బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంసెట్ లీకేజీ: ఇక్కడ ప్లాన్ చేసి, ఇలా అమలు...

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సంచలనం సృష్టించిన తెలంగాణ ఎంసెట్ లీకేజీ కేసులో తవ్వుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కేసును దర్యాప్తు చేస్తున్న సిఐడి అధికారులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాయి. ఈ కేసులో రెండో నిందితుడైన రాజగోపాల్ రెడ్డి దిగ్భ్రాంతికరమైన విషయాలను విచారణలో సిఐడి అధికారులకు వెల్లడించినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ కర్నాటక భవన్, బెంగళూరు హోటల్ మౌర్యలో ఎంసెట్ - 2 లీకేజీకి పథక రచన చేసినట్లు రాజ్‌గోపాల్‌రెడ్డి సిఐడి అధికారులకు తెలిపాడు. కేసులో ఇక్బాల్ అనే వ్యక్తిని మొదటి ముద్దాయిగా చేర్చారు. అతని సహాయంతో ఎమ్సెట్-2 ప్రశ్నపత్రాన్ని లీక్ చేసినట్లు రాజ్‌గోపాల్‌రెడ్డి వెల్లడించారు. ఈ వాంగ్మూలం నివేదికను నాంపల్లి కోర్టుకు సిఐడి సమర్పించింది.

ఎంసెట్ స్కామ్‌లో పేరెంట్స్ తెలివి: బ్రోకర్లకే దిమ్మతిరిగే షాక్ఎంసెట్ స్కామ్‌లో పేరెంట్స్ తెలివి: బ్రోకర్లకే దిమ్మతిరిగే షాక్

రాజ్‌గోపాల్ వాంగ్మూలం ప్రకారం కర్ణాటకలోని పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మేనేజిమెంట్ కోటా కింద సీట్లను వివిధ రాష్ట్రాల విద్యార్ధులకు రాజ్‌గోపాల్‌రెడ్డి ఇప్పించేవాడు. ఈ క్రమంలోనే రాజ్‌గోపాల్‌ రెడ్డికి హైదరాబాద్‌కు చెందిన విష్ణు, విజయవాడకు చెందిన జ్యోతి బాబు, ఢిల్లీకి చెందిన రాజేష్‌తో పరిచయం ఏర్పడింది. రాజ్‌గోపాల్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడు కర్ణాటక భవన్‌లో ఉండేవాడు. అక్కడ రాజేష్ స్వయంగా లీకేజి ప్రధాన సూత్రధారి ఇక్బాల్‌ను రాజ్‌గోపాల్‌రెడ్డికి పరిచయం చేశాడు.

కర్ణాటకలో రాజగోపాల్, హైదరాబాదులో ఇక్బాల్

ఇక్బాల్ కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మేనేజిమెంట్‌కోటా సీట్లను ఇప్పించేవాడు. ఈ నేపథ్యంలో ఇక్బాల్, రాజగోపాల్‌రెడ్డి, రాజేష్ తరచూ కలుసుకునేవారు. ఈ ముగ్గురు బెంగళూరులోని మెజిస్టిక్ సెంటర్ వద్ద హోటల్ మౌర్యలో జూన్‌లో కలుసుకున్నారు. తాను తెలంగాణ ఎమ్సెట్-2 ప్రశ్నపత్రాన్ని సంపాదించానని, రెండు సెట్లు ఉన్నాయని ఇక్బాల్ వారికి చెప్పాడు.

ఎంసెట్ లీకేజీ: కోల్‌కతాకు తీసుకెళ్లి విద్యార్థులను ప్రిపేర్ చేశారురాజగోపాల్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం - రూ. 25 లక్షలు ఇచ్చే వారికి ఈ సెట్లు ఇస్తాననడంతో రాజ్‌గోపాల్‌రెడ్డి ఈ విషయాన్ని విష్ణు, జ్యోతిబాబుకు చెప్పాడు. కనీసం రూ. 40 నుంచి రూ. 50 లక్షలు ఇచ్చేవారిని ఎంపిక చేయాలని, మంచి కమిషన్ ముట్టచెబుతామని రాజ్‌గోపాల్‌రెడ్డి చెప్పాడు.

మెమోలు తాకట్టు....

ప్రశ్నపత్రం ఇచ్చేముందే ఎస్‌ఎస్‌సి మార్కుల జాబితా, ఇంటర్ మార్కుల మెమోను తమకు స్వాధీనం చేయాలని, ఆశించిన ర్యాంకు వచ్చాక, తమకు సొమ్ము మొత్తం చెల్లించిన తర్వాత మార్కుల మెమోలను తిరిగి ఇచ్చేస్తామని రాజ్‌గోపాల్‌రెడ్డి వారికి చెప్పాడు. దీంతో రంగంలోకి దిగిన విష్ణు, తిరుమలరావు 14 మంది విద్యార్ధులను, ఆరుగురు విద్యార్ధుల తల్లితండ్రులను సంప్రదించి డీల్ కుదుర్చుకున్నారు. వీరు రాజ్‌గోపాల్ చెప్పినట్లుగా జూలై 8వ తేదీ ఉదయం విద్యార్ధులను బెంగళూరుకు తరలించారు. జూలై 9వ తేదీ తెలంగాణ ఎంసెట్ -2 పరీక్ష హైదరాబాద్ తదితర కేంద్రాల్లో జరిగిన విషయం తెలిసిందే.

జూలై 8వ తేదీన మొదటి నిందితుడు ఇక్బాల్ ఎంసెట్ - 2 రెండు సెట్ల ప్రశ్నపత్రాలతో ఢిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చి బన్సవాడి బస్టాప్ వద్ద ఉన్న ఉపహార్ రెస్టారెంట్‌కు విద్యార్ధులను తీసుకురావాలని రాజ్‌గోపాల్‌కు చెప్పాడు. ఈ మేరకు మరో నిందితుడు ఎస్‌ఆర్ పాండు విద్యార్ధులను తీసుకుని ఉపహార్ హోటల్‌కు వెళ్లాడు. వారి వద్ద సర్ట్ఫికెట్లు, బ్లాంక్ చెక్‌లను తీసుకున్నారు.

విద్యార్ధుల తల్లితండ్రులను ఉపహార్ హోటల్‌కు రావద్దనే ఆంక్షలు విధించారు. ఉపహార్ హోటల్‌లో 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రెండు సెట్ల ప్రశ్నపత్రాలను ఇక్బాల్ విద్యార్ధులకు అందించారు. వారు 320 ప్రశ్నలకు ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం కల్పించాడు. అనంతరం విద్యార్ధులను అదే రోజు రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు పంపారు.

Telangana EAMCET leakage: Planned at Karntaka Bhavan and Bengaluru hotel

పూణేలో కూడా...

పూణేలో ప్రశ్నపత్రం లీకేజ్‌కి సంబంధించి కూడా పోలీసులు కీలక వివరాలు రాబట్టారు. ఈ కేసులో నిందితులైన రెసోనెన్స్ ఉద్యోగులు వెంకటరావు, భండారు రవీంద్ర, అరిగె వెంకటరామయ్యలకు హైదరాబాదులోని బోడుప్పల్‌కు చెందిన షేక్ రమేష్ ఎంసెట్ ప్రశ్నపత్రాలు విక్రయింపజూశాడు. సెట్‌కు రూ. 35 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
రమేష్ ద్వారా వీరు హైదరాబాదులోని సోమాజిగూడలోని కన్సల్టెన్సీ ప్రతినిధి రామకృష్ణను సంప్రదించారు. మొత్తానికి రెసోనెన్స్ సెంటర్ ఉద్యోగులు గౌతం రెడ్డి, మణిదీప్, శ్వేత, అనన్య అనే విద్యార్ధుల తల్లితండ్రులకు గాలం వేసి సొమ్ము వసూలు చేసి పూణెకు జూలై 8వ తేదీన తీసుకెళ్లారు.

పూణేలో న్యూ బేకరీ సెంటర్ వద్ద ఒక రహస్య ప్రదేశంలో ఈ నలుగురు విద్యార్ధులకు రెండు సెట్ల ప్రశ్నపత్రాలను కన్సల్టెన్సీ నిర్వాహకుడు రామకృష్ణ అందించారు. అనంతరం 8వ తేదీన విద్యార్ధులను, వారి తల్లితండ్రులను పూణె నుంచి హైదరాబాద్‌కు పంపారు.

ఈ కేసులో కీలక నిందితుడైన ఇక్బాల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఇప్పటి వరకు సిఐడి అధికారులు 8 మందిని అరెస్టు చేశారు. ఇక్బాల్‌తో పాటు మిగతా నిందితులు పట్టుబడితే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

English summary
Iqbal is the main accused in Telangana EAMCET -2 question paper leakage case. rajagopal Redddy and Iqbal planned and implemented for the leakage of EAMCET leakage in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X