రేవంత్ ఎఫెక్ట్: జగన్ను కంగారెత్తించి దెబ్బతిన్న బాబు
హైదరాబాద్/విజయవాడ: రాజ్యసభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఏపీలో చివరి నిమిషం వరకు ఉత్కంఠను రేపింది. తెలుగుదేశం పార్టీ నాలుగో అభ్యర్థిని నిలబెడుతుందా? అలా అభ్యర్థిని నిలబెడితే అన్ని స్థానాలకు పోటీ తప్పదా? అనే ఉత్కంఠ కొనసాగింది.
ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ నాలుగో అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకుంది. నాలుగు స్థానాలో ఖాళీ ఉండటం, నలుగురే పోటీలో ఉండటంతో ఎట్టకేలకు ఏకగ్రీవం కానున్నాయి. టిడిపి నుంచి సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, బీజేపీ నుంచి సురేష్ ప్రభు, వైసిపి నుంచి విజయసాయి నామినేషన్ వేశారు.
ఓ విధంగా, నాలుగో అభ్యర్థిని నిలబెడతామని మూడు నాలుగు నెలలుగా ప్రచారం చేయడం ద్వారా వైసిపి అధినేత వైయస్ జగన్, ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేల్లో తెలుగుదేశం రైళ్లు పరుగెత్తించిందనే చెప్పవచ్చు. కానీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గి జగన్కు ఊరట కల్పించారు.
క్యాంప్ రాజకీయాలు
టిడిపి నాలుగో అభ్యర్థిని నిలబెడుతుందనే ఆందోళనతో జగన్ ముందుగానే క్యాంపు రాజకీయాలు నడిపారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను గోవా, శ్రీలంక తదితర చోట్లకు పంపించారు. తద్వారా టిడిపి నాలుగో అభ్యర్థిని నిలబెడితే.. తన పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు బుట్టలో పడకుండా జాగ్రత్త పడ్డారు.
జగన్ను, వైసీపిని అంతగా కంగారు పెట్టిన టిడిపి చివరి నిమిషంలో మాత్రం నాలుగో అభ్యర్థి పైన చేతులు ఎత్తేసింది. ఓ విధంగా జగన్ పార్టీ అంతగా కంగారు పడినప్పటికీ... తెలుగుదేశం పార్టీ పైన ఇది వైసిపికి నైతిక విజయమని చెప్పవచ్చు.
టిడిపి తగ్గడం వెనుక ఎన్నో కారణాలు
గత మూడు నాలుగు నెలలుగా నాలుగో అభ్యర్థిని నిలబెడతామని, విజయ సాయి రెడ్డి గెలవకుండా చేస్తామని టిడిపి సవాల్ చేసింది. నామినేషన్ ప్రక్రియ చివరి రోజు వరకు నాలుగో అభ్యర్థి పైన చర్చ జరిగింది. చివరి నిమిషం వరకు చర్చ జరిగినా టిడిపి నాలుగో అభ్యర్థిని నిలబెట్టలేదు.
దీనికి పలు కారణాలు ఉన్నాయి. వైసిపి నుంచి టిడిపిలో చేరిన 17 మంది ఎమ్మెల్యేలతోనే నాలుగో అభ్యర్థి గెలిచే పరిస్థితి లేదు. దీంతో, వైసిపి నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేల మద్దతు నాలుగో అభ్యర్థికి అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో అది కనిపించడం లేదు. దీంతో బాబు వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది.
మరో కారణం కూడా వినిపిస్తోంది. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఏపీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేశారని, నాలుగో అభ్యర్థిని బరిలోకి దింపితో అన్ని స్థానాలకు ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుందని, గెలిచే పరిస్థితి లేనప్పుడు సరికాదని చెప్పారని తెలుస్తోంది.
మరో విషయమేమంటే.. నాలుగో అభ్యర్థిని కేవలం వైసిపి నుంచి టిడిపిలో చేరిన 17 మంది ఎమ్మెల్యేల మద్దతుతోనే గెలిపించుకోలేరు. వైసిపి ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో నాలుగో అభ్యర్థి గెలిచినా ఆ మచ్చ చంద్రబాబుపై ఉంటుందని అంటున్నారు.
ఇప్పటికే ఓటుకు నోటు కేసు విషయమై చంద్రబాబు విమర్శలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో ఓ ఎమ్మెల్సీని గెలుపించుకునేందుకు చంద్రబాబు రూ.5 కోట్లు ఇవ్వజూపారని విమర్శిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి పట్టుబడిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అసలు ఏపీలో గెలవలేని నాలుగో రాజ్యసభ సీటును టిడిపి గెలిస్తే అది కచ్చితంగా ఓటుకు నోటు అని జగన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసే అవకాశముంది. మరోవైపు, ఓడిపోతే పరువు పోతుంది. ఇలాంటి కారణాలతో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.