బెంగళూరులో చావుదెబ్బలు: ఎవరీ మధుసూదన్ రెడ్డి?
అనంతపురం: కర్ణాటక రాజధాని బెంగళూరులో రియల్ దందాలో చేతులో పెట్టి అపహరణకు గురై బడా గ్యాంగ్స్లర్ల చేతిలో చావుదెబ్బలు తిన్న మధుసూదన్రెడ్డి విషయంపై ఇప్పుడు వేడివేడిగా చర్చ సాగుతోంది. ఎవరీ మధుసూదన్రెడ్డి ఆసక్తి నెలకొంది. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం యర్లంపల్లి గ్రామానికి చెందిన మధుసూదన్రెడ్డి మద్దెలచెరువు సూరి అనుచరుడు.
హైదరాబాదులో సాఫ్ట్వేర్ కంపెనీ ముసుగులో సూరి తరఫున భూ దందాలు, సెటిల్మెంట్లు చేసేవాడు. సూరి ముఖ్య అనుచరుడు భానుకిరణ్తో కలిసి మధుసూదన్రెడ్డి పలు సెటిల్మెంట్లలో పాల్గొన్నట్లు సమాచారం. వీరిద్దరితో సూరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటకలోని బెంగళూరు తదితర ప్రాంతాల్లో భూ దందాలు, సెటిల్మెంట్లు చేయించినట్లు చెబుతారు.
మద్దెలచెర్వు సూరి అనుచరుడ్ని బట్టలిప్పేసి చితకబాదిన హెబెట్టు మంజు గ్యాంగ్
హైదరాబాదులో సూరి హత్య జరిగినపుడు కారులో భానుకిరణ్తో పాటు మధుసూదన్రెడ్డి కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. అయితే భాను కావాలనే మధును తప్పించినట్లు తెలుస్తోంది. సూరి హత్య అనంతరం కొద్దిరోజులు అజ్ఞాతంలో ఉన్న భానుకిరణ్ ఇక్కడి వ్యవహారాలను మధుసూదన్రెడ్డి ద్వారా చక్కబెట్టినట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల సమయంలో మధుసూదన్రెడ్డి టిడిపిలో చేరాడు. తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొన్నాడు. అనంతరం బెంగళూరుకు మకాం మార్చి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. రెడ్డప్పరెడ్డి అనే వ్యక్తితో కలిసి పేకాటక్లబ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో భూ దందాలు, సెటిల్మెంట్లు చేస్తూ ఇటీవల ఓ వ్యాపారికి చెందిన దాదాపు రూ.50 కోట్ల విలువైన భూ వివాదంలో తలదూర్చాడని వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో బెంగళూరులోని బడా గ్యాంగ్ స్టర్ బెట్టు మంజు (మంజునాథ) అనుచరులను బెదిరించడంతో ఆగ్రహించిన బెట్టు మంజు, అతని అనుచరులు మధుసూదన్రెడ్డిని గురువారం ఉదయం కిడ్నాప్ చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే, ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని బెట్టు మంజు అంటున్నాడు.
గ్యాంగ్ సభ్యులు మధును ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దుస్తులు ఊడదీసి విచక్షణారహితంగా కర్రలతో చావబాదారు. నోటి నుంచి రక్తం వచ్చేలా కొట్టారు. ఇకపై మీ జోలికి రాను అని వేడుకున్నా వదలకుండా, మా జోలికి వస్తావా అంటూ చావబాదారు. ఈ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి ఫేస్బుక్, వాట్సాప్లో పెట్టారు. ఈ క్లిప్పింగ్లు ఉదయం నుంచి సోషల్మీడియాలో హల్చల్ సృష్టించాయి.
వీటిపై ఆరా తీసిన అనంతపురం జిల్లా పోలీసులు బెంగళూరు చేరుకుని మధుసూదన్రెడ్డిని చితకబాదిన ప్రదేశం, అతన్ని ఎక్కడ దాచారన్న దానిపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.