తెలంగాణ బిడ్డ: ఢిల్లీలో తొలి మహిళా డ్రైవర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరానికి తొలి మహిళా డ్రైవర్ను అందించిన ఘనత తెలంగాణ రాష్ట్రం దక్కించుకుంది. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన సరిత దేశ రాజధాని ఢిల్లీలో తొలి మహిళా బస్సు డ్రైవర్గా నియమితురాలయ్యారు.
సొంత ఊళ్లో ఆటో, ఓ మినీ బస్సు డ్రైవర్గా పనిచేసిన ఆమె.. ఢిల్లీలో ప్రజారవాణా వ్యవస్థ అయిన డిటిసిలో మహిళా బస్సు డ్రైవర్లు కావాలనే ప్రకటన చూసి దరఖాస్తు చేసుకున్నారు. ఆమెతోపాటు మరో ఏడుగురు దరఖాస్తు చేసినప్పటికీ ఒక్క సరిత మాత్రమే మెడికల్గా ఫిట్గా ఉన్నారని డిటిసి మెడికల్ బోర్డు పరీక్షల్లో తేలింది. దీంతో 28 రోజుల శిక్షణ తరువాత, తొలి మహిళా డ్రైవర్ గా సరోజినినగర్ డిపోలో ఆమె నియమితులయ్యారు.
దీంతో తెలంగాణకు చెందిన ఆడబిడ్డ ఇకనుంచి ఢిల్లీ రోడ్ల మీద డిటిసి బస్సును పరుగులు పెట్టించనున్నారనన్న మాట. నల్గొండ జిల్లాకు చెందిన పేదరైతు కుటుంబంలో పుట్టిన సరితను మగపిల్లలు లేకపోవడంతో తండ్రి ఆమెను అబ్బాయిలా పెంచారు. తన హెయిర్ స్టయిల్, తన డ్రెస్సింగ్ స్టయిల్ అంతా నాన్న చెప్పిందే అంటున్న సరిత, మహిళలు సాధించలేనిది ఏదీ లేదని చెప్పాలన్నదే తన ఉద్దేశ్యమని తెలిపింది.
ఇక్కడ బస్సు నడపటం కత్తిమీద సామే అయినప్పటికీ నల్లొండలో ఆటోను, హైదరాబాద్లో కాలేజీ మినీ బస్సు నడిపిన అనుభవం బాగా ఉపయోగపడుతోందంటున్నారు. డ్రైవింగ్లో సరితకు శిక్షణ ఇచ్చిన పర్వేష్ శర్మ అయితే ఆమె డ్రైవింగ్ స్కిల్స్ చూసి ముచ్చటపడ్డారు. భవిష్యత్తుల్లో చాలా మంచి డ్రైవర్ అవుతుందంటూ కితాబులిచ్చారు.
‘మొదట్లో మహిళలకు ట్రైనింగ్ అంటే కొంచెం భయపడ్డా.. ఢిల్లీలాంటి నగరాల్లో డ్రైవింగ్ వారి వల్ల కానే కాదు అనుకున్నా. కానీ, సరిత చాలా తొందరగా నేర్చుకున్నారు' అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. కాగా, కొత్త రంగాల్లో మహిళలను ప్రోత్సహించడంలో తమ ప్రభుత్వం ముందుంటుందనీ, ఇది ప్రారంభం మాత్రమేనని ఢిల్లీ రవాణా మంత్రి గోపాల్ రాయ్ పేర్కొన్నారు.