ఆంధ్రా సిబ్బందికి తెలంగాణ సత్కారం, ప్రశంసలు
భద్రాచలం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పారిశుధ్య సిబ్బందికి తెలంగాణ సర్కార్ సముచిత సత్కారం చేసింది. గోదావరి మహాపుష్కరాల్లో పారిశుధ్య సేవలందించేందుకు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా నుంచి 450 మంది పారిశుధ్య సిబ్బంది భద్రాచలం వచ్చి.. విశిష్ట సేవలందించారు.
సేవలకు గుర్తింపుగా వీరికి చీరలు, పంచెలు అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆదివారం భద్రాచలంలో పారిశుధ్య సిబ్బందికి ఖమ్మం కలెక్టర్ కె ఇలంబరిది దుస్తుల పంపిణీ నిర్వహించారు.
పుష్కరాల్లో పారిశుధ్య కార్మికులు పోషించిన పాత్ర అభినందనీయమని కలెక్టర్ కె ఇలంబరిది పేర్కొన్నారు. ఎటువంటి విమర్శలు రాకుండా పుష్కరాల సందర్భంలో పారిశుధ్య కార్మికులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారన్నారు.
రాజమండ్రి నుంచి వచ్చి ఇక్కడ పారిశుధ్యం పట్ల చూపిన శ్రద్ధ అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ప్రతీ కార్మికుడిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ షాన్వాజ్ఖాసీం, జాయింట్ కలెక్టర్ దివ్య, సబ్కలెక్టర్ కాళీచరణ్, ఏఎస్పీ భాస్కరన్, ఆర్డీవో ఆర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.