సూర్యాపేట కాల్పులు: యుపి గ్యాంగా, మవోలా? (పిక్చర్స్)
నల్లగొండ: నల్లగొండ జిల్లా సూర్యాపేటలో జరిగిన కాల్పుల ఘటనలో మావోయిస్టుల పాత్ర కూడా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ మాత్రం ఆ కోణాన్ని తోసిపుచ్చుతున్నారు. మావోయిస్లుల పాత్ర లేదని ఆయన కచ్చితంగానే చెబుతున్నారు.
సంఘటనా స్థలంలో కొన్ని కాట్రడ్జెస్ దొరికాయని, వాటిని వాడే ఆయుధాలు బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో తయారవుతాయని ఆయన చెప్పారు. ఎస్పీ ప్రభాకర్ రావు మాత్రం యుపికి చెందిన మీరట్ గ్యాంగ్ ఈ కాల్పులకు పాల్పడిందని స్పష్టం చేస్తున్నారు.
సిఐ మొగిలయ్య చేతిలో అరెస్టయి, బెయిల్ మీద విడుదలైన ఇర్ఫాన్ పనిగా హోం మంత్రి నాయని నర్సింహారెడ్డి సూర్యాపేట కాల్పులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద, సూర్యాపేట కాల్పుల ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
తనిఖీలు చేస్తుండగా..
బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత పోలీసులు తనిఖీలు చేస్తుండగా సూర్యాపేట బస్టాండ్లో దిగిన ఇద్దరు ప్రయాణికుల్లో అతను అకస్మాత్తుగా పోలీసులపైకి కాల్పులు జరిపాడు.
వెంటనే పారిపోయారు...
ప్రయాణికుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, సిఐ మొగలియ్య, హోం గార్డ్ కిశోర్ గాయపడ్డారు. ఆ వెంటనే ఇద్దరు కూడా పారిపోయారు.
కారు కోసం కాల్పులు..
కాల్పులు జరిపిన తర్వాత పారిపోవడానికి ప్రయత్నించిన దుండగులు అటు నుంచి వెళ్తున్న కారును ఆపడానికి ప్రయత్నించారు. కారుపైకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దొరబాబు అనే వ్యక్తి గాయపడ్డారు.
తేరుకునే లోగానే...
బస్సు నుంచి దిగిన దుండగులు పోలీసులు తేరుకునేలోగానే సెకన్ల వ్యవధిలోనే అతి సమీపం నుంచి కాల్పులు జరిపి పారిపోయారు. వారిపైకి ఎదురు కాల్పులు జరపడానికి కూడా పోలీసులకు సమయం చిక్కలేదు.
ఓటరు కార్డు లభ్యం
ఘటనా స్థలంలో పోలీసులు ఒడిశాకు చెందిన ఓటరు ఐడి కార్డు దొరికింది. అయితే, నకిలీదని తేలింది. కేసు దర్యాప్తును తప్పు దోవ పట్టించడానికే దాన్ని వదిలేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
వివరాలు సేకరిస్తున్న పోలీసులు...
ఘటనా స్థలాన్ని తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తునకు అవసరమయ్యే వివరాలను సేకరిస్తున్నారు.
ఇర్ఫాన్ ముఠాపైనా..
యూపీకి చెందిన ఇర్ఫాన్ ముఠా సభ్యులపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాల క్రితం ఇర్ఫాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యుడు తన్వీర్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.
తన్వీర్ కోసం వేట సాగిస్తుంటే...
తన్వీర్ కోసం వేట సాగుతున్న టైంలోనే పోలీసులపై ఈ కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపి పరారైన దుండగుల కోసం స్పెషల్ టీంలు రంగంలోకి దిగాయి. ఒడిషా, చత్తీస్గఢ్ ముఠాలపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.