దామోదరతో భేటీ: తెర మీదికి హైదరాబాద్ మంత్రులు
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చ జరగకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేయాలని తెలంగాణ కాంగ్రెసు నాయకులు తీర్మానించారు. ముఖ్యమంత్రికి రాజ్యాంగ వ్యవస్థలపై గౌరవం లేదని వారు నిందిస్తున్నారు. రాష్ట్రపతి ఏడువారాల గడువు ఇచ్చినా బిల్లుపై చర్చింకుండా, ఆఖరిలో తమకు సమయం చాల్లేదంటూ గడువు కోరేందుకు ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ స్థితిలో హైదరాబాద్కు చెందిన మంత్రులు తెర మీదికి వచ్చారు.
శుక్రవారం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ నివాసంలో హైదరాబాద్కు చెందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేశ్ గౌడ్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ చర్చలు జరిపారు. తెలంగాణ కార్యకలాపాలకు హైదరాబాద్కు చెందిన మంత్రులు దూరంగా ఉంటూ వస్తున్నారు. అకస్మాత్తుగా వారు ఉప ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణకు సానుకూలంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు అడ్డుపడేందుకు ప్రయత్నిస్తున్నారని దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
నిజానికి, బిల్లుపై సుదీర్ఘంగా చర్చించేందుకు వీలుగా రాష్ట్రపతి ఆరు వారాల గడువు ఇచ్చినా దాన్ని వాడుకునేందుకు ముఖ్యమంత్రి సిద్ధపడడం లేదని ఆయన అన్నారు. అసెంబ్లీ ప్రారంభమై న రోజునే శాసనసభకు ముసాయిదా బిల్లు ప్రతులు వస్తాయని భావించామని, అయితే కావాలనే ఆలస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిల్లును మంగళవారం సభలో ప్రవేశపెట్టినా చర్చ మాత్రం ఇప్పటి వరకూ జరగలేదన్నారు. చర్చ జరగకుండా కిరణ్ అడ్డుపడ్డారని, ఇదే విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్దామని ఆయన హైదరాబాద్ మంత్రులకు వివరించారు. రాష్ట్రపతి 42 రోజుల సమయం ఇస్తే, అసెంబ్లీ లో 13 రోజుల పాటే చర్చించేలా కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహరచన చేశారని ఆయన విమర్శించారు. దాంతో తమకింకా గడువు కావాలని కోరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఈ నెల 23 తర్వాత మళ్లీ గడవు కావాలని కోరితే దాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని రాష్ట్రపతిని కోరాలని రాజనరసింహ చెప్పారు.