చేరారు సరే: పురంధేశ్వరి సహా నేతల డైలమా
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెసుపై పట్టరాని ఆగ్రహంతో బిజెపిలో చేరిన ఆంధ్రప్రదేశ్ నేతలు భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణంగా చంద్రబాబు ప్రభుత్వంపై పోరాడలేని నిస్సహాయ స్థితి ఓ వైపు, పార్టీలో తమకు తగిన ప్రాధాన్యత లేకపోవడం మరోవైపు వారిని వేధిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.
యుపిఎ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన దగ్గుబాటి పురంధేశ్వరి, కావూరి సాంబశివ రావు వంటి పలువురు దిగ్గజాలు బిజెపిలో చేరారు. అప్పుడప్పుడు వారు చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడే ప్రయత్నాలు చేస్తున్నా వాటిపై బిజెపి అధినాయకత్వం నీళ్లు చల్లుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
బిజెపి అధిష్టానం తమ పార్టీలోకి వలస వచ్చినవారిపై చిన్నచూపు చూస్తోందనే అభిప్రాయం ఉంది. దక్షణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో బలపడాలని చూస్తున్న బిజెపి అధిష్టానం వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఏపిలో పేరుమోసిన నేతలు కాంగ్రెస్ పార్టీని వీడి తమ పార్టీలోకి వచ్చారు. అయితే వారి కన్నా తమ మాతృసంస్థ(ఆర్ఎస్ఎస్) లో పనిచేసి బిజెపిలో కొనసాగుతున్న నేతలకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది.
ఆ కారణఁగా బిజెపిలో చేరిన తమకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా బిజెపి నాయకత్వం చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్తు కోసం బిజెపిలో చేరిన ఆ రాజకీయ నాయకుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తమను పార్టీలో చేర్చుకున్నప్పటికీ పార్టీ కీలక పదవుల్లో మాత్రం తమ పాత బిజెపి నాయకత్వం పాత నాయకులనే నియమిస్తోంది. కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉందని చెప్పుకోవడానికే తప్ప వారికి మరో ప్రయోజనం లేకుండా పోయిందనే మాట వినిపిస్తోంది. బిజెపిలో తగిన స్థానం దక్కడం లేదని బెంగటిల్లుతున్న ఈ నాయకులు అటు టిడిపిలోనూ ఇటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనూ చేరలేరు.