కిరణ్ వ్యూహం: టీ నేతల ప్రతివ్యూహం (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ప్రతిపాదించకుండా జాప్యం చేయాలనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహానికి కాంగ్రెసు తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు ప్రతివ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ముసాయిదా బిల్లును వెంటనే శానససభలో ప్రతిపాదించాలని తెలంగాణ మంత్రులు, శాసనభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి, శుక్రవారంనాడే తెలంగాణ ముసాయిదా బిల్లు శాసనసభకు వచ్చేలా చూడాలని తెలంగాణ మంత్రులు ప్రయత్నాలు చేశారు.
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి మహంతికి ఫోన్ చేసి, బిల్లు అసెంబ్లీకి రాకపోవడంపై ఆరా తీశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ముఖ్యమంత్రిపై నమ్మకం పోయిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిపై తెలంగాణ మంత్రులు, శాననసభ్యులు దిగ్విజయ్ సింగ్కు ఫిర్యాదు కూడా చేశారు. ఈ స్థితిలో తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు మంత్రి డికె అరుణ నివాసంలో సమావేశమై ముఖ్యమంత్రి వ్యూహానికి ప్రతివ్యూహాన్ని రచించారు.
మూకుమ్మడి రాజీనామాలు చేయడం ద్వారా కిరణ్ కుమార్ రెడ్డిని చిక్కుల్లోకి నెట్టాలని వారు అనుకుంటున్నారు. సోమవారంనాడు బిల్లు అసెంబ్లీలో ప్రతిపాదించకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవులకే కాకుండా శానససభా సభ్యత్వాలకు కూడా రాజీనామా చేయాలని అనుకున్నట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు రాజీనామాలు చేయడానికి కూడా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని విభజనకు అడ్డుపడుతున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని దించేద్దామని తెలంగాణ ప్రాంత మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మంత్రి డీకే అరుణ నివాసంలో డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, మంత్రులు గీతారెడ్డి, జానారెడ్డి, సుదర్శన్రెడ్డి, శ్రీధర్బాబు, సునీతాలక్ష్మారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డీ శ్రీనివాస్ తదితరులు భేటీ అయ్యారు. ఉద్దేశపూర్వకంగానే కిరణ్ శాసనసభలో ముసాయిదా బిల్లు రాకుండా అడ్డుపడ్డారని రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి నుంచి కిరణ్ను దించేయడమే ఉత్తమమని చెప్పారు.
ముగ్గురు మహిళా మంత్రులు
తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి రాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగానే అడ్డుకుంటారనే ఉద్దేశంతో ఏం చేయాలనే విషయంపై డికె అరుణ నివాసంలో తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముగ్గురు తెలంగాణ మహిళా మంత్రులు ఇలా..
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా..
డికె అరుణ నివాసంలో జరిగిన సమావేశానికి వస్తూ తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా.. కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఈయన ఇప్పుడు తెలంగాణ కోసం వ్యతిరేకించడానికి సిద్ధపడ్డారు.
సమావేశంలో దామోదర..
తెలంగాణ విషయంలో అగ్ర భాగాన నిలుస్తున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సమావేశంలో ఇలా.. డ్రాఫ్ట్ బిల్లును శుక్రవారం అసెంబ్లీకి తెప్పించడానికి ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేశారు.
మీడియాతో డికె అరుణ..
తెలంగాణ ముసాయిదా బిల్లు వెంటనే అసెంబ్లీకి వచ్చేలా చూడాలని మంత్రి డికె అరుణ కోరారు. ఆమె పక్కన మరో మహిలా మంత్రి గీతారెడ్డిని చూడవచ్చు.