తిరుగులేదు: నల్లగొండలోను గులాబీదే హవా!, ఎవరి బలమెంతో సర్వే తేల్చింది?
సర్వే ఫలితాలను గమనిస్తే దాదాపుగా టీఆర్ఎస్ కు తిరుగులేదనే విషయం స్పష్టమవుతోంది.
నల్గొండ: వారసత్వ ఉద్యోగాల కల్పనలో విఫలమవడంతో టీబీజీకేఎస్ కు సింగరేణిలో ఎదురుదెబ్బ ఖాయమని చాలామందే భావించారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ బొగ్గు గని కార్మికులు గులాబీకే పట్టం కట్టారు.
సింగరేణి ఎన్నికల తర్వాత ఇప్పుడు చర్చంతా నల్లగొండ మీదకు మళ్లింది. కాంగ్రెస్ నుంచి గులాబీ గూటిలో వాలిపోయిన గుత్తాతో కేసీఆర్ రాజీనామా చేయించి ఉపఎన్నికకు దిగుతారా?.. లేక సింగరేణి ఎన్నికల్లో సత్తా చాటాము కాబట్టి మరోసారి పరీక్షకు నిలబడాల్సిన అవసరం లేదని భావిస్తారా? అన్న చర్చ జరుగుతోంది.
సరే, కేసీఆర్ ఉపఎన్నికకు సిద్దమా? కాదా? అన్న సంగతి పక్కనపెడితే.. నల్లగొండలో క్షేత్ర స్థాయిలో జనం ఏమనుకుంటున్నారన్నది కీలకంగా మారింది. తాజాగా ఆంధ్రజ్యోతి ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే ఆ వివరాలను బయటపెట్టింది.
టీఆర్ఎస్కు తిరుగులేదు:
సర్వే ఫలితాలను గమనిస్తే దాదాపుగా టీఆర్ఎస్ కు తిరుగులేదనే విషయం స్పష్టమవుతోంది. ఒకటి, అరా నియోజకవర్గాల్లో తప్పితే జిల్లాలో టీఆర్ఎస్ గట్టి పట్టునే సంపాదించుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కంటే టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించే పరిస్థితులు నెలకొన్నాయంటే అధికార పార్టీ హవా ఏంటో అర్థం చేసుకోవచ్చు.
లక్ష ఓట్ల మెజారిటీ అంచనా:
ఉపఎన్నికను ఇంకా అధికారికంగా ప్రకటించకముందే టీఆర్ఎస్-కాంగ్రెస్ ల మధ్య దాదాపు 7శాతం వ్యత్యాసం ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది. ఇంతకుముందు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో.. ఎన్నికల సమయంలో అధికార పార్టీగా మరో 5శాతం అదనపు వెసులుబాటు ఉంటుందని కూడా సర్వే అంచనా వేసింది. ఈ లెక్కన మొత్తం 12శాతం ఓట్లతో.. అంటే, లక్ష ఓట్ల మెజారిటీతో గులాబీ పార్టీ తన సత్తా చాటే అవకాశం ఉందని పేర్కొంది.
ఆ రెండు నియోజకవర్గాల్లో తప్ప:
కేసీఆర్ సర్కార్ పాలన పట్ల నల్లగొండ జిల్లా ప్రజలు చాలావరకు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వే తెలిపింది. అయితే దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో మాత్రం కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పుకొచ్చింది. ఇక జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ గట్టి పట్టు సంపాదించుకున్నప్పటికీ.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్ నగర్, నల్లగొండ నియోజకవర్గాల్లో పార్టీకి ప్రతికూల పరిస్థితులే ఉన్నాయని పేర్కొంది.
ఏ పార్టీ బలమెంత?:
ఇప్పటికిప్పుడు ఉపఎన్నిక జరిగితే ఏ పార్టీకి ఎన్ని ఓట్ల వస్తాయనే దానిని సర్వే లెక్క తేల్చింది. ఇందులో 46.36 శాతం మంది టీఆర్ఎస్ కు ఓటు వేస్తామని చెప్పగా, కాంగ్రెస్ కు ఓటేస్తామని 39.82శాతం, టీడీపీ-బీజేపీ కూటమిని గెలిపించుకుంటామని 7.24శాతం, ఎటూ తేల్చుకోలేదని 3.63శాతం మంది సర్వేలో స్పష్టం చేశారట.
నియోజకవర్గాల వారీగా:
నియోజకవర్గాలవారీగా కాంగ్రెస్-టీఆర్ఎస్ బలాబలాలను విశ్లేషించుకుంటే.. దేవరకొండ నియోజకవర్గంలో అధికార పార్టీకి అత్యధిక మద్దతు వ్యక్తమవుతోంది. జిల్లాలో 52.17 %మంది టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. దీంతో కాంగ్రెస్-టీఆర్ఎస్ ల మధ్య ఈ నియోజకవర్గంలో 16శాతం వ్యత్యాసం ఉంది.
ఇక నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో 48.78% మంది కాంగ్రెస్ వైపే నిలిచారు. ఈ రెండు నియోజకవర్గాల్లో రెండు పార్టీల మధ్య తేడా 10శాతం వరకు ఉంది
ఇక ఉత్తమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పట్టు గట్టిగానే ఉన్నప్పటికీ.. రెండు పార్టీల మధ్య వ్యత్యాసం కేవలం 3శాతం మాత్రమే కావడం గమనార్హం. ఇక సూర్యాపేటలో 14.65%, కోదాడలో 12.46%, మిర్యాలగూడలో 8.11, నాగార్జున సాగర్లో 7.41% ఉండడం విశేషం.
అభ్యర్థులుగా ఎవరంటే?:
నల్గొండ లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డిని, కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ప్రస్తావిస్తూ ఆర్జీ ఫ్లాష్ టీమ్-ఆంధ్రజ్యోతి ఈ సర్వే చేయడం గమనార్హం. సర్వేలో చిన్నపరెడ్డికి 47.21% మంది జైకొడితే, రాజగోపాల్ రెడ్డికి 40.89% మంది ఓటేశారు.
నల్లగొండ, హుజూర్ నగర్ లలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హవా ఉందని, మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో మాత్రం చిన్నపరెడ్డి దూసుకుపోయారని సర్వే తెలిపింది.
నిజానికి ఇక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి సిట్టింగ్ అయినప్పటికీ.. కేసీఆర్ మరొకరితో పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన్ను ప్రభుత్వ సేవల కోసం వినియోగించుకుని, ఆ స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, నల్గొండ లోక్సభ నియోజకవర్గం పరిధిలో రెండున్నర లక్షల మంది ఎస్టీ జనాభా ఉండటంతో బాలూ నాయక్ను రంగంలోకి దించాలని టీఆర్ఎస్ యోచిస్తునట్లు సమాచారం. అదే జరిగితే ఈ అంచనాల్లో మార్పులు ఉండవచ్చునని సర్వే ప్రతినిధులు చెబుతున్నారు.