగిరెడ్డి కుటుంబం కూడా జగన్కు అత్యంత సన్నిహితమైంది. వీరంతా జగన్కు ఎందుకు దూరం జరిగారనే విషయాన్ని ఆలోచించాల్సి ఉంటుంది. ప్రలోభపెట్టి వారిని చంద్రబాబు టిడిపిలోకి లాక్కున్నారనే జగన్ పార్టీ వాదన నిలిచినట్లు లేదు. ఆ సీనియర్ నాయకులు జగన్ వ్యక్తిత్వాన్ని, పనితీరును విశ్లేషించి చెబుతూ వచ్చారు. తమకు అక్కడ ఏ మాత్రం ప్రాధాన్యం లేదని, జగన్ ఇదే తరహాలో పనిచేస్తే నెగ్గుకురావడం కష్టమని వారు నెత్తీనోరూ పెట్టుకుని మొత్తుకున్నారు. కానీ, అవేవీ జగన్కు పట్టినట్లు లేవు. పార్టీని వీడిన సీనియర్లు చేసిన వాదనలకే బలం చేకూరినట్లు భావించాలి.
సాంకేతికంగా కాకపోవచ్చు....
తెలుగు మీడియాలో ఓ వర్గం చంద్రబాబును భుజాన మోస్తున్న విషయం ఎవరూ కాదనలేరు. ఆ విషయం ప్రజలకు కూడా స్పష్టంగా తెలుసు. కానీ, తనకు చంద్రబాబుకు ఉన్నట్లు పత్రిక, చానెల్ లేవని జగన్ చేసిన ప్రకటనను ప్రజలు నమ్ముతారా అంటే నమ్మబోరనే చెప్పాలి. సాంకేతికంగా అవి తన పేరు మీద లేకపోవచ్చు. కానీ, సాక్షి మీడియా జగన్కు చెందిందనే విషయం ఎల్ల లోకం కోడై కూస్తుంది. జగన్ చేసిన అసందర్భమైన, పనికిమాలిన వ్యాఖ్యల్లో ఇదొక్కటి మాత్రమే.
మోడీకి లొంగిపోయారని....
కేసుల నుంచి బయటపడడానికి జగన్ ప్రధాని మోడీకి లొంగిపోయారని తెలుగుదేశం పార్టీ నాయకులు పదే పదే వ్యాఖ్యానిస్తూ వచ్చారు. అది నిజమని కూడా అనిపించకపోదు. మోడీకి లొంగిపోవడం వల్లనే ప్రత్యేక హోదా అంశాన్ని ఆయన పక్కన పెట్టారనే అభిప్రాయం బలంగా ప్రజల్లో నాటుకుపోయింది. అది కూడా కేసుల నుంచి బయటపడడానికి మాత్రమేనని ప్రజలు నమ్మారని చెప్పక తప్పదు. దాంతో కేంద్రంపై జగన్ పోరాటం చేయలేరని ప్రజలు అనుకుని ఉండవచ్చు.
చంద్రబాబుపై అసంతృప్తి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై అసంతృప్తి ఉంది గానీ జగన్కు మంచి పేరు లేదని ఓ రాయలసీమ రాజకీయ నేత వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై పేరుకుపోయిన అసంతృప్తి జగన్కు కలిసి రావడం లేదని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఉండకపోదనే అభిప్రాయం వ్యక్తమవుతూ వస్తోంది. దానికితోడు, చంద్రబాబు చాలా సంయమనంతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ తీవ్రమైన వ్యాఖ్యలకు ఆయన స్పందించిన తీరు ప్రశంసలు పొందింది. జగన్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ తనపై చేసిన వ్యాఖ్యలకు ఆయన రెచ్చిపోలేదు.
బలమూ బలగమూ....
నంద్యాల ఉప ఎన్నికను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాంతో బలాన్నీ బలగాన్నీ ఆయన అక్కడే మోహరించారు. 60 మంది ఎమ్మెల్యేలను నంద్యాల నియోజకవర్గంలో దించారు. ఆరుగురు మంత్రులు పూర్తి స్థాయిలో ఎన్నికల్లో పనిచేశారు. మిగతా వారు నంద్యాలకు వస్తూ వెళ్లిపోతూ నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి విజయానికి కృషి చేశారు. దీని ముందు జగన్ బలమూ బలగమూ సరిపోలేదు.
వేణూ మాధవ్కు బెదిరింపు వ్యవహారం....
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో నటుడు వేణు మాధవ్ జగన్పై రెచ్చిపోయి అతిగా వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆ తర్వాత పరిణామం జగన్కు వ్యతిరేకంగానే పనిచేశారు. తనను జగన్ వర్గంవాళ్లు బెదిరిస్తున్నారంటూ వేణు మాధవ్ ఫిర్యాదు చేశారు. దీన్ని జగన్ పార్టీవాళ్లు తిప్పికొట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. జగన్ వ్యక్తిత్వం తెలిసిన వారంతా వేణుమాధవ్ మాటలనే నమ్మారని అనుకోవచ్చు.
శిల్పా మోహన్ రెడ్డి....
శిల్పా మోహన్ రెడ్డి పదవి కోసమే పార్టీ మారారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయంది. తెలుగుదేశం పార్టీని వీడి ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరి, నంద్యాలలో పోటీ చేశారు. ఆయన బలగం కన్నా ఆయన పదవి కోసమే పార్టీ ఫిరాయించారనే అభిప్రాయం బలంగా నాటుకుపోయిందని చెప్పవచ్చు.
ప్రశాంత్ కిశోర్ కూడా ఏమీ చేయలేరా....
వచ్చే ఎన్నికల కోసం జగన్ తన వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ను తెచ్చి పెట్టుకున్నారు. కానీ, జగన్ వ్యవహార శైలి, ఇతరుల మాట వినని తత్వం వంటివాటి వల్ల ఆయన కూడా ఏమీ చేయలేరనే మాట వినిపిస్తోంది. జగన్ శైలి నచ్చక ఆయన వెళ్లిపోయినట్లుగా తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. అందులో ఏ మేరకు నిజం ఉందో తెలియదు.