కరుణానిధిని దెబ్బేసింది "ఆ ఒక్క శాతం ఓట్లే.."
చెన్నై : సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన తమిళనాడు ఎన్నికలకు సంబంధించి రోజుకో కొత్త వార్త తెర పైకి వస్తోంది. తమిళ ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే.. కేవలం ఒక్కటంటే ఒక్క శాతం ఓట్లతో 100 నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే చేతిలో ఖంగు తింది.
ఇంకా ఆశ్యర్యపరిచే విషయమేంటంటే అన్నాడీఎంకే పోటీ చేసిన 232 నియోజకవర్గాల్లో 40.07 శాతం ఓట్లను పార్టీ ఖాతాలో వేసుకోగా, డీఎంకే సొంతంగా పోటీ చేసిన 176 నియోజకవర్గాల్లో 41.05 శాతం ఓట్లను పార్టీ ఖాతాలో వేసుకుంది.
దీన్నిబట్టి అన్నాడీఎంకే కంటే, డీఎంకే పార్టీకే ప్రజల్లో ఆదరణ పెరిగిందనేది స్పష్టమవుతోంది. డీఎంకే ఓటమి పాలైన స్థానాల్లో కేవలం ఒక్క శాతం ఓట్లే పార్టీని గెలుపుకు దూరం చేశాయి. డీఎంకే ఓడిపోయిన స్థానాల్లో 39.8 శాతం ఓట్లు పార్టీకి పోల్ అవగా, అన్నాడీఎంకే కి 40.8 శాతం ఓట్లు పోల్ అయ్యాయి.
డీఎంకే కూటమికి పోల్ అయిన 39.8 శాతం ఓట్లలో డీఎంకే 31.6 శాతం, కాంగ్రెస్ 39.8 శాతం, ఇండియన్ ముస్లిం లీగ్ 0.7 శాతం, ఎంఎంకే 0.5 శాతం, పుదియ తమిళగం 0.5 శాతం ఓట్లు సాధించాయి.
ఇకపోతే.. డబ్బు ప్రలోభాలు, ఈవీఎంలలో లొపాలు వంటి ఆరోపణలతో మే 23వ తేదీకి వాయిదా పడ్డ తంజావూరు, అరవ కురిచ్చి నియోజకవర్గాల ఎన్నికలు మరోమారు వాయిదా పడ్డాయి. ఎన్నికలపై స్టే ఇవ్వాలని కోరుతూ ముగ్గురు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించడంతో శుక్రవారం విచారణ చేపట్టింది హైకోర్టు.
విచారణకు హాజరైన ఎన్నికల కమిషన తరఫున న్యాయవాది.. ఆ 2 నియోజక వర్గాల్లోనూ ఎన్నికను మూడు వారాలపాటు వాయిదా వేశామని తెలిపారు. పోలింగ్ తేదీని పూర్తి విచారణ తర్వాత ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక జయలలిత విషయానికి వస్తే.. ఆరోసారి తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జయలలిత, పార్టీ శాసనసభ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్థిక శాఖ మంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి 133 మంది ఎమ్మెల్యేలు హాజరై ఏకగ్రీవ మద్దతు ప్రకటించారు. శనివారం గవర్నర్ రోశయ్యను కలిసి ఏకగ్రీవ ఎన్నిక గురించి ఆయనకు తెలియపరచనున్నారు.