జగన్కు కేసీఆర్, బాబు షాక్: 50 మంది ఎంపీలు సై అంటేనే...
Recommended Video
హైదరాబాద్: ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం మీద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించ తలపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకూడదని తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నిర్ణయించుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జగహన్మోహన్ రెడ్డి నిర్ణయానికి దూరంగా ఉండాలని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ సోమవారం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించనున్న విషయం తెలిసిందే.
అందుకు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని నిర్ణయించింది. నిజానికి మార్చి 21వ తేదీన అవిశ్వాసం ప్రతిపాదించాలని వైసిపి తొలుత నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నెల 12వ తేదీననే అవిశ్వాసం పెట్టడానికి సిద్ధపడింది.
చంద్రబాబుకు జగన్ విజ్ఞప్తి
తాము ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని జగన్ చంద్రబాబును కోరారు. చంద్రబాబు తన అధ్యక్షతన జరిగిన వ్యూహ కమిటీలో వైసిపి ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానంపై అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు. దానికి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు.
ఏమీ లాభం లేదని...
అవిశ్వాస తీర్మానం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఏమీ కాదని, దానివల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం కూడా ఏమీ లేదని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక హోదాపై ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానం మీద సభలో చర్చకు వచ్చినప్పుడు ఇతర ప్రతిపక్షాలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై చర్చకు ప్రాధాన్యం ఇస్తాయని, దానివల్ల ఎపికి ప్రత్యేక హోదా అనే డిమాండ్ ప్రాధాన్యం తగ్గిపోతుందని చంద్రబాబు భావిస్తున్నారు.
మాకేమీ సంబంధం లేదని టిఆర్ఎస్
అవిశ్వాస తీర్మానంతో తమకేమీ సంబంధం లేదని, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ తన పార్టీ పార్లమెంటు సభ్యులకు సూచించినట్లు సమాచారం. ఎపికి ప్రత్ేక హోదా ఇవ్వాలనే డిమాండుకు మద్దతు ఉంటుంది గానీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వబోమని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. తమ ప్రాధాన్యాలు తమకు ఉన్నాయని, అటువంటప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని బలపరచాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల బలాలు ఇవీ
ఆంధ్రప్రదేశ్ నుంచి లోకసభకు 25 మంది ప్రాతినిధ్యం వహిస్తోంది. వైసిపి ఎనిమిది మది, టిడిపికి 15 మంది, బిజెపికి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. తెలంగాణ నుంచి లోకసభకు 17 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీఆర్ఎస్ 14 మంది ఎంపీలు ఉన్నారు. కాగ్రెసు, టిడిపి నుంచి గెలిచిన ఎంపీలు చేరడంతో టిఆర్ఎస్ బలం పెరిగింది. బిజెపికి, మజ్లీస్కు ఒక్కరేసి ఎంపీలున్నారు.
అవిశ్వాసం సభలో చర్చకు రావాలంటే...
అవిశ్వాసానికి సంబంధించి ఏ ఒక్క సభ్యుడైనా స్పీకర్కు నోటీసు ఇవ్వవచ్చు. దాన్ని స్పీకర్ సభలో చదివి వినిపించి దానికి మద్దతు ఇస్తున్నవారెవరో చెప్పాలని అడుగుతారు. యాభై మంది ఎంపీలు మద్దతు ఇస్తే అవిశ్వాస తీర్మానంపై చర్చకు తేదీని నిర్ణయిస్తారు. సభ అనుమతించిన పది రోజుల లోపల అవిశ్వాసంపై చర్చను చేపట్టాల్సి ఉంటుంది.
అవిశ్వాసం చర్చకు వస్తుందా...
వైసిపి ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందా అనేది సందేహంగానే ఉంది. ప్రతిపాదన దశలోనే అది వీగిపోయే అవకాశమే ఎక్కువగా ఉంది. జగన్ యాభై మంది ఎంపీల మద్దతు కూడగట్టడానికి ప్రత్యేకంగా చేస్తున్న ప్రయత్నాలేవీ లేవు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మెజారిటీ సభ్యులు దానికి మద్దతు ఇవ్వడం లేదు. వైసిపికి తగిన బలం లేదు.