తిరుమలలో ఉగ్రవాది సుభాష్ రెక్కీ:అమ్మాయి కోసమా?
చిత్తూరు: పలు ఉగ్రవాద కేసుల్లో నిందితుడైన రామచంద్రన్ సుభాష్ కొంతకాలం కిందట తిరుమలలో సంచరించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దాదాపు నెల క్రితం పూరీ రైల్వే స్టేషన్లో నిలిపి ఉన్న రైలు దగ్ధం కేసుకుసంబంధించి ఒడిశా ప్రభుత్వ రైల్వే పోలీసులు తమిళనాడుకు చెందిన అతనిని అరెస్ట్ చేశారు.
రైలు దహనం ఘటనకు కొన్నాళ్ల ముందు తాను తిరుమలలో సంచరించినట్లు అతడు విచారణలో వెల్లడించాడు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు ఏపీ నిఘా వర్గాలకు సమాచారం ఇచ్చారు. తిరులలోని సిసి కెమెరాల్లో ఉన్న దృశ్యాలను విశ్లేషించారు.
వీటిలో రామచంద్రన్ కదలికలు కనిపించడంతో ఉలిక్కిపడ్డారు. నిఘా, భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రామచంద్రన్ సుభాష్ దేశవ్యాప్తంగా పలు హోటళ్లలో కార్మికుడిగా పని చేసేవాడు. 2011, 2012లలో అతడిపై తమిళనాడులో చోరీ కేసులు నమోదయ్యాయి.
2013లో మహారాష్ట్రలో హోటల్లో పని చేశాడు. ఆ సమయంలో కాశ్మీర్కు చెందిన రియాజ్ తదితర వ్యక్తులతో పరిచయమైంది. తాము రసాయన బాంబు తయారు చేశామని, దానిని రైళ్లలో ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తే పెద్ద ఎత్తున డబ్బులిస్తామని రామచంద్రన్కు రియాజ్ తదితరులు చెప్పారు.
అతడి ఖాతాలో రూ.3 లక్షలు వేశారు. ఢిల్లీ, కోల్కతా, ఖరగ్ పూర్ తదితర ప్రాంతాల్లో పలు ఉగ్రవాద చర్యలకు అతడు పాల్పడినట్లుగా తెలుస్తోంది. తిరుపతిలోను అతను సంచరించాడని తెలిసింది. కాగా, అతను రెక్కీ నిర్వహించి ఉంటాడని భావిస్తున్నారు.
అందుకేనా?
రామచంద్రన్ సుభాష్ తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన వాడు. ఇతను ముంబైలో పని చేస్తున్న సమయంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. డబ్బు అవసరాన్ని తీర్చుకునేందుకు రియాజ్ వేసిన ఉగ్ర పథకంలో పాలు పంచుకునేందుకు ఒప్పుకున్నాడు.
రామచంద్రన్ను ఎన్ఐఏ అధికారులు అతడిని అన్ని కోణాల్లో విచారించారు. ఈ సందర్భంగా తిరుమలలో అతడు సంచరించిన విషయం వెలుగు చూసింది. కాశ్మీర్ నుంచి ఉగ్రవాదులు అతని ఖాతాలో రూ.3 లక్షల మొత్తాన్ని జమ చేశారు. తిరుమలపై రెక్కీకి సంబందించి అతడు చెబుతున్న మాటలను తొలుత అనుమానించిన ఎన్ఐఏ అధికారులు తిరుమలలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి నిర్ధారించుకున్నారు.