వర్షానికి భాగ్యనగరం విలవిల: చెరువుల్లా కాలనీలు, టెక్కీలకు అదో నరకం(ఫోటోలు)
చాలాచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, బయటకు వెళ్లాలంటే మోకాలి లోతు నీళ్లు ఉండటంతో.. చాలామంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
హైదరాబాద్: క్యుములో నింబస్ ప్రభావంతో రాజధానిలో కురిసిన భారీ వర్షం నగర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి మురుగు నీరు చేరడంతో వారి ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి.
కమ్మేసిన మబ్బులు: భాగ్యనగరంలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాల్లో పోటెత్తిన వరద!
Recommended Video
చాలాచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, బయటకు వెళ్లాలంటే మోకాలి లోతు నీళ్లు ఉండటంతో.. చాలామంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక ఆఫీసులకు వెళ్లినవారు ఇంటికి వచ్చే సమయంలో పడరాని పాట్లు పడ్డారు. వర్షానికి తోడు ట్రాఫిక్ జామ్ తోడవడంతో వారికి నరకం కనిపించింది.
వర్క్ ఫ్రమ్ హోమ్:
బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షం ఐటీ ప్రొఫెషనల్స్ ను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. వర్షం ప్రభావంతో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ వైపే మొగ్గుచూపారు. కొన్ని సంస్థలు మాత్రం అందుకు ఒప్పుకోకపోవడంతో.. ఆఫీసుకు బయలుదేరిన ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయారు.
ఉదయం 8గం.కు ఇంటి నుంచి బయలుదేరినవాళ్లు 11గం.కు గానీ ఆఫీసులకు చేరుకోలేకపోయారు. మియాపూర్-హైటెక్ సిటీ మార్గంలో రోడ్లన్ని జామ్ అయిపోవడంతో.. 8కి.మీ ప్రయాణానికే మూడు గంటల సమయం పట్టింది. దీంతో ఉద్యోగులు ప్రత్యక్ష నరకం అనుభవించారు.
నో ట్రాన్స్ పోర్ట్:
భారీ వర్షానికి వాహనాలేవి రోడ్ల పైకి రాకపోవడంతో ఇద్దరు ఐటీ ఉద్యోగులు హైటెక్ సిటీ నుంచి మియాపూర్ వరకు 10కి.మీ నడుచుకుంటూనే వెళ్లారు. ఎం.దీపక్ అనే ఐటీ ఉద్యోగి మాట్లాడుతూ.. 'నాకు తెలుసు వర్షం భారీగా కురుస్తుందని, ట్రాఫిక్ లో చిక్కుకుపోతానని అనుకున్నాను. నా భార్యకు ఫోన్ చేసి బయట పరిస్థితి గురించి అడిగాను. రాత్రి 9గం. వరకు ఆఫీసు వద్దే ఉండిపొమ్మని సలహా ఇచ్చింది' అని చెప్పాడు.
భార్య సలహాతో చాలాసేపు ఆఫీసులోనే ఆగిపోయానని, ఆ తర్వాత కారును ఆఫీసులోనే వదిలి నడుచుకుంటూనే ఇంటికి బయలుదేరానని దీపక్ చెప్పాడు. రోడ్డుపై ఒక్క వాహనం కూడా కనిపించలేదని, 6కి.మీ నడుచుకుంటూ వెళ్లాక ఆర్టీవో ఆఫీస్ వద్ద ఒక వాహనం దొరికిందని, దాంతో ఇంటికి చేరుకోగలిగానని చెప్పుకొచ్చాడు. అదే మార్గంలో తన భార్య ఇంటికి చేరుకోవడానికి రెండు గంటల సమయం పట్టిందన్నాడు.
చుక్కలు కనిపించాయి:
బుధవారం కురిసిన భారీ వర్షానికి తీవ్ర ఇబ్బందులు పడ్డానని అనిక్ దత్తా అనే నల్లగండ్ల నివాసి చెప్పాడు. వృత్తి రీత్యా తాను ప్రతీరోజు నల్లగండ్ల నుంచి హైటెక్ సిటీ వెళ్తుంటానని, భారీ వర్షం వల్ల తన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిందని తెలిపాడు. బుధవారం రాత్రి ఇంటికి చేరుకోవడానికి రెండు గంటలకు పైనే పట్టిందన్నాడు. గురువారం ఉదయం కూడా ఆఫీసుకు చేరుకోవడానికి గంటకు పైనే పట్టిందన్నాడు. రోడ్డు పొడవునా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయిందని, వీధి లైట్లు సరిగా పనిచేయక చాలామంది ఇబ్బందులు పడ్డారని అన్నాడు.
జాతీయ విపత్తు ప్రతిస్పందన సంస్థ:
భారీ వర్షానికి మల్కాజ్ గిరి ఆనంద్ బాగ్ పరిధిలోని బండచెరువు పొంగిపొర్లింది. దీంతో సమీప ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇలాంటి స్థితిలో ఓ గర్భిణీకి నొప్పులు రావడంతో.. జాతీయ విపత్తు ప్రతిస్పందన సంస్థ(ఎన్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగింది. బోటు సహాయంతో గర్భిణీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు ఇన్ స్పెక్టర్ ఆర్పీ చౌదరి తెలిపారు. బండచెరువు పొంగిపొర్లడంతో సుమారు 600కుటుంబాలు వరదల్లోనే చిక్కుకుపోయాయి. దీనికి తోడు డ్రైనేజీలు కూడా పొంగిపొర్లడంతో 8అడుగుల మేర వరద నీరు వచ్చి చేరింది.
సెల్లార్ లలోకి వరద నీరు:
అనంత్ సరస్వతీనగర్ లో ఉన్న 10అపార్ట్ మెంట్లను వరదనీరు ముంచెత్తింది. సెల్లార్లు పూర్తిగా జలమయం అయిపోవడంతో మోటార్ పంపుతో నీటిని ఎత్తిపోయాల్సి వచ్చిందని స్థానిక కాలనీ జనరల్ సెక్రటరీ రమేష్ తెలిపారు. స్థానికంగా ఉన్న రిషి ఆసుపత్రిలోకి కూడా వరద నీరు చేరడంతో.. వైద్య పరికరాలతో పాటు పేషెంట్లు కూడా తడిసి ముద్దయ్యారు.
పోటెత్తిన వరద:
సాయంత్రం 4గం. నుంచి కాలనీలోకి వరద నీరు రావడం మొదలైందని సరస్వతి నగర్ స్థానికురాలు కరుణ తెలిపారు. లాలాపేట్ ప్రాంతంలోని చంద్రబాబు కాలనీ పూర్తిగా జలమయం కావడంతో.. అక్కడి సుమారు 400 కుటుంబాలను స్థానిక ఫంక్షన్ హాల్ లోని పునరావాస కేంద్రానికి తరలించారు.
నిద్ర లేని రాత్రి:
లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు నిద్ర కరువైంది. వరద నీరు ఇళల్లోకి చేరడం, పూర్తిగా అంధకారంలో ఉండిపోవడంతో చాలామంది నిద్రలేని రాత్రి గడిపారు. ఎల్బీ నగర్ సమీపంలో ఓ బస్సు రోడ్డు పైనే నిలిచిపోవడంతో క్రేను సహాయంతో దాన్ని అక్కడి నుంచి తరలించారు. బస్సు మధ్యలోనే నిలిచిపోవడంతో ఐదుగురు ప్రయాణికులు గంట పాటు అందులోనే చిక్కుకుపోయారు.