సుజాతాసింగ్ ట్విస్ట్: మోడీ-సుష్మమధ్య విదేశీ చిచ్చు!
న్యూఢిల్లీ: విదేశాంగ కార్యదర్శి అంశం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మధ్య చిచ్చు పెట్టినట్లుగా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన ముగిసిన మరుసటి రోజే భారత విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ పైన వేటు పడింది. మరో 8 నెలల పదవీకాలం ఉండగానే ఆమెను తొలగిస్తూ బుధవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఆమె స్థానంలో అమెరికాలో భారత రాయబారి సుబ్రమణ్య జైశంకర్ను నియమించింది. ఈయన మరో రెండు రోజుల్లో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. అయితే, విదేశాంగ కార్యదర్శి హోదాలో ఆయన రెండేళ్లు కొనసాగనున్నారు. జైశంకర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆనవాయితి ప్రకారం ఆయనకు బాధ్యతలు అప్పగించాల్సిన సుజాతా సింగ్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
తన తొలగింపుపై సుజాతా సింగ్ స్పందించారు. తాను ముందుగా ఉద్యోగ విరమణ కోరుకున్నానని, ఆ ప్రకారమే పదవీ బాధ్యతల నుంచి విముక్తి పొందానన్నారు. వ్యవస్థల కన్నా వ్యక్తులు గొప్పవారు కాదన్నారు. జైశంకర్ నియామకం ప్రధాని మోడీ, సుష్మాస్వరాజ్ నడుమ చిచ్చు రేపుతున్నట్లుగా కనిపిస్తోంది. భారతదేశ చరిత్రలో దేశ అత్యున్నత దౌత్యాధికారిపై ప్రభుత్వం వేటు వేయడం ఇది రెండోసారి.
28 ఏళ్ల క్రితం 1987లో అప్పటి విదేశాంగ కార్యదర్శి ఏపీ వెంకటేశ్వరన్ను ప్రధాని రాజీవ్ గాంధీ అవమానకరమైన రీతిలో తొలగించారు. పత్రికలు, ఐఎఫ్ఎస్ అధికారుల సంఘం రాజీవ్ నిర్ణయంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. సుజాతా సింగ్ తొలగింపుపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఐఎఫ్ఎస్ అధికారి దేవయాని కోబ్రాగడే విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరించినందు వల్లే ఆమె పైన ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుందని మాజీ కేంద్ర మంత్రి మనీష్ తివారి ఆరోపించారు. దీనిపై ప్రధాని వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
జైశంకర్ నియామకంపై సుష్మాస్వరాజ్ అసంతృప్తితో ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తనను సంప్రదించకుండానే తన శాఖకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేస్తున్నారట. సుజాతా సింగ్ పని తీరుపై ప్రధాని మోడీ తొలి నుంచీ అసంతృప్తితో ఉన్నారు. కొంతకాలం క్రితమే ఆమెను తొలగించాలని భావించినా సుష్మా వ్యతిరేకించారు.
ఈ కారణంగానే గత ఆరునెలలుగా విదేశాంగ శాఖలో ఎలాంటి కీలక నిర్ణయాలూ పీఎంవో ఆమోదానికి నోచుకోలేదు. కాగా, జైశంకర్ నియామకంపై కినుకు వహించిన సుష్మా గురువారం ఢిల్లీలో రెండు ప్రచార సభల్లో పాల్గొనాల్సి ఉన్నా వాటిని రద్దు చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, తానే సుజాతా సింగ్కు ప్రభుత్వం నిర్ణయాన్ని చెప్పానని సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు.