డిఎస్ కుమారుడి సంచలనం: కాంగ్రెసులోకి కాదు బిజెపిలోకి...
తాజా పరిణామం ఒకటి డిఎస్ పార్టీ మారే విషయంపై ప్రచారానికి ఊతం ఇస్తోంది. ఆయన కాంగ్రెసులోకి కాకుండా బిజెపిలోకి వెళ్తారా అనే అనుమానాలు కారణమవుతున్నాయి.
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ తిరిగి కాంగ్రెసు గూటికి చేరుకుంటారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ వార్తలను డి. శ్రీనివాస్ ఖండించారు. ఆ వార్తలకు తాను తీవ్ర వేదనకు గురైనట్లుగా కూడా ఆయన చెప్పారు.
అయితే, తాజా పరిణామం ఒకటి డిఎస్ పార్టీ మారే విషయంపై ప్రచారానికి ఊతం ఇస్తోంది. ఆయన కాంగ్రెసులోకి కాకుండా బిజెపిలోకి వెళ్తారా అనే అనుమానాలు కారణమవుతున్నాయి. ఈ అనుమానాలకు ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ ఇచ్చిన ప్రకటనను కారణంగా చూపుతున్నారు.
భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంంగా ధర్మపురి అరవింద్ మంగళవారం ఓ జాతీయ స్థాయి పత్రికకు ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనే సంచలనంగా మారింది. అది రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.
అదేం ప్రకటన....
ధర్మపురి అరవింద్ ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కానీ అకస్మాత్తుగా ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ప్రకటనలో ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతి మొత్తం మోడీ వెంటే నిలవాలని ఆయన ఆ ప్రకటనలో పిలుపునిచ్చారు.
Recommended Video
ఇప్పటికే నందీశ్వర్ గౌడ్....
అరవింద్ ప్రకటనతో డిఎస్ పార్టీ మారే సూచనలున్నాయంటూ ప్రచారం సాగుతోంది. డిఎస్ ప్రధాన అనుచరుడైన సంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కొన్ని నెలల క్రితం బిజెపిలో చేరారు. అరవింద్ తాజా ప్రకటనతో డిఎస్ కూడా పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంంది.
పార్టీ కార్యకలాపాలకు దూరంగా...
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో కాంగ్రెసు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తెరాసలో చేరారు. రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యునిగా ఆయనకు కెసిఆర్ అవకాశం కల్పించారు. అయితే, గత కొంతకాలంగా ఆయన తెరాస కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
మరో కుమారుడు పూర్తిగా దూరం....
ఐదు నెలల క్రితం తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే, డిఎస్ కుమారుడు సంజయ్ తన సభ్యత్వాన్ని రెన్యూవల్ చేయించుకోలేదని చెబుతున్నారు. తెరాసతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న డిఎస్ కుటుంబ సభ్యులు బిజెపికి దగ్గరైనట్లు చెబుతున్నారు. అరవింద్ ఇటీవల బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాను కలిసినట్లు తెలుస్తోంది. తాను ఇచ్చిన ప్రకటనతో తన తండ్రికి ఏవిధమైన సంబంధం లేదని అరవింద్ ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక ప్రతినిధితో చెపపారు. తాను ఇప్పట్లో బిజెపిలో చేరడం లేదని, అలాంటిది ఏమైనా ఉంటే చెబుతానని ఆయన అన్నట్లు ఆ పత్రిక రాసింది.